యనమల కృష్ణుడు ఎటూ కాకుండా పోయారా? పొలిటికల్గా ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందా? అయినోళ్ళని కాదనుకుని వచ్చాను, మోజుపడ్డ వాళ్ళకు మొహం మొత్తిందంటూ… ఇప్పుడాయన తీరిగ్గా తెగ ఫీలైపోతున్నారా? ఉన్న పార్టీలో ఉండలేక, పాత పార్టీలోకి తిరిగి వెళ్ళలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడి ఉనికి ఇప్పుడెందుకు ప్రశ్నార్ధకమైంది? యనమల కృష్ణుడు…. తుని తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వీరలెవల్లో చక్రం తిప్పిన నాయకుడు. తనకు అన్న వరసయ్యే సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు రాష్ట్ర స్ఠాయి వ్యవహారాల్లో బిజీగా ఉంటే…. లోకల్గా నియోజకవర్గంలో వ్యవహారాలన్నిటినీ కృష్ణుడే చూసేవారు. అయితే అదంతా గతం. 2024 ఎన్నికల్లో తుని టీడీపీ టిక్కెట్ ఆశించారు కృష్ణుడు. కానీ… ఆయనకు బదులు రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టిక్కెట్ రావడం, ఆమె ఎమ్మెల్యే అవడం తర్వాతి పరిణామాలు. 40 ఏళ్ళ పాటు నియోజకవర్గంలో పనిచేసినా… తనను గుర్తించకుండా తిరిగి రామకృష్ణుడి కుమార్తెకే ఇచ్చారంటూ… హర్ట్ అయిపోయి ఎన్నికలకు ముందే వైసీపీ కండువా కప్పుకున్నారు కృష్ణుడు. ఇక అప్పటి నుంచి మద్దెల దరువు మొదలైందని చెప్పుకుంటున్నారు. కృష్ణుడి చేరికను తుని వైసీపీలో బలంగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కాదనలేకపోయారట. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రాజా ఓడిపోవడంతో అందుకు కారణం కృష్ణుడేనంటూ లోకల్ వైసీపీలోని ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అప్పటిదాకా కృష్ణుడిపై ఉన్న వ్యతిరేకత మొత్తం టీడీపీని వదిలి వైసీపీకి అంటుకుందని, ఆప్రభావం స్పష్టంగా కనిపించిందని గుసగుసలాడుకునేవారు. ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయం, సామాజిక సమీకరణల దృష్ట్యా దాడిశెట్టి రాజా సైలెంట్గా ఉన్నా… ఓటమి తర్వాత ఆయన కూడా ఓపెన్ అయిపోతున్నారట. ఇటీవల చేసిన కామెంట్సే అందుకు ఉదాహరణ అని అంటున్నారు పరిశీలకులు. 40ఏళ్ళ పాటు యనమల కృష్ణుడు తునిలో పనికిమాలిన పనులు చేశారని, ఆయన చేసిన దుర్మార్గాల వల్లే తాను చేరదీయలేకపోతున్నానంటూ ఇటీవల ఓపెన్గా కామెంట్ చేశారు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన దాడిశెట్టి. ఈ పరిస్థితుల్లోనే… కృష్ణుడుని పూర్తిగా దూరం పెట్టారట. ఎన్నికల తర్వాత కొద్ది రోజులు దాడిశెట్టి రాజా, కృష్ణుడి మధ్య సంబంధాలు ఫర్వాలేదని అనిపించేవి. అడపాదడపా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ… కృష్ణుడుకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాక మొదటి నుంచి రాజాకు దగ్గరగా ఉన్నవాళ్లు దూరం అవడం మొదలుపెట్టారట. దాంతో… రియలైజ్ అయి…. కృష్ణుడు వల్ల ఇప్పటికే ఎన్నికల్లో తాము చాలా నష్టపోయామని మళ్లీ ఆయన్ని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెడతామంటే ఒప్పుకోబోమంటూ…. పార్టీ పెద్దలకు క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది.
తునిలో కృష్ణుడితో కలిసి రాజకీయాలు చేయడం తనకు సెట్ అవదని కూడా తేల్చేశారట. పార్టీ పెద్దలు వెయిట్ అండ్ సీ అని చెప్పినా…. మాజీ మంత్రి లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. తుని నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా. ఆ రెండుసార్లు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున కృష్ణుడే ఉన్నారు. అందుకే రాజకీయాలు అలా మారిపోయాయని అనే వాళ్ళు సైతం ఉన్నారు. పార్టీ తరపున స్పష్టత రాకపోవడంతోనే రాజా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కృష్ణుడు కూడా ఫ్యాన్ కింద కూల్గా ఉండలేక, తిరిగి సైకిల్ ఎక్కే ఛాన్స్ దొరక్క తెగ ఫీల్ అయిపోతున్నారట. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయిందని తెగ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తునిలో సొంత పార్టీలో ఉన్న కృష్ణుడి తో కలిసి పని చేయడం నావల్ల కాదని డైరెక్ట్గానే చెప్పేశారు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి. పార్టీ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మాత్రం ఇదేనని కుండబద్దలు కొట్టేశారు. అదే సమయంలో కృష్ణుడికి మరో మార్గం లేక… అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియక సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
