NTV Telugu Site icon

ఆ అధికారికి ఏమైంది..? ఎందుకు కలెక్టరేట్ కు రావడం లేదు..?

కలెక్టర్‌ కనిపించడం లేదు. రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన వాళ్ల కామెంట్‌ ఇది. ఆయన 3 వారాలుగా కలెక్టరేట్‌కు రావడం లేదట. మంత్రులు వస్తే కనిపిస్తున్నారు కానీ.. వర్క్‌ మాత్రం ఇంకెక్కడి నుంచో చేస్తున్నారట. దీంతో ఆ అధికారికి ఏమైంది? ఎందుకు కలెక్టరేట్‌కు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.

కలెక్టరేట్‌కు కలెక్టర్‌ ఎందుకు రావడం లేదు?

అమోయ్‌ కుమార్‌. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌. జిల్లాకు బాస్‌ కావడంతో పని ఒత్తిడి.. ఇతరత్రా రాజకీయ ప్రెజర్స్‌ కామన్‌. వీటిని తెలివిగా అధిగమిస్తారు కొందరు అధికారులు. ఒత్తిడి భరించలేని వారు సెలవుపై వెళ్తారు. మరికొందరు ఇంకేదో ప్రత్యామ్నాయం చూసుకుంటారు. మరి .. అమోయ్‌కుమార్‌కు ఏమైందో ఏమో.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి 3 వారాలైందట. జిల్లాలో జరిగే మంత్రుల పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నా.. కలెక్టరేట్‌కు ఎందుకు రావడం లేదన్నదే ఉద్యోగ వర్గాల్లో ప్రశ్నగా మారింది.

కలెక్టర్‌తో మాట్లాడాలని వచ్చివారు నిరాశతో వెళ్లిపోతున్నారట!

వివిధ పనులపై కలెక్టర్‌తో మాట్లాడేందుకు వచ్చే అధికారులు.. సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్‌కు వచ్చే జనాలు రోజంతా వేచి చూసి ఉస్సూరు మంటూ వెనుదిరుగుతున్నారట. జిల్లా స్థాయిలో జరిగే మీటింగ్‌లు ఎలా ఉన్నా.. సీఎస్‌ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు కలెక్టరేట్‌ నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచో అటెండ్‌ అవుతున్నారట. చివరకు వివిధ పార్టీల నేతలు కలెక్టర్‌తో మాట్లాడాలని వచ్చినా నిరాశే ఎదురవుతున్నట్టు చెబుతున్నారు.

Read Also : బాలకృష్ణ చేతుల మీదుగా “నాట్యం” ఫస్ట్ సింగిల్

ధరణి సమస్యలతో కలెక్టర్‌ సతమతం?

కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌.. కలెక్టరేట్‌కు రాకపోవడంపై ఉద్యోగవర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సమస్యలతో ఆయన సతమతం అవుతున్నట్టు కలెక్టరేట్‌లో వినిపిస్తున్న టాక్‌. హైదరాబాద్‌కు గుండెకాయైన రంగారెడ్డి జిల్లాలో ధరణి అమలు సవాల్‌గా మారిందట. విలువైన భూములు ఉండటం.. చాలా ల్యాండ్స్‌ వివాదాల్లో చిక్కుకోవడంతో.. ఏం చేస్తే ఏమౌతుందో అన్న ఆందోళనలో కలెక్టర్‌ ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారట.

రోజుకో మండలంలో రహస్యంగా పర్యటిస్తున్నారా?

వివాదాస్పద భూముల విషయంలో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు సహజం. ఇదే అంశంపై విపక్ష పార్టీల విమర్శలు కామన్‌. ఇవేమన్నా కలెక్టర్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అన్నది మిస్టరీగా ఉందట. అయితే ధరణి సమస్యల పరిష్కారం కోసం రోజుకో మండలంలో కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ రహస్యంగా విచారణ చేస్తున్నారనే వాదనా ఉంది. విలువైన భూముల విషయంలో ఆయన ఒక ప్రణాళిక ప్రకారం వర్కవుట్‌ చేస్తున్నారనే వారూ ఉన్నారు. ఈ కారణాల వల్లే అమోయ్‌ కుమార్‌ మూడు వారాలుగా కలెక్టరేట్‌కు రావడం లేదన్నది కొందరు ఉద్యోగుల వాదన. కాకపోతే ఇవన్నీ ప్రచారంలో ఉన్న అంశాలే. కలెక్టర్‌ స్వయంగా నోరు విప్పితే కానీ.. గుట్టు వీడదు. కలెక్టరేట్‌కు వచ్చిన వారు మాత్రం మా కలెక్టర్‌ కనిపించడం లేదు అని కామెంట్స్‌ చేస్తున్నారట. మరి.. అసలు సంగతేంటో కలెక్టగారే చెప్పాలి.