ఆ జిల్లాలో వైసీపీ నేతలకు సీరియస్నెస్ లేదా? పార్టీ అధిష్టానం చెప్పింది చేయడమే కష్టంగా మారిందా? బయట రేట్లు మండిపోతున్నాయిరా బుజ్జా…. ఇప్పట్నుంచే ఓ…. తెగ చించేసుకుని జేబులు గుల్లవడం ఎందుకని సన్నిహితులతో అంటున్నారా? వాళ్ళ వైఖరి చూసి… రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్లు కాడి పడేసేట్టు ఉన్నారని సొంత కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఎవరా నాయకులు? కాకినాడ జిల్లాలో వైసిపి నేతల పరిస్థితి వెరైటీగా ఉంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా…. గత ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.. అప్పటి నుంచి ఫ్యాన్ నేతలు ఫుల్ మ్యూట్ మోడ్ ఆన్ చేశారు. అధిష్టానం ఏదైనా ధర్నాలు ఆందోళనలకి పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే తప్పదన్నట్టు ముఖం చూపిస్తున్నారేగానీ… మిగతా సందర్భాలలో కంటికి కనబడడం లేదు. నియోజకవర్గ స్థాయిలో లోకల్గా జరిగే కార్యక్రమాలకు అనుగుణంగా రియాక్ట్ అయితే ప్లస్ అవుతుందిగానీ… ఫ్యాన్ కోఆర్డినేటర్లు మాత్రం ఆ విషయాలను పూర్తిగా పక్కన పెట్టేశారట. ఎవరైనా స్థానిక నేతలు ప్రస్తావిస్తే… అబ్బే ఇప్పట్నుంచే అవన్నీ ఎందకమ్మా అంటున్నట్టు తెలుస్తోంది. మనం చాలా అనుకుంటాం… అన్నీ అయిపోతాయా ఏంటి అంటూ వేదాంతం వల్లిస్తున్నారట. అతిగా స్పందిస్తే… అనవసరంగా చేతి చమురు వదిలించుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నది వాళ్ళ లెక్క. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల్లో ముగ్గురు మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్లు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట.. అతి కష్టం మీద హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బయటకు రావాల్సి వచ్చినా… అంతా రెడీ అంటే తప్ప గడప దాటడం లేదని చెప్పుకుంటున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సైడ్ అయిపోతున్నారట. జస్ట్ పార్టీ పెద్దల దృష్టిలో పడితే చాలన్నది వ్యవహారం మారిపోయిందని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది.
ఈ ఏడాదిలోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నా… ఇక్కడి వైసీపీ సీనియర్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటినుంచే ప్రిపేర్ అవ్వాలని ఎవరైనా అంటే… ప్రాక్టికల్గా ఉండండయ్యా…. ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? అని గడుసుగా రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నారట. అప్పటికీ ఆగక… మనం కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలి కదా అని అంటే… అవన్నీ జరిగే పనులు కావమ్మా… అంటూ సమ్మర్ హీట్లో మంచి లస్సీ తాగినట్టు కూల్గా చెబుతున్నట్టు తెలిసింది. ఈ సమాధానాలతో…. మనోళ్ళు ముందే కాడి పడేశార్రోయ్ అంటూ కేడర్ కూడా సెటైర్స్ మొదలుపెట్టింది. కార్యకర్తల్ని యాక్టివ్ మోడ్లో ఉంచాల్సింది పోయి… అది మాపని కాదన్నట్టు మాజీ ఎమ్మెల్యేలు.. సైతం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో ఊపిరి ఆడకుండా ప్రోగ్రామ్స్ చేసినా…. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూశాం కదా అంటూ గుర్తు చేస్తున్నారట కొందరు. అందుకే… మీరు కూల్గా ఉండండి, మమ్మల్ని ఉండనివ్వండని అనుచరులకు స్మూత్ గా ఇండికేషన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్న కింది స్థాయి నాయకులు కూడా… వాళ్ళకు లేని దురద మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాకినాడ జిల్లాకు చెందిన వైసిపి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఇప్పుడే అనవసరపు సౌండ్ వద్దని అంటున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే… రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా సోసోగా ముగించేస్తారన్న మాటలు కేడర్ సైడ్ నుంచి వినిపిస్తున్నాయి.
