OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!

  • తిరుపతి లోక్‌సభ సీటులో రెండు సార్లు పనబాక లక్ష్మి ఓటమి..
  • 2024లో పోటీ చేయాలనుకున్నా బీజేపీ కోటాలోకి సీటు..
  • ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, టీటీడీ బోర్డ్‌ మెంబర్‌
Otr

Otr

వచ్చే ఎన్నికలలో పోటీ కోసం ఆ కేంద్ర మాజీ మంత్రి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? జిల్లా అధ్యక్షురాలి హోదాలో పరిచయాలు పెంచుకుంటున్నారా? కేవలం తనకే కాదు… భర్తకు కూడా టిక్కెట్‌ కావాలంటూ టీడీపీ అధిష్టానానికి ఫ్యామిలీ ప్యాక్‌ ప్రపోజల్‌ పెట్టబోతున్నారా? ఎవరా ఎక్స్‌ మినిస్టర్‌? ఆమె ప్లాన్స్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?

పనబాక లక్ష్మి.. దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడిచినప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకురాలు. కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన నేత ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా… టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. ఆమె భర్త, రిటైర్డ్ IRS అధికారి పనబాక కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరూ…ఆ తర్వాతి రాజకీయ పరిణామాలతో రాజీనామా చేసి కొద్ది రోజులు యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోలేక కొన్నిఅవకాశాలను చేజార్చుకున్నారన్న అభిప్రాయం వీరి అనుచరుల్లో వ్యక్తమైంది.

ఇక 2019 మార్చిలో టీడీపీలో చేరి..సైకిల్‌ గుర్తు మీద లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు పనబాక లక్ష్మి. 2020 ఉప ఎన్నికలో పోటీ చేసినా గెలుపు దక్కలేదు. ఇక 2024లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నా…బీజేపీ రూపంలో షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కమలం పార్టీకి వెళ్లడంతో పనబాకకు నిరాశ తప్పలేదు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆమెను తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా, అలాగే టిటిడి బోర్డు మెంబర్‌గా నియమించారు.ఈ క్రమంలో మళ్లీ తిరుపతి ఎంపీ సీట్లో పోటీ చేసేందుకు పనబాక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ ఎస్సీ రిజర్వ్‌ సెగ్మెంట్‌లో టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆమెకు ప్లస్‌ అవుతోందని అంటున్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో.. సత్యవేడు, సూళ్లూరుపేట, కొంత భాగం గూడూరు ఉంది. ఇవన్నీ ఎస్సీ నియోజకవర్గాలు. దాంతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉండడంతో ఈసారి కూడా తిరుపతి బరిలో దిగే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆర్థిక వనరులు ఆశించిన స్థాయిలో లేకపోయినా.. రాజకీయ పరిచయాలతో నెట్టుకు రావొచ్చన్నది పనబాక దంపతుల లెక్కగా చెబుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలి హోదాలో ఆమె అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారట.

అలాగే… తన సామాజికవర్గానికి చెందిన నేతలతో ర్యాపో మెయిన్‌టెయిన్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే…..ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన చర్చ సైతం నడుస్తోంది. తన భర్త పనబాక కృష్ణయ్యను కూడా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న భావనలో ఆమె ఉన్నట్టు చెబుతున్నారు అనుచరులు. ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు సత్యవేడుకు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు.

ఇక సూళ్లూరుపేటలో విజయశ్రీ, గూడూరులో పాశం సునీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ రెండు నియోజకవర్గాలల్లో పనబాకకు కాస్తో కూస్తో పట్టుంది. ఈ క్రమంలో అవకాశం ఇస్తే… రెండిటిలో ఏదో ఒకదాంట్లో కృష్ణయ్యను బరిలో దింపాలనుకుంటున్నారట. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… కొత్తగా ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గ ఏర్పడుతుందని.. అక్కడి నుంచి అయినా అవకాశం ఇప్పించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… ఛాన్స్‌ దొరికినప్పుడల్లా…భర్తను సీనియర్ పొలిటీషియన్ హోదాలో కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారట. 2029 ఎన్నికల్లో టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, ఆ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గ నుంచి ఆమె భర్త కృష్ణయ్య బరిలో ఉంటారని వారి అనుచరులు చెబుతుంటే.. కృష్ణయ్యకు ఇంకా పొలిటికల్‌ కెరీర్‌ ఉందా అంటూ కాస్త సెటైరికల్‌గా ప్రశ్నించే వాళ్ళకు సైతం తక్కువ లేదు. 2009, 2014లో గూడూరు నుంచి పోటీ చేస… రెండు సార్లూ ఓడిపోయారాయన. అలాగే… గత ఎన్నికల్లో గూడూరు నుంచి పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారట.

కానీ… పాశం సునీల్ ఉండటంతో అధిష్టానం కృష్ణయ్య వైపు చూడలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికలలో టికెట్ మీద ఆయన ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చుగానీ….ఎక్కడా ఆ అవకాశం మాత్రం కనిపించడంలేదని వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. వయస్సు రీత్యా కూడా ఆయన తిరగలేక పోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఆ ఫ్యామిలీ వీక్ అని, తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో బలమైన ఎస్సీ అభ్యర్థి దొరక్కపోతేనే…పనబాక లక్ష్మికి కూడా ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. గట్టి అభ్యర్థి ఎవరైనా దొరికితే ఆమెకు కూడా కష్టమేనన్నది లోకల్‌ వాయిస్‌. మొత్తం మీద రాజకీయ ఉనికి కోసం పనబాక కుటుంబం పడుతున్న ఆరాటం మాత్రం చర్చనీయాంశంమైంది.