మాకొద్దు బాబోయ్….. ఈ అధ్యక్షుడు అంటూ ఆ జిల్లా వైసీపీ నేతలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారా? అయినా… వాళ్ళ ఆర్తనాదాలు అధిష్టానం చెవిన పడటం లేదా? మనం పనిచేయకున్నా ఫర్లేదు, పెద్దోళ్ళ దృష్టిలో బాగుంటే చాలన్న వైఖరే అక్కడ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందా? ఒక నేత ఏకంగా జిల్లా మొత్తాన్నే పణంగా పెడుతున్నారన్నది నిజమేనా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతోంది? ముదునూరి ప్రసాద్ రాజు…. రాజశేఖర్రెడ్డి హయాంలో ఒకసారి, జగన్ వేవ్లో మరోసారి MLAగా గెలిచి ప్రస్తుతం వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ…. ఆయన వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదంటూ సొంత నేతలే గుసగుసలాడుకుంటున్నారట. 2024 ఎన్నికల తర్వాత నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, దూకుడుగా వ్యవహరించాల్సిన జిల్లా అధ్యక్షుడు అధినేత చుట్టూ తిరుగుతూ భజన చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో కేడర్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. జిల్లా పరిధిలోని పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో వైసిపి దాదాపుగా ఖాళీ అవుతున్నప్పటికీ అక్కడ క్యాడర్కు భరోసా కల్పించే విషయంలో అధ్యక్షుడు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సొంతోళ్ళే చెబుతున్నారు.మిగతా నియోజకవర్గాల విషయం పక్కన పెడితే… గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నరసాపురం అసెంబ్లీలోనే నేతలు కాడి వదిలేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చెప్పుకోదగ్గ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా పనిచేసే నాయకుల విషయంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ పార్టీని డామేజ్ చేస్తున్నారని అంటున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వదిలి బయటకు వెళ్లడానికి ముదునూరి వ్యవహారమే ప్రధాన కారణమని చెప్పుకొస్తున్నారు అక్కడి వైసీపీ నేతలు. ఆయన పని చేయరు.. చేస్తానన్న వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వరని చెప్పుకుంటున్నారు. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ముదునూరి… నరసాపురం నియోజకవర్గంలో కీలకమైన కాపు నేతలంటే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారని, వాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తే భవిష్యత్తులో తనకు పదవులు దక్కవన్నట్టుగా ఉంటారన్నది లోకల్ వాయిస్.
భీమవరం, పాలకొల్లు, ఉండి వంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలకు అవకాశం కల్పించాలని కార్యకర్తలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా ఆ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళకపోవడానికి అదే ప్రధఆన కారణం అంటున్నారు. తణుకు, ఆచంట నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా ఉన్న మాజీ మంత్రులతో సైతం ముదునూరుకి అంతగా సఖ్యత లేదట. దీంతో ఆయన మాకొద్దు మహాప్రభో అంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభావం చూపలేకపోతున్నారని తెలిసినా… ఆయనపై ఫిర్యాదులు చేసేందుకు వెనకాడుతున్నారట. అందుకు కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా కంటే… అధినేత చుట్టూ ఎక్కువగా చెక్కర్లు కొడుతూ… తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాల్లో ఉంటారని, అందుకే ఎవరూ సాహసం చేయలేకపోతున్నారన్నది ఇంటర్నల్గా ఉన్న అభిప్రాయం. హైకమాండ్తో సాన్నిహిత్యం ఉన్నందున ఆయనపై ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకుంటారా అన్నది చాలామంది అనుమానం. కార్యకర్తలంటే తన కింద పని చేసేవారు అన్నట్టుగా ముదునూరి వ్యవహరిస్తున్నారని, అదే పార్టీకి మైనస్ అవుతోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సొంత నియోజకవర్గంలో పరిస్థితిని చక్కబెట్టుకోలేని నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా మిగతా వాళ్లను ఏకతాటిపైకి ఎలా తీసుకు రాగలుగుతారంటూ…వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా ఉందన్నది పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతల వాయిస్. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళుతున్న ముదునూరి ప్రసాద్రాజు స్థానంలో మరో నేతకు అవకాశం ఇస్తే తప్ప నరసాపురం, పాలకొల్లు, ఉండి, భీమవరం ,నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి మెరుగు పడదని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

