రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతోందా…? పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలంటూ తిరిగి పుంజుకునేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్నే ఆయుధంగా మల్చుకుంటోందా? కౌంటర్ చేసుకోవాల్సిన టీడీపీ నేతలు ఎవ్వరూ ఎందుకు నోళ్ళు మెదపడం లేదు? విపక్షం అంత దూకుడుగా వెళ్తుంటే…. అధికార పక్షం వైపు నుంచి కనీస స్పందనలు కూడా లేకపోవడానికి కారణాలేంటి? ఏపీ ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న కీలకమైన పోరాటాల్లో ఒకటిగా మారింది రాయలసీమ ఎత్తిపోతల పథకం. అందుకే సీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరులో కూడా సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది ప్రతిపక్షం. సంబంధింత అన్ని జిల్లాలకు చెందిన కీలక నేతలను ఆహ్వానించి సీమ లిఫ్ట్ ప్రాధాన్యతను చెప్పడంతో పాటు ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి టీడీపీనే కారణమంటూ ప్రధాన చర్చకు తెరతీసింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాలను సీమ జిల్లాలకు భారీగా తరలించి కరువు నివారణకు తాము చేసిన ప్రయత్నాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చాక అడ్డుకుందంటూ ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టే ప్లాన్ రూపొందించింది వైసీపీ.
రాజకీయంగా కూడా తనకు ప్రయోజకనకరంగా ఉండేలా ఈ ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించే పనిలో ఉందట విపక్షం. 2024 ఎన్నికల్లో ఈ ప్రాంతాలన్నిటిలో పార్టీకి ఊహించని దెబ్బ తగిలినందున తిరిగి పట్టు సాధించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నే ప్రధాన ఆయుధంగా మలవుచుకునే ప్రయత్నంలో వైసీపీ ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబుకు చెప్పి రాయలసీమ లిఫ్ట్ను నిలిపివేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఫ్యాన్ లీడర్స్. జనవరిలో ప్రాజెక్టు నిర్మిత ప్రాంతాన్ని వైసీపీ కీలక నేతలు సందర్శించారు. రాయలసీమ జిల్లాల నుంచి ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామసుబ్బారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, శిల్పా రవి, శైలజానాథ్ , ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఆ టీమ్లో ఉన్నారు. అప్పుడు భారీ జనసమీకరణ చేయడంతో పాటు సమస్య పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు ఆందోళనలతో లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అంజులో భాగంగానే సీఎం చంద్రబాబును కార్నర్ చేస్తూ… సదస్సులు నిర్వహించి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ప్రాజెక్టు భౌగోళికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండడంతో ఈ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టారు. రెండవ దశలో నిర్వహించిన సదస్సులో అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ప్రస్తుత విభజిత జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరి ప్రసంగాలు చంద్రబాబు టార్గెట్గానే కొనసాగాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త చర్చ జరుగుతోంది రాయలసీమ రాజకీయవర్గాల్లో. ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ అలా దూకుడు ప్రదర్శిస్తుంటే…. టీడీపీ మాత్రం ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మొదట్లో ఒకరిద్దరు టీడీపీ నేతలు కాస్త కౌంటర్ అటాక్ చేసినా… ఆ తరువాత వైసీపీ ఉద్యమాన్ని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. సదస్సు నిర్వహించిన ప్రతి చోట ప్రతిపక్షం ఆ స్థాయిలో విరుచుకుపడుతుంటే… టీడీపీ నుంచి స్పందనలు కరవయ్యాయని, ప్రత్యేకించి ప్రాజెక్ట్ సైట్ ఉన్న కర్నూల్ జిల్లాలో ఒక్క కౌంటర్ కూడా పడకపోవడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి.
వైసీపీ హయాంలో 3వేల 307 కోట్లతో రాయలసీమ లిఫ్ట్కు రూపకల్పన చేసి పనులు చేపట్టిన పథకాన్ని చంద్రబాబుకు ఇష్టం లేకే పనులు నిలిపివేశారని, జగన్కు మంచి పేరు వస్తుందనే ఆపేశారన్నది వైసీపీ వాదన. తెలంగాణకు మంచి చేయడానికి రాయలసీమ రైతుల నోళ్లు కొట్టారంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో టీడీపీ మీద దాడులు చేస్తున్నారు. అయితే… అధికారంలో ఉన్నాసరే… తెలుగుదేశం నాయకులు మాత్రం ఎక్కడా వైసీపీకి తగిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అసలు వైసీపీ ఉద్యమాన్ని టీడీపీ మరీ లైట్ తీసుకుందా….లేక పార్టీ నేతలకు పట్టలేదా అనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల టీడీపీ నేతలు ఈ అంశంపై గట్టి సమాధానం చెప్పాల్సి వున్నా …ఇది మాకు సంబంధించి కాదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు కర్నూలు జిల్లాలో అయితే… తెలుగు తమ్ముళ్ల నోళ్లు మరీ మూగబోయాయని చెప్పుకుంటున్నారు.
