Site icon NTV Telugu

Off The Record : మాజీ మేయర్ విజయలక్ష్మికి త్వరలో కొత్త పదవి..?

Gadwal Vijayalaxmi

Gadwal Vijayalaxmi

జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ విజ‌య‌లక్ష్మికి మ‌రో ప‌ద‌వీ క‌టాక్షం కలగబోతోందా? ముందస్తు ఒప్పందం ఇప్పుడు తెరమీదికి రాబోతోందా? అసలు ఆ అగ్రిమెంట్‌తోనే అప్పట్లో విజయలక్ష్మి, ఆమె తండ్రి కే కేశవరావు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యారా? ఏంటా ఒప్పందం? మాజీ మేయర్‌ కోసం సిద్ధంగా ఉన్న ఆ పదవి ఏది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త చర్చ హాట్‌ హాట్‌గా జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో డిస్కషన్‌ నడుస్తోంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా…. దాదాపు ఖాయమేనన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు గద్వాల విజయలక్ష్మి. GHMC మేయర్‌ ఉంటూనే ఆమెతో పాటు తండ్రి కేశవరావు కూడా కారు దిగేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇద్దరూ పార్టీ మారేటప్పుడే పదవికి సంబంధించిన ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అప్పట్లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. అలాగే… విజ‌య‌ల‌క్ష్మి సిట్టింగ్ మేయ‌ర్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైద‌రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో అదో పెద్ద ఉపశమనం.

అంతే కాకుండా నాడు కేకే ఖాళీ చేసిన రాజ్యసభ సీటును కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ అభిషేక్‌ సింఘ్వీకి ఇచ్చారు. అంతా చేసినందుకుగాను అప్పట్లో విజయలక్ష్మికి రాజకీయ భవిష్యత్‌ కోసం గట్టి హామీనే ఇచ్చారట కాంగ్రెస్‌ పెద్దలు. ఆ మేరకే ఇప్పుడు కొత్త పదవి అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమెకు మహిళా కమిషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చల వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. కమిషన్ చైర్‌పర్సన్ పదవి చాలా కీలకమైనది.

హక్కుల పరిరక్షణ, మహిళలపై జరిగే నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంలాంటి కీలకమైన బాధ్యతలు ఉంటాయి. అందుకే ఈ పోస్ట్‌ కోసం ముందస్తు ఒప్పందం జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ సీట్లో ఉన్న పార్టీ నేత నేరెళ్ల శారద రెన్యువల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ… ప్రస్తుత పరిణామాలతో అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అలాగే విజ‌య‌ల‌క్ష్మికి ఇచ్చిన హామీ మేర‌కు… రెండేళ్ళు కాకుండా ఆరేళ్ల పాటు ఆమె కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పోస్ట్‌లో ఉండేలా సవరణలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.అయితే గద్వాల విజయలక్ష్మిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించే విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Exit mobile version