తెలంగాణలో యూనివర్శిటీల పరిపాలన గాడి తప్పుతోందా? ఏకంగా కొందరు వైస్ ఛాన్స్లర్సే నిబంధనలకు ఉప్పు పాతరేస్తున్నారా? అంతా… మా ఇష్టం అంటూ నచ్చినట్టు చేస్తున్నారా? రూల్స్ గీల్స్ జాన్తానై అంటూ… ఫారిన్ ట్రిప్స్కు రివ్వున ఎగిరిపోయిన వాళ్ళ మీద చర్యలకు రంగం సిద్ధమవుతోందా? వర్శిటీల్లో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో నిబంధనల ఉల్లంఘనలు యధేచ్ఛగా జరిగిపోతున్నాయంటూ.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసిన కొందరు వైస్ ఛాన్స్లర్స్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏదైనా యూనివర్శిటీ వీసీ విదేశీ పర్యటన చేయాలంటే…. కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండి తీరాలి. కానీ… కొద్ది రోజుల క్రితం పలువురు వీసీలు ఎవరి ఇష్టానికి వారు ఫారిన్ ట్రిప్స్కు వెళ్లడంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు కార్యానిర్వాహక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే… మూడున్నరేళ్ళ తరువాత యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించింది. ఉస్మానియా, జేఎన్టీయూ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఈసీలను నియమిచారు.
కాకతీయ యూనివర్సిటీకి గతంలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం జరిగింది. ఇక యూనివర్శిటీలో జరిగే అన్ని కార్యక్రమాలకు పాలక మండలి ఆమోదం తప్పని సరి. పాలక మండలి లేని పక్షంలో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ లేదా సీఎస్ అనుమతి తీసుకుని పనులు చేస్తుంటారు. అలాగే… వీసీల విదేశీ పర్యటనకు సైతం అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. కానీ… ఇటీవల వెళ్లిన వాళ్ళు ఎవరూ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో… ప్రభుత్వం ఆ దిశగా విచారణ చేపట్టింది. వీసీ బయటికి వెళ్ళేటప్పుడు సీనియర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ… ఆ పని కూడా చేయనట్టు తెలుస్తోంది. అలాగే… ఎవరైనా వైస్ ఛాన్స్లర్ పారిన్ ట్రిప్కు వెళితే…. రెండు లక్షల రూపాయల వరకు నిధుల్ని ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ… ఇటీవల ఒకరు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి….. ఆ ఎక్స్ట్రా బిల్లులను కూడా ప్రభుత్వానికి సమర్పించారట. ఆర్థిక శాఖ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో అసలు విషయం మొత్తం బయట పడినట్లు తెలిసింది. సదరు వీసీ ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారని, ఆయన పెట్టిన అదనపు ఖర్చులను ప్రభుత్వం భరించబోదని క్లారిటీ ఇచ్చేశారట.
అలాగే… ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసిన వీసీల విషయం, అధిక బిల్లుల సమర్పణపై సీఎస్ ఆగ్రహం చేసినట్లు తెలుస్తోంది. సదరు వీసీపై చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు… యూనివర్సిటీల పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తే వాటికి ఉన్నత విద్యా శాఖ నుంచి ఐఏఎస్ అధికారులు హాజరవుతారు. ఈసీల సమావేశానికి హాజరైన ఐఏఎస్లలో సీనియర్కు యూనివర్శిటీ గౌరవ భత్యం చెల్లిస్తుంది. కానీ…. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ఓ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఐఏఎస్ ఒకరు… తనకు హానరోరియం ఇచ్చి తీరాల్సిందేనని అడిగి మరీ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అలాగే… సచివాలయంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన మీటింగ్స్ నిర్వహిస్తే…. విద్యా శాఖకు సంబంధించిన ఉద్యోగులు డబ్బులు వసూలు చేయడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందట.
సాధారణంగా సెక్రటేరియట్లో జరిగే ప్రభుత్వ సమావేశాలకు మీటింగ్ హాల్ కోసం అద్దె చెల్లించడాల్లాంటివి ఉండవు. ఎందుకంటే… మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కాబట్టి. కానీ… కొందరు సిబ్బంది మీటింగ్ పెట్టుకున్న యూనివర్సిటీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట. మీటింగ్ ఏర్పాట్లు కోసమంటూ ఒక వర్శిటీ నుంచి ఐదు వేలు, మరో యూనివర్సిటీ నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేయడమేగాక.. దానిరి సంబందించిన వివరాల్ని బిల్లు రూపంలో ఒక తెల్లకాగితం మీద రాసి ఇవ్వడం చూసి నోరెళ్ళబెటుతున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో నిధుల దుబారాపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. అందులో ఇంకెన్ని కొత్త కొత్త లీలలు బయటికి వస్తాయో చూడాలి.
