స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు పిలుపు అక్కడ కూటమిలో అగ్గి రాజేసిందా? నాయకులు ఎవరికి వారే… అనుకూలమైన లెక్కలతో రెడీ అయిపోయారా? గతాన్ని, వర్తమానాన్ని పోలుస్తూ… అప్పుడు అలా జరిగింది కాబట్టి… ఇప్పుడు ఇలా జరగాలంటూ రచ్చ మొదలుపెడుతున్నారా? తేడా కొడితే రెబెల్స్గా అయినా రంగంలోకి దిగుతామంటోంది ఎక్కడ? జస్ట్ సీఎం నోటి మాట మాత్రంగా పొలిటికల్ హీట్ ఎందుకు పెరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ స్టేట్ పొలిటికల్ కేపిటల్లో వాతావరణం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మామూలుగానే మండిపోతున్న బెజవాడ ఎండల్ని తలదన్నేలా… ఇక్కడ కూటమి పార్టీల మధ్య రాజకీయ సెగలు పెరిగిపోతున్నాయట. ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 64 డివిజన్స్ ఉన్నాయి. ఇది మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది.
గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ జనసేన 40 డివిజన్స్లో పోటీ అయితే చేసిందిగానీ… ఒక్కచోట కూడా గెలవలేదు. అటు తెలుగుదేశం పార్టీ మొత్తం 64 స్థానాల్లో పోటీ చేసి కేవలం 14 సీట్లే గెలవగలిగింది. ఇక అప్పుడు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో గెలిచి మేయర్ సీటు కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో… ఈసారి కేలిక్యులేషన్స్పై ఆసక్తి పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తాజాగా సీఎం చంద్రబాబు పిలుపు ఇవ్వటంతో… కూటమిలోని రెండు పార్టీల స్థానిక నేతలు అలర్ట్ అయ్యారు. ఇటు టీడీపీ, అటు జనసేన….ఎవరికి వారు పొత్తులో తమకు వచ్చే సీట్లకు సంబంధించిన లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం సిటీ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ, ఒక చోట బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
అటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు సీట్లలో, అలాగే… ఎన్టీఆర్ జిల్లా లిమిట్స్లో ఎక్కడా జనసేన పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఈ సీట్లన్నిటినీ మిగతా రెండు మిత్రపక్షాలే పంచుకున్నాయి. సరిగ్గా ఈ పాయింట్నే ఇప్పుడు లేవనెత్తుతున్నారు గ్లాస్ లీడర్స్. నాడు మీ కోసం అసెంబ్లీ సీట్లు త్యాగం చేశారం.
కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బెజవాడ సిటీలో మాకు చెప్పుకోతగ్గ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్పుడే తమ పార్టీ అధిష్టానానికి విన్నపాలు పంపుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా జనసేనకు కాపు సామాజిక వర్గం అండ ఎక్కువగా ఉన్నందున దాన్ని దృష్టిలో ఉంచుకుని మాకు మెజార్టీ సీట్లు ఇవ్వాలంటున్నారు. విజయవాడలో కాపు సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందన్న సంగతిని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ కోటాలో కావాలని అంటున్నారట. గెలవకున్నా… గత స్థానిక సంస్థల ఎన్నికల్లో40 చోట్ల పోటీ చేశామని, ఇక 2019 సాధారణ ఎన్నికల సమయంలో సిటీలోని మూడు నియోజకవర్గాల్లో 15 శాతం ఓట్లు పడ్డ సంగతి కూడా మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ అధిష్టానానికి కూడా ఈ లెక్కలన్నీ చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జిల్లాలోగాని విజయవాడలోగాని జనసేన నుంచి ప్రజాప్రతినిధి ఎవరూ లేరు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపీట వేయాలని కోరుతున్నారు. అయితే… ఈ లెక్కలే ఇప్పుడు టీడీపీ నేతలకు మింగుడు పడ్డం లేదట. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల పోటీ చేసిన తెలుగుదేశం కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
సిటీలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కార్పొరేటర్ సీట్ల ఆశావహులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పనిచేశామంటూ ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నారట. ఇందులో ఎక్కువమంది మాజీ కార్పొరేటర్లు, తాజా మాజీ కార్పొరేటర్లు ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా కాదనలేని పరిస్థితులు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎంపీ వర్గం నుంచి కూడా కొందరు టికెట్లు ఆశించడంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ కలవరపెడుతోంది. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ గెలవడంతో అక్కడ నుంచి ఆ పార్టీ తరపున లిస్ట్ పెరిగిపోతోంది. దీంతో… కూటమి పరిస్థితి ఓవర్లోడెడ్ అన్నట్టుగా ఉందట. ఇక్కడ ఇంకో భయం కూడా మూడు పార్టీల పెద్దల్ని వెంటాడుతోంది. మర్యాదగా మనకు కార్పొరేటర్ టిక్కెట్ ఇస్తే ఇచ్చారు, లేదంటే రెబెల్స్ అయినా రంగంలోకి దిగుదామని ఎక్కువ మంది కసరత్తు చేస్తున్నారన్న సమాచారం కలవరపెడుతోందట. మూడు పార్టీల అధిష్టానాలు ఈ వివాదాలు, వ్యవహారాల్ని ఎలా సెట్ చేస్తాయన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం.
