Site icon NTV Telugu

OTR: టిడిపి నేతలకు సింబల్ సంకటం..! ఖమ్మంలో రాజకీయ ట్విస్ట్..!

OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ చెప్పుకోతగ్గ బలం ఉందని అంటారు. పార్టీ పునాదుల బలం కావచ్చు, సామాజిక సమీకరణల లెక్కలు కావచ్చు. కారణం ఏదైనా…. ఇక్కడ గెలుపు ఓటముల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. అందుకు తగ్గట్టే ఏపీలో ఏం జరిగినా…. ఇక్కడి టీడీపీ అభిమానులు రియాక్ట్‌ అవుతుంటారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతి, వర్థంతి కార్యక్రమాలు సైతం ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే… ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల టీడీపీ గెలిచింది. అయితే అప్పుడు పార్టీ గుర్తుల సమస్యలు, బీ ఫామ్స్‌ గొడవలు లేవు. కానీ…. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ రెండూ ఉన్నాయి. చాలా చోట్ల తెలుగుదేశం నాయకులు పోటీలో ఉన్నారు కూడా. కానీ…. పార్టీ అధిష్టానం మాత్రం తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అందుకు తగ్గట్టే నాయకులకు ఏ ఫామ్స్‌గాని, బీ ఫామ్స్‌గాని ఇవ్వలేదు. బరిలో ఉన్న నాయకులకు ఇక్కడే అసలు సంకటం మొదలైంది.

READ ALSO: OTR: వారసుడి ఎంట్రీ.. శ్రీకాకుళం టీడీపీలో వర్గపోరు!

కూటమి రూపంలో ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తు ఉన్నా… ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. పైగా… టీడీపీ నాయకులు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐతో మంతనాలు జరపడం, వాళ్ళ పొత్తుతో పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఈ సంప్రదింపుల్లో భాగంగానే…. కృష్ణా జిల్లా సరిహద్దులో ఉన్న మధిరలో టీడీపీకి నాలుగు ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే… పార్టీ నుంచి అధికారిక సమ్మతి లేనందున ఇండిపెండెట్స్‌గా నామినేషన్స్‌ వేశారు నాయకులు. ఆ నాలుగింట్లో ఒకచోట పోటీ టీడీపీ వర్సెస్‌ టీడీపీ అన్నట్టుగానే ఉండటంతో… ఒక వర్గానికి బీఆర్‌ఎస్‌ మద్దతిస్తూ తన అజెండా అమలు చేయడం ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. ఇక భద్రాద్రి జిల్లాకు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కొత్తగూడెంలో టీడీపీకి సీపీఐతో అవగాహన కుదిరింది. ఈ క్రమంలోనే నాలుగు సీట్లు దక్కగా…. ఆ నలుగురు అభ్యర్థులు ఆ నలుగురు అభ్యర్థులు పేరుకు టీడీపీ వాళ్ళయినా… సిపిఐకి చెందిన కంకి కొడవలి గుర్తు మీద పోటీలో ఉన్నారు. తెలుగుదేశం అధిష్టానం బీ ఫామ్‌ ఇవ్వలేదు కాబట్టి సైకిల్‌ గుర్తు రాదు. అలాగని మధిరలోలాగా ఇక్కడ ఇండిపెండెంట్స్‌గా పోటీ చేస్తే… తేడాకొట్టే ప్రమాదం ఉందన్న అంచనాతో… మెడలో పసుపు కండువాతో ఎర్ర పార్టీ సింబల్‌ మీద పోటీకి సై అన్నారట. అంటే…. టీడీపీ నాయకులకు టెక్నికల్‌గా సీపీఐ బీ ఫామ్స్‌ దక్కాయన్న మాట. ఇక అశ్వారావుపేట మున్సిపాలిటీలో టీడీపీ నాయకులకు బీఆర్‌ఎస్‌తో అలయెన్స్‌ కుదిరింది. ఇది కూడా ఏపీకి సరిహద్దులో ఉండటంతో… ఇక్కడ తెలుగుదేశం ప్రభావం ఉంటుందన్న అంచనాతో గులాబీ పార్టీ రెండు సీట్లు ఇవ్వగా…. ఒక్కదాంట్లో పోటీ చేస్తోంది టీడీపీ.

ఈ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం నాయకుడు టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌తో బరిలో ఉన్నట్టు. ఆ లెక్కన చూస్తే… అశ్వారావుపేట టీడీపీ అభిమానులంతా తాము బద్ద శత్రువుగా భావించే బీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటేయాల్సి వస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. అటు టీడీపీ బలంగా ఉందని చెప్పుకునే సత్తుపల్లిలో మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్స్‌గా బరిలో ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ఇక్కడే సరికొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేం బలంగా ఉన్నామని చెప్పుకునే తెలుగుదేశం పోటీకి వచ్చేసరికి ఎందుకు పట్టించుకోవడం లేదన్నది చాలా మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మొత్తం మీద ఇక్కడి టీడీపీ నాయకులు కొన్ని చోట్ల కంకి కొడవలి, మరికొన్ని చోట్ల కారు గుర్తుల మీద పోటీ చేయడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

READ ALSO: OTR: మున్సిపల్‌ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్‌గా ఉన్న కేంద్ర పార్టీ!

Exit mobile version