ఒక్క మాట…. ఆ ఒక్క మాట…. మొత్తం ముఖ చిత్రాన్నే మార్టేసిందని గులాబీ లీడర్స్ ఫీలవుతున్నారా? తాతా…ఎంత పనైంది? అంతలా ఇరికించేశావ్ అని అంటున్నారా? ప్రభుత్వాన్ని నిలదీయడానికిరకరకాల అంశాలున్నాయి, ఈసారి మంచి స్ట్రాటజీతో సభకు వెళ్తామనుకున్న టైంలో మొత్తం తల్లకిందులు చేశావని అంటున్నారా? ఎమ్మెల్సీ అన్న మాటల గురించి గులాబీ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఉన్న భవిష్యత్ భయాలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచే పైచేయి సాధించాలని గులాబీ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినా… ఆ ఒక్క సన్నివేశం, ఆయన మాట్లాడిన ఒక్క మాట మొత్తం సీన్నే మార్చేసిందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. సమావేశాల తొలి రోజు గన్పార్క్ దగ్గర నుంచి నల్ల రంగు టీషర్ట్లతో.. అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు ప్రతిపక్ష శాసనసభ్యులు. ఆ టీ షర్ట్స్ మీద స్లోగన్స్ కూడా రాసుకుని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వబోయారు. మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే… నినాదాలు రాసి ఉన్న టీ షర్టులకు అనుమతి లేదంటూ పోలీసులు ఆపడంతో గందరగోళం మొదలైంది. ఆ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తీసుకువెళ్ళారు పోలీసులు. అయితే.. ఈ సందర్భంలో జరిగిన ఓ ఘటనను బీఆర్ఎస్ హైలైట్ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ.. ఆ విషయంలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మాండ్ చేశారు పార్టీ నాయకులు. ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా రన్ అవడం ఒక ఎత్తయితే… ఇందులో భాగంగా ఎమ్మెల్సీ తాతా మధు రూపంలో బీఆర్ఎస్కుక షాక్ తగిలింది. నల్ల టీ షర్ట్స్తో అసెంబ్లీలోకి వెళుతున్న సమయంలో ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడిన మధు… చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటలు అభ్యంతరకరంగా, స్పీకర్ను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారు అధికార పార్టీ సభ్యులు.
ఇదే సబ్జెక్ట్ మీద రెండు రోజుల పాటు సభ మార్మోగిపోయింది. వాయిదాల పర్వం నడిచింది. మూడో రోజు కూడా తాతా మధు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తారు. అటు తమ మహిళా ఎమ్మెల్యేలను ఇబ్బందిపెట్టారంటూ….సభలో చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టినా…వర్కౌట్ అవలేదు. సమావేశాలను అడ్డుకుంటున్నారంటూ మొత్తానికే సభకు రాకుండా సస్పెన్షన్ వేటు పడింది. దాంతో… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాచరణ బయటికే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో… గులాబీ పార్టీలో తాతా మధు విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందట. తొలిరోజు అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో కంట్రోల్ తప్పి మాట్లాడ్డం వల్ల పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం ఉందని చెప్పుకుంటున్నారు. తాతా మధు ఎపిసోడ్ వల్లనే అనుకున్న స్ట్రాటజీని ఈ సమావేశాల్లో వర్కౌట్ చేయలేకపోయామంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి గులాబీ వర్గాలు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, 22a అంశం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయకపోవడం లాంటి అనేక అంశాలను ఈ సమావేశాల్లో ప్రస్తావించాలని అనుకుందట ప్రతిపక్షం. అసెంబ్లీ పెట్టండి…చర్చకు సిద్ధమని ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ నేతలు తీరా…సెషన్ మొదట్లోనే… సస్పెండ్ అవడంతో ఈసారికి సభలో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఎన్నో అంశాలు ఉన్న ఈ టైంలో కేవలం తాతా మధు తొందరపాటు వల్లే అసెంబ్లీలోకి వెళ్లలేకపోయామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారట. మా ఎమ్మెల్సీ చేసిన పనికి మేం మూల్యం చెల్లించుకుంటున్నామని కొందరు గులాబీ శాసనసభ్యులు సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవడం ఒక ఎత్తయితే…. భవిష్యత్తు లో కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే లేవనెత్తే అవకాశం ఉందని అంటున్నారు BRS నేతలు. దళిత స్పీకర్కు అవమానం అంటూ…రేపు కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళితే తమకు కాస్త ఇబ్బందేనన్నది గులాబీ వర్గాల ఇన్నర్ వాయిస్.

