OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?

Ycp

Ycp

 

ప్రజా సమస్యలపై ఇన్నాళ్ళు ఒంటరి పోరాటాలు చేసిన వైసీపీ…. ఇకపై వ్యూహం మార్చబోతోందా..? అధికార కూటమిని ఎదుర్కోవడానికి ఇతర పార్టీలతో చేతులు కలపాలని అనుకుంటోందా? నియోజక‌వ‌ర్గాల నుంచి…. రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ అందివచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోవాలని ఫిక్స్‌ అయిందా? ఎవరివైపు వైసీపీ ఆసక్తిగా చూస్తోంది? ఆ స్నేహం ఏ స్థాయిలో ఉండబోతోంది? ఏపీ అసెంబ్లీలో టెక్నికల్‌గా ప్రధాన ప్రతిప‌క్ష హోదా సంగ‌తి ఎలా ఉన్నా…. స్టేట్‌ మొత్తం మీద అది మేం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న లైన్‌నే ఇప్పటి వరకు ఫాలో అవుతోంది వైసీపీ. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు స‌మ‌స్యల‌పై ప్రతి ఉద్యమాన్ని పార్టీ జెండా కిందనే నిర్వహించింది. వాటి స‌క్సెస్ రేషియో సంగ‌తి ఎలా ఉన్నా… రాజకీయ ఒంట‌రి అనే ట్యాగ్‌లైన్‌ మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. అప్పట్లో కాంగ్రెస్‌తో పార్టీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్…. ఇప్పటికీ… హస్తంతో ట‌చ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. అటు వామ‌ప‌క్ష పార్టీల‌ విషయంలో వ్యతిరేకత లేక‌ున్నా…. ఇప్పటి వ‌రకు క‌లిసి ప‌నిచేయ‌లేదు. ఇక 2024లో అధికారం కోల్పోయాక కూడా పార్టీని స్వింగ్‌లోకి తీసుకురావ‌టానికి జరుగుతున్న ఆందోళనల్లో సైతం ఒంట‌రి పోరుకే ప‌రిమిత‌మైంది వైసీపీ. అటు వామపక్షాలు వివిధ సందర్భాల్లో తమ ఉద్యమాలు తాము చేసుకుంటున్నాయి. అలా ఎవరికి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు తప్ప… ఇప్పటిదాకా క‌లిసి అడుగులు వేయ‌లేదు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమ కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్లిన మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విష‌యంలో లెఫ్ట్‌ పార్టీలు పోరాటం చేశాయి. కానీ… అప్పుడు కూడా ఎవరి పోరాటం వారిదిగానే ఉంది. కానీ…. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అధిష్టానం ఆలోచన మారుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో క‌ల‌సివ‌చ్చే వారితో అడుగు ముందుకేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగైతేనే కూటమి ప్రభుత్వాన్ని గ‌ట్టిగా ఇర‌కాటంలో పెట్టవ‌చ్చన్న లెక్కల్లోకి వెళ్ళిందట విపక్షం. ప్రత్యేకంగా స‌ర్ వివాదం, రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు లాంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విషయంలో సోలో ఉద్యమం కంటే విస్తృత ప్రతిపక్ష సమన్వయమే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న నిర్ణయానికి వచ్చారట వైసీపీ పెద్దలు.

ఎన్నికల రాజకీయాలు వేరు, ప్రజా ఉద్యమాలు వేరు అనే ఫార్ములాతో ఇష్యూ బేస్డ్ కోఆర్డినేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకు బ‌లం చేకూర్చేలా… ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్న మాటల్ని ఉదహరిస్తున్నారు. ఇక మీదట నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు కూట‌మి ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై పోరాటాల స్పీడ్ పెరుగుతుంద‌ని అన్నాకు జగన్‌. వస్తామన్న ప్రతి ఒక్కరినీ త‌మ ఉద్యమ కార్యాచ‌ర‌ణ‌లో బంగారంలా క‌లుపుకుని పోతామ‌ని ఆయన కామెంట్స్ చేయ‌టం హాట్ టాపిక్ అయింది. అలాగే రాష్ట్ర రాజ‌కీయాల్లో తాము ఒంట‌రి కాదు చెప్పే ప్రయ‌త్నం కూడా ఇందులో ఉండి ఉండవచ్చని అంటున్నారు. మావిగ‌న్ రూపంలో వైసీపీ గ‌ట్టి పొలిటిక‌ల్ ఫైట్‌కు సిద్ధమవుతున్న క్రమంలో ఇత‌ర పార్టీల మ‌ద్దతు కూడా త‌మ‌కు ఉందని ప్రజ‌ల‌కు చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే జ‌గ‌న్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన. బీజేపీ కూటమిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్ని కూడా ఇదే కాంబినేషన్‌లో ఎదుర్కోబోతున్నట్టు చెబుతున్నారు. ఏకంగా మ‌రో 15, 20 ఏళ్లు ఇది ఇలాగే కొనసాగుతుందని కూడా పలు సందర్భాల్లో చెబుతున్నారు కూటమి నేతలు. మరోవైపు ఇతర పక్షాలైన కమ్యూనిస్టులు, ఇతర చిన్నాచితకా పార్టీలు ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ మంచోడేగానీ…. విధానాలే మార్చుకోవాలంటూ ఇటీవల సీపీఐ సీనియర్‌ లీడర్‌ నారాయణ అనడాన్ని చూస్తుంటే… మిత్రత్వం కోసం చేతులు చాపుతున్నట్టే అనిపిస్తోందని అంటున్నారు కొందరు. అటు సీపీఎం కూడా ఇదే బాటలో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ముందు ముందు వైసీపీ ఎవరెవరితో జత కడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కేవ‌లం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల‌ వరకే ఈ స్నేహం ఉంటుందా? లేక ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా అన్న చర్చలు మొదలయ్యాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో.