2025-26 యాషెస్ సిరీస్లో ఐదవ టెస్ట్ జనవరి 4-8 మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టులో రెండు మార్పులు చేయబడ్డాయి. ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్, స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తొలగించారు. ఇంగ్లండ్ సిరీస్లో 3-1 తేడాతో వెనుకబడి ఉన్నప్పటికీ.. సిరీస్ను విజయంతో ముగించాలని చూస్తుంది. మెల్బోర్న్లో జరిగిన నాల్గవ టెస్ట్ను ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే.
27 ఏళ్ల మాథ్యూ పాట్స్ యాషెస్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. చివరి టెస్ట్ కోసం ప్లేయింగ్ XIలో పాట్స్ ఆడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తరఫున పాట్స్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. చివరిగా డిసెంబర్ 2024లో ఆడాడు. టెస్టులో 29.44 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. దేశీయ క్రికెట్లో డర్హామ్ తరపున అతను ఆడుతున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో పాట్స్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 72 మ్యాచ్ల్లో 277 వికెట్లు తీసుకున్నాడు. మరి చివరి టెస్టులో పాట్స్ ఎలా రాణిస్తాడో చూడాలి.
2024లో భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేశాడు. 19 టెస్టుల్లో 39.00 సగటుతో 68 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్లలో రెండు ఫోర్-వికెట్ హాల్స్, నాలుగు ఐదు వికెట్ల హాల్స్ సాధించాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ను జట్టులో చేర్చుకోవడం ఇదే మొదటిసారి. ఆల్ రౌండర్ విల్ జాక్స్ ఏకైక స్పిన్ బౌలింగ్ ఎంపిక. గత 18 నెలలుగా బషీర్ జట్టు మొదటి ఎంపిక స్పిన్నర్.
ఐదవ టెస్ట్కు అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. అంతకు ముందు మార్క్ వుడ్ మోకాలి గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. వుడ్ మొదటి టెస్ట్లో ఆడాడు. జోఫ్రా ఆర్చర్ కూడా మొదటి మూడు టెస్ట్లలో ఆడాడు. సైడ్ స్ట్రెయిన్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.
ఐదవ యాషెస్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.
