Site icon NTV Telugu

Off The Record : పైలట్ రోహిత్ రెడ్డి నెట్‌వర్క్ పై పోలీసుల దృష్టి

Rohit

Rohit

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయా? ఇక్కడ తీగ లాగితే… ఎక్కడెక్కడి డొంకలో కదిలిపోతున్నాయా? పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇతర రాజకీయ నాయకులకు రెగ్యులర్‌గా వీకెండ్‌ పార్టీలు ఇచ్చేవారా? పోలీస్‌ కస్టడీలో మాజీ ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఆ నెట్‌వర్క్ ఎలా విస్తరించింది? మొయినాబాద్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసు దర్యాప్తు కీలకమైన మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయట. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డిని మూడు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు పోలీసులు. ఆ సందర్భంగా చాలా విషయాలు వెల్లడైనట్టు తెలిసింది. డ్రగ్స్ వినియోగం నుంచి రాజకీయ, వ్యాపార సంబంధాల వరకు విస్తరించిన అతిపెద్ద నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక సమాచారం వెల్లడైనట్టు తెలిసింది.

 

రోహిత్ రెడ్డి గత నాలుగేళ్ళుగా డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీస్‌ దర్యాప్తులో వెల్లడైందట. డ్రగ్స్ కొనుగోలు కోసం రోహిత్‌రెడ్డి తరచూ తన డ్రైవర్ శరత్‌కు డబ్బులు ఇచ్చేవాడని గుర్తించారు అధికారులు. డ్రైవరే డ్రగ్స్‌ కొని తీసుకువచ్చి ఇచ్చేవాడట. అక్కడ లాగితే… భారీగా ఉన్న సప్లయ్‌ చైన్ మొత్తం బయటపడ్డట్టు పోలీస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ శరత్‌కు డ్రగ్స్‌ తీసుకువచ్చి ఇచ్చేవారని, అందుకోసం పైలట్‌ రోహిత్‌రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేవాడని గుర్తించారట పోలీసులు. ఈ దర్యాప్తులో కొత్తగా మరికొందరి పేర్లు కూడా బయటపడ్డాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన డాక్టర్ బాలాజీ, పబ్ యజమాని డాక్టర్ అర్జున్ రెడ్డి పేర్లు విచారణలో వెల్లడయ్యాయి. అర్జున్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో Babylon Pubను నడుపుతున్నాడు.

ఈ ఇద్దరూ స్నేహితులని, కలిసే డ్రగ్స్ వాడుతున్నారన్నగి అధికారుల అనుమానం. బాబిలోన్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు తరచూ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయంటున్నారు. ప్రతి వీకెండ్‌లో రోహిత్ రెడ్డి తనకు పరిచయాలున్న రాజకీయ నాయకులకు డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసేవాడని కూడా గుర్తించారు. వాళ్ళతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పార్టీలను వాడుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం కూడా వెలుగులోకి వస్తోంది. రోహిత్ రెడ్డి ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు? ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉంది? అనే అంశాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త నమిత్ శర్మ పాత్రపై ప్రత్యేకంగా విచారణ సాగుతోంది. నమిత్ శర్మను హైదరాబాద్‌కు ఎందుకు పిలిపించారు? రోహిత్ రెడ్డితో కలిసి చేస్తున్న వ్యాపారాలు ఏమిటి? ఎంపీలతో లింకులు ఉన్నాయా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో రోహిత్ రెడ్డి వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, డబ్బుల మూలాలు ఏమిటి, అతని కాంటాక్ట్స్ ఎవరు, ఇతర రాజకీయ నాయకులకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందా అనే కోణాల్లో దర్యాప్తు విస్తరిస్తోంది. మొత్తానికి, ఈ కేసు వ్యక్తిగత డ్రగ్స్ వినియోగాన్ని మించి రాజకీయ సంబంధాల దిశగా సాగుతుండ
టం సంచలనం అవుతోంది.

 

Exit mobile version