Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!

  • సర్వేపల్లిలో హై వోల్టేజ్‌ పాలిటిక్స్‌
  • ఎమ్మెల్యే సోమిరెడ్డి, మాజీ మంత్రి కాకాణి మధ్య యుద్ధం
  • సర్వేపల్లిలో పైచేయి కోసం ప్రతిపక్ష నేత ప్రయత్నాలు
  • ఇక్కడ పోస్టింగ్ అంటేనే బాబోయ్‌..అంటున్న పోలీస్‌ అధికారులు
Sarvepalli

Sarvepalli

ఆ నియోజకవర్గం పేరు చెబితేనే…. పోలీస్‌ అధికారులు సైతం వామ్మో అని అంటున్నారా? అక్కడ డ్యూటీ అంటేనే… వాళ్ళతో పాటు రెవెన్యూ అధికారులు సైతం మాకొద్దు బాబోయ్‌…. అని చేతులెత్తి దండం పెడుతున్నారా? పోలీస్‌, రెవెన్యూ అధికారులు దినదిన గండం…నూరేళ్ళాయుష్షు అన్నట్టుగా ఉద్యోగాలు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? సింహపురి పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ ఉండే నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. నేరుగా మాటల తూటాలతో పాటు… సోషల్‌ మీడియా వార్‌ కూడా పూర్తి స్థాయిలో నడుస్తూ…..సమ్మర్‌ సెగలతో పోటీ పడుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున సోమిరెడ్డి విజయం సాధించగా…. ఆయన మీద ఓడిపోయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ట్యాగ్‌తో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా…. అధికారంలో ఉన్న వారిదే పైచేయి అవుతుంది. కానీ… సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం అలా లేదన్న మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్ హడావిడి కాస్త తక్కువగానే ఉంటే….. సర్వేపల్లిలో మాత్రం నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలతో వోల్టేజ్‌ పెరిగిపోతోంది. పరస్పరం పైచేయి కోసం నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

 

ఈ పరిస్థితుల్లో… ఇక్కడ పనిచేయాలంటేనే పోలీసులు, రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారట. సర్వేపల్లి నియోజకవర్గంలో పోస్టింగ్ అంటే… బాబోయ్‌…. మాకొద్దంటూ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. సర్వేపల్లిలో డ్యూటీ అంటే….అడకత్తెరలో ఉన్నట్టేనన్న ఆవేదన అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమకు అనుకూలంగా పనిచేయకపోతే ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అదే సమయంలో వైసీపీ నేతలపై కేసులు పెడితే కాకాణి వార్నింగ్ ఇస్తున్నారట. రేపు మేం అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తామంటూ మాజీ మంత్రి హెచ్చరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో ఇక్కడి అధికారులకు అర్థం కావడం లేదట. తన మాట వినని అధికారుల గురించి ప్రతిపక్ష నేత సమయం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు వాట్సప్‌లో కూడా ప్రచారం చేస్తున్నారట. ఓ బాలికపై అత్యాచారం చేశాడంటూ… ఇటీవల నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పుడు సీఐ, ఎస్సైపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకున్న కాకాణి.. సదరు పోలీసుల తీరును ఎండగట్టారట. పొదలకూరు పీఎస్ ఎదుట ఇటీవల ఆందోళన చేశారాయన. వైసీపీ నేతలను పోలీసులు అకారణంగా కొడుతున్నారని, టీడీపీ నేతలు చెప్పినట్లు వింటున్నారనీ ఆరోపించారు. రేపు మేం అధికారంలోకి వస్తే… ఈ ఎస్సై ఎక్కడ, ఎలా విధులు నిర్వహిస్తారో చూస్తానని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. జిల్లా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు వినకపోతే తమకు పోస్టింగ్స్‌ ఉండవని.. వారు చెప్పినట్లు చేస్తే వైసీపీ నేతల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తోందంటూ పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అధికారంలో లేకున్నాసరే….. నియోజకవర్గంలో తన ఆధిపత్యం తగ్గకూడదన్న ఆలోచనలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారట. అందుకే… చిన్నచిన్న కార్యక్రమాలను కూడా జనాల్లోకి తీసుకెళ్తూ పొలిటికల్ మైలేజ్ పెంచుకునే ప్లాన్‌లో ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి.. భవిష్యత్తులో పోస్టింగ్స్‌ ఉండవంటూ జిల్లా వైసీపీ అధ్యక్ష హోదాలో అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారట కాకాణి.

దీంతో…. సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసే రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏ పని చేయాలన్నా ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా వెళితే ఉన్నతాధికారులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా పట్టించుకోరని, తప్పక కొన్ని కొన్ని విషయాల్లో వన్ సైడ్ వెళ్ళినా.. మరికొన్నిటిలో మాత్రం తటస్థంగా ఉండాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు తెలిసింది. రీ సర్వే పేరుతో రెవెన్యూ అధికారులు కూడా వైసిపి నేతలను ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. విధులు నిర్వహించాల్సిన అధికారులు.. తమ ముద్ర పడితే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఎవ్వర్నీ నొప్పించకుండా విధులు నిర్వర్తించడం కుదరడం లేదని, అయినా సరే వీలైనంత వరకు తమ మీద ఎలాంటి ముద్రలు పడకుంటా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నది వాళ్ళ మాట. అయినా సరే… ప్రతిపక్ష నేతలు పోలీసులను టార్గెట్ చేసుకుని విమర్శల డోస్‌ పెంచుతున్నారంటూ కొందరు ఖాకీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ.. సర్వేపల్లిలో మాత్రం క్లిష్టంగా ఉందన్నది ఆఫీసర్స్‌ వాయిస్‌.