1991 India Gold Crisis: భారతదేశ చరిత్రలో ‘బంగారం’ అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు.. అది జాతీయ గర్వానికి, సెంటిమెంట్కు ప్రతీక. కానీ సరిగ్గా 35 ఏళ్ల క్రితం, దేశం అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు.. అదే బంగారాన్ని బ్రిటన్ బ్యాంకుల్లో రహస్యంగా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నాడు విమానాల్లో దేశం దాటిన ఆ బంగారం కథ, నేడు మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) యుద్ధం వేళ ప్రధాని మోడీ చేసిన తాజా విజ్ఞప్తితో మరోసారి తెరపైకి వచ్చింది. అసలు 1991 లో ఏం జరిగింది.. అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ ఒక్క శీర్షిక.. దేశానికే పెద్ద దిగ్భ్రాంతి
1991 జూలై 8వ తేదీన ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ దినపత్రిక కవర్ పేజీపై వచ్చిన ఒక వార్త, ఫోటో దేశాన్ని కుదిపేసింది. బొంబాయి (ముంబై) లోని శాంతా క్రూజ్ విమానాశ్రయంలో రాత్రికి రాత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వ్యాన్ల నుంచి భారీ పెట్టెలను కార్గో విమానంలోకి ఎక్కిస్తున్న దృశ్యం అది. ఆ పెట్టెల్లో ఉన్నది మరేదో కాదు.. దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచిన 47 టన్నుల (47,000 కిలోల) నిఖార్సైన బంగారం. రాజకీయ అస్థిరత, 1991 నాటి గల్ఫ్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దేశంలో విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) పూర్తిగా అడుగంటాయి. కేవలం వారం రోజుల దిగుమతులకు కూడా చెల్లించడానికి డాలర్లు లేని స్థితిలో, అప్పటి చంద్రశేఖర్ తాత్కాలిక ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది.
దేశం రుణ ఎగవేతదారుగా మిగలకుండా ఉండేందుకు ఆర్బిఐ గవర్నర్ ఎస్.వెంకిటరమణన్ నేతృత్వంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల వద్ద ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణాన్ని సమీకరించారు. అంతకుముందే $215 మిలియన్ల కోసం మరో 20 టన్నుల జప్తు చేసిన బంగారాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో జాతీయ అవమానంగా భావించబడినప్పటికీ, తదనంతరం పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ల చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలకు (సరళీకరణ) ఇదే పునాదిగా మారింది.
నెహ్రూ కాలం నాటి ఆంక్షలు..
స్వాతంత్ర్యానంతరం కూడా బంగారం దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. 1962 చైనా యుద్ధం తర్వాత మారకద్రవ్య కొరత ఏర్పడటంతో, 1968లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ‘బంగారు నియంత్రణ చట్టాన్ని’ తెచ్చారు. దీని ప్రకారం పౌరులు కడ్డీలు, నాణేలు ఉంచుకోవడం నిషేధించారు. నగల వ్యాపారులు 14 క్యారెట్ల కంటే ఎక్కువ నాణ్యత గల ఆభరణాలు చేయకూడదని (1963లోనే) ఆంక్షలు పెట్టారు. అయితే ఈ ఆంక్షలు విఫలమై.. కేరళ, గుజరాత్, మహారాష్ట్ర తీరాల ద్వారా దేశంలోకి ‘బంగారు స్మగ్లింగ్’ భారీగా పెరగడానికి కారణమయ్యాయి.
1991 నాటి సంక్షోభం..
గత మూడు దశాబ్దాలలో భారతదేశ ఆర్థిక చిత్రం పూర్తిగా మారిపోయింది. నాటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ఫారెక్స్ నిల్వలు విపరీతంగా పెరిగాయి. 1991లో కేవలం వారం రోజులకు సరిపడా నిధులు మాత్రమే ఉండగా.. సుమారు 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టారు. 2026 నాటి పరిస్థితి పరిశీలిస్తే.. ప్రస్తుతం ఆర్బిఐ వద్ద ఏకంగా 115 బిలియన్ డాలర్లకు పైగా విలువైన 880.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. నాడు విమానాల్లో బ్రిటన్ వెళ్లిన బంగారానికి పూర్తి భిన్నంగా.. ఇటీవలి కాలంలో ఆర్బిఐ విదేశీ ఖజానాల నుంచి 100 టన్నులకు పైగా బంగారాన్ని తిరిగి ఇండియాకు రప్పించింది. ప్రస్తుతం ఆర్బిఐ మొత్తం బంగారంలో 77 శాతం (సుమారు 680 టన్నులు) దేశీయంగానే సురక్షితంగా నిల్వ ఉంది.
యుద్ధ భయాల వేళ ప్రధాని కీలక విజ్ఞప్తి
భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది 1991లో తాకట్టు ద్వారా పొందిన రుణం కంటే 178 రెట్లు ఎక్కువ. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నడుస్తున్న అమెరికా – ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. ఇది భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడిని తెస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయులకు ఒక కీలకమైన పిలుపునిచ్చారు. రూపాయి విలువను, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పాటు అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, వీలైనంత వరకు ఐటీ రంగాలు వర్క్-ఫ్రమ్-హోమ్ పాటించాలని సూచించారు. ఈ విజ్ఞప్తి అనంతరం విదేశీ బంగారంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాలను కూడా పెంచింది. శతాబ్దాలు మారినా.. యుద్ధాలు మారినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను శాసించడంలో ‘బంగారం’ ఇప్పటికీ అత్యంత కీలక పాత్ర పోషిస్తూనే ఉందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం అని విశ్లేషకులు చెబుతున్నారు.
