IPL 2022: రిషబ్ పంత్‌కు షాక్.. 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా

Rishab Pant Fine

Rishab Pant Fine

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో చేదు వార్త అందింది. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన అసలే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఆ జట్టు నిరాశలో ఉండగా.. తాజాగా కెప్టెన్ పంత్‌కు జరిమానా పడింది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆటగాళ్లను వెనక్కి రావాలని పిలిచిన రిషబ్ పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత పడింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఐపీఎల్ పాలకమండలి విధించింది.

కాగా మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం రేగుతోంది. ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. హోటల్‌లో తనతో పాటు ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారిన పడటంతో పాంటింగ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దీంతో పలువురు ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. పాంటింగ్‌కు రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతడిని ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

https://www.youtube.com/watch?v=Ro0GM2W9tVI