Kalki Avatar: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మారుతున్న జీవనశైలి, పలుచబడిన బంధాలు, రోజురోజుకూ క్షీణిస్తున్న నైతిక విలువలు చూస్తుంటే మొత్తం మానవాళి మనస్సులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది.. ఆ ప్రశ్నే ‘నిజంగానే కలియుగం అంతిమ దశకు చేరుకుందా?’ అని. ప్రతిరోజూ పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు తప్పు – ఒప్పుల మధ్య గీతను చెరిపేస్తున్నాయి. మానవత్వం నానాటికీ బలహీనపడుతోంది. అయితే ఇది కేవలం ఆధునికత తెచ్చిన మార్పా? లేక మన పురాణాలలో దశాబ్దాల క్రితమే రాసిపెట్టిన ప్రళయ సంకేతాల ప్రారంభమా? అనే కోణంలో చూస్తే కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపడుతున్నాయి.
శాస్త్రాల ప్రకారం.. భూమిపై పాపం శృతిమించినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. కలియుగంలో పెరిగిపోయిన అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు పదో అవతారమైన ‘కల్కి’గా భూమిపైకి వస్తాడని కల్కి పురాణం స్పష్టం చేస్తోంది. అయితే ఏ యుగమైనా ఒక్కసారిగా ముగిసిపోదు.. దాని అంతం మన కళ్ల ముందే మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటుంది.
పురాణాలు చెప్పిన సంకేతాలు ఇవే..
శ్రీమద్భాగవత పురాణం ప్రకారం.. కలియుగం అంతిమ దశలో మనిషి తన స్వార్థం ఆధారంగానే తప్పు – ఒప్పులను నిర్ణయిస్తాడు. నేటి డిజిటల్ ప్రపంచాన్ని గమనిస్తే ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుంది. సోషల్ మీడియాలో వేలాది మందితో కనెక్ట్ అయి ఉన్నప్పటికీ, మనిషి అంతర్గతంగా తీవ్ర ఒంటరితనంతో బాధపడుతున్నాడు. కుటుంబాలు ముక్కలవుతున్నాయి, బంధాల మర్యాదలు మంటగలుస్తున్నాయి. మరోవైపు ప్రకృతి కూడా అస్తవ్యస్తంగా మారుతోంది. నదులు కలుషితమై, పీల్చే గాలి విషతుల్యమవుతోంది. ఈ పరిస్థితులన్నీ త్వరలోనే ఒక పెద్ద ‘రీసెట్’ (యుగాంతం లేదా సృష్టి శుద్ధీకరణ) జరగబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయని పలువురు ఆధ్యాత్మిక పండితులు అభిప్రాయపడుతున్నారు.
ప్రళయ సూచనలు నిజమవుతున్నాయా..
పురాణాల ప్రకారం.. ప్రళయం అంటే కేవలం వినాశనం కాదు.. అది సృష్టిని మళ్లీ పవిత్రంగా మార్చే ఒక ప్రక్రియ. ప్రస్తుతం దేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న పరిణామాలు యుగాంతం వైపు అడుగులు పడుతున్నట్లు చూపిస్తున్నాయని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ అనే ప్రాంతంలో భగవాన్ కల్కి జన్మిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని కేదారేశ్వర్ గుహాలయంలో ఉన్న నాలుగు స్తంభాలను నాలుగు యుగాలకు ప్రతీకగా భావిస్తారు. ప్రతి యుగం అంతమైనప్పుడు ఒక్కో స్తంభం విరిగిపోతుందని, ప్రస్తుతం అక్కడ కలియుగానికి గుర్తుగా కేవలం ఒక్కటంటే ఒక్క స్తంభం మాత్రమే మిగిలి ఉందని చెబుతారు. ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంగిపోవడం, అక్కడి నరసింహస్వామి విగ్రహానికి సంబంధించిన పౌరాణిక నమ్మకాలు కూడా రాబోయే పెద్ద మార్పును సూచిస్తున్నాయని అంటున్నారు.
భగవాన్ కల్కి రూపం ఎలా ఉంటుందంటే..
ధార్మిక గ్రంథాల ప్రకారం.. కల్కి అవతారం అత్యంత తేజోవంతంగా, దివ్యంగా ఉంటుందట. ఆయన ‘దేవదత్తం’ అనే తెల్లటి గుర్రంపై చేతిలో ధగధగలాడే పదునైన ఖడ్గంతో ప్రత్యక్షమవుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన వేగం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, కనురెప్పపాటులో ఎక్కడికైనా చేరుకోగలరు. ఆయన ప్రచండ వ్యక్తిత్వాన్ని చూసి లోకంలోని అధర్మ శక్తులు, కరడుగట్టిన పాపులు వణికిపోతారని పురాణాలు పేర్కొంటున్నాయి. పురాణాల ప్రకారం.. చిరంజీవి అయిన భగవాన్ పరశురాముడు కల్కి అవతారానికి గురువుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఆయనే కల్కికి యుద్ధ నైపుణ్యాలు, అస్త్ర – శస్త్ర ప్రయోగాలను నేర్పిస్తారని విశ్వసిస్తున్నారు. పరశురాముడి మార్గదర్శకత్వంలో సర్వసన్నద్ధుడైన తర్వాతే కల్కి ధర్మ రక్షణ కోసం కదనరంగంలోకి దూకుతాడని చెబుతున్నారు.
కల్కి తలపడేది ఎవరితో అంటే..
కల్కి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భూ ప్రపంచం నుంచి పాపాన్ని, అన్యాయాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టడమే. సమాజంలో అత్యాచారాలు, అక్రమాలకు పాల్పడే పాలకులను, దుర్మార్గులను ఆయన సంహరిస్తాడు. అయితే ఆయన ప్రధాన పోరాటం కలియుగంలో ఉండే అన్ని రకాల ప్రతికూలతలకు, చెడుకు ప్రతీక అయిన ‘కలి’ అనే రాక్షస శక్తితోనే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆయుధాల యుద్ధం మాత్రమే కాదని.. మంచికి, చెడుకు మధ్య జరిగే ఒక మహా సంగ్రామం అని పేర్కొంటున్నాయి. ఈ యుద్ధం ముగిశాక, కల్కి మళ్లీ సత్యయుగాన్ని (కృతయుగం) స్థాపించి భూమిపై సమతుల్యతను తీసుకువస్తాడని నమ్ముతున్నారు. చివరగా.. కలియుగం ముగింపు అనేది కేవలం బాహ్య సంఘటనలపైనే ఆధారపడి లేదని, అది మన అంతరాత్మలో సాగే ధర్మ – అధర్మాల పోరాటం అని పేర్కొంటున్నారు. మనం చేసే సత్కర్మలే రాబోయే కాలంలో మనం ఏ వైపు నిలబడాలో నిర్ణయిస్తాయని చెబుతున్నారు.
