Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!

Asian Games 2026 Cricket Schedule

Asian Games 2026 Cricket Schedule

Asian Games 2026 Cricket Schedule: జపాన్‌ వేదికగా జరగబోయే ఆసియా గేమ్స్‌ 2026లో క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. భారత క్రికెట్‌ అభిమానులకు అక్టోబర్‌ 3 ప్రత్యేకంగా నిలవనుంది. పురుషుల విభాగంలో భారత్‌ ఫైనల్‌కు చేరితే.. అదే రోజున రెండు వేర్వేరు దేశాల్లో 2 భారత జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆసియా క్రీడల క్రికెట్‌ మ్యాచ్‌ జపాన్‌లో జరగనుండగా.. అదే రోజు వెస్టిండీస్‌తో భారత్‌ మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనుంది. 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్‌ పోటీలు సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్‌ 28న క్వార్టర్‌ ఫైనల్‌:

మహిళల విభాగంలో భారత్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. సెప్టెంబర్‌ 18న క్వార్టర్‌ ఫైనల్స్‌ జరగనుండగా.. సెప్టెంబర్‌ 20న సెమీఫైనల్స్‌, సెప్టెంబర్‌ 22న పతక పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల క్రికెట్‌ పోటీలు సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభమవుతాయి. భారత్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌లో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్‌ 28న క్వార్టర్‌ ఫైనల్‌, అక్టోబర్‌ 1న సెమీఫైనల్స్‌ జరుగుతాయి. అక్టోబర్‌ 3న స్వర్ణ, కాంస్య పతక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్నాయి.

రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు:
అక్టోబర్‌ 3న ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు చేరితే ఆసక్తికరమైన పరిస్థితి ఉంటుంది. అదే రోజున వెస్టిండీస్‌తో భారత్‌ మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనుంది. దీంతో ఒకవేళ ఆసియా క్రీడల ఫైనల్‌కు భారత్‌ చేరితే.. ఒక భారత జట్టు జపాన్‌లో, మరో భారత జట్టు న్యూ చండీగఢ్‌లో ఒకే రోజు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇలాంటి పరిస్థితి భారత క్రికెట్‌లో ఇదే తొలిసారి కాదు. 1998 సెప్టెంబర్‌ 12న కూడా భారత్‌ ఒకే రోజున రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడింది. అప్పట్లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌తో పాటు టొరంటోలో జరిగిన సహారా ఫ్రెండ్‌షిప్‌ కప్‌లో భారత జట్లు బరిలోకి దిగాయి.

హెడ్‌ కోచ్‌గా లక్ష్మణ్‌, మజుందార్:
ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గౌతమ్‌ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో.. లక్ష్మణ్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్‌తో పాటు సునీల్‌ జోషి, హృషీకేశ్‌ కనిట్కర్‌, సుభదీప్‌ ఘోష్‌ కోచింగ్‌ బృందంలో ఉంటారు. జింబాబ్వేతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్‌ భారత జట్టుకు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మహిళల జట్టుకు అమోల్‌ మజుందార్ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా భారత్:
ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రెండు విభాగాల్లోనూ భారత్‌ స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వం వహించగా.. మహిళల జట్టును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నడిపించింది. ఈసారి కూడా భారత్‌ తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.