OTR: కాకినాడపై ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫుల్ ఫోకస్.. అసలు ప్లాన్ ఏంటి?

Kaki

Kaki

ఆ ఎమ్మెల్సీ డబుల్ గేమ్ ఆడుతున్నారా? రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో తనకు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ…. కేవలం ఆ రెండు నియోజకవర్గాల మీదే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? ఆ రెండు చోట్ల ఏ కార్యక్రమం జరిగినా…. లోకల్‌ ఎమ్మెల్యేలకంటే ముందే వాలిపోయి ఎందుకు హడావిడి చేస్తున్నారు? ఎమ్మెల్సీ వైఖరితో ఎమ్మెల్యేలు విసుగెత్తిపోతున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఎవరా ప్రజాప్రతినిధులు? పేరాబత్తుల రాజశేఖరం…. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆయన సొంత నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం. నిరుడు మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పేరాబత్తుల. అంతకుముందు ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారాయన. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఆశలు పెట్టుకున్నప్పటికీ చివరి నిమిషంలో అప్పటి ఈక్వేషన్స్ ఆధారంగా పక్కన పెట్టింది టీడీపీ అధిష్టానం. ఇక తాను ఎమ్మెల్సీ అయ్యాక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సొంత ఇల్లు తీసుకోవడంతో పాటు ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే పెట్టేశారాయన. ఇటు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా టిడిపి తరఫున వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యేగా జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడా ఇద్దరు వెంకటేశ్వరరావులను పక్కనపెట్టి రెండు నియోజకవర్గాలలో గట్టిగానే అడ్వాన్స్ అవుతున్నారట రాజశేఖరం. ఏదైనా కార్యక్రమానికి పిలవడం పాపం….. ఎమ్మెల్యేల కంటే ముందే వాలిపోయి హాజరే…. అంటున్నారట.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా రాజశేఖరానికి 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రోటోకాల్ వుంటుంది. ఆయన అఫీషియల్‌గానే అన్నిచోట్లకు అలా ఒక రౌండ్ వేసి రావచ్చు. కానీ… వేరే ఎక్కడికీ వెళ్ళకుండా ఫుల్‌ టైం కాకినాడ మీదే ఫోకస్‌ పెట్టడం గురించి రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి. చివరికి సొంత నియోజకవర్గ ముమ్మిడివరంలో కూడా ఇలా కనిపించి అలా మాయమైపోతున్నట్టు చెబుతున్నారు. కాకినాడ రెండు నియోజకవర్గాల్లో మాత్రం ప్రభుత్వ , ప్రైవేట్ కార్యక్రమాల్లో తెగ అడ్వాన్స్ అయిపోతుండటం చూసి… లోకల్‌ ఎమ్మెల్యేలు ఇద్దరిలో కంగారు పెరుగుతోందని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ యవ్వారం ఏదో తేడాగా ఉందే….. అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు సన్నిహితులతో అనడంతోపాటు అసలు క్యాంప్ ఆఫీస్ కాకినాడలోనే ఎందుకు పెట్టారంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. వేరే ఏ ఉద్దేశ్యం లేకుంటే… రెండు జిల్లాలకు మధ్యలో ఉన్న రాజమండ్రిలో ఉండడం బెటర్ కదా అంటూ లాజిక్‌ లాగుతున్నారు కొందరు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గతంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు సీఎం. ఎమ్మెల్సీ వ్యవహారాన్ని అప్పుడు పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళారట ఎమ్మెల్యేలు. దాంతో… సొంత లోక్‌సభ నియోజకవర్గం అమలాపురంలో యాక్టివ్‌గా ఉండమని పార్టీ కార్లిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ రాజశేఖరం మాత్రం మార్పులేకుండా… తన పాత పద్ధతే కంటిన్యూ చేస్తున్నారట.

 

అమలాపురంలో యాక్టివ్‌గా ఉండమని చెప్పారుగానీ….. కాకినాడలో ఉండొద్దని చెప్పలేదు కదా … అంటూ కొత్త లాజిక్ లాగుతున్నట్టు సమాచారం. ఇక రాజమండ్రి, నరసాపురం, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అయితే… అసలు ఎమ్మెల్సీ ఊసేలేదు. ఇక కాకినాడ పరిధిలో… కొన్ని సందర్భాల్లో అయితే… ఎమ్మెల్యేలు రాకుండానే ప్రోగ్రామ్స్‌ని మొదలెట్టేస్తున్నారట రాజశేఖరం. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎంత మాత్రం బాగాలేదని సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఫైనల్‌ అని చెప్పే ప్రయత్నం జరుగుతున్నా… ఎమ్మెల్సీ ఏ మాత్రం పట్టించుకోకుండా…. తన సిస్టంని తాను ఫాలో అయిపోతున్నట్టు చెబుతున్నారు.ఎమ్మెల్యే ఎంతో నేనూ… అంతేనని, రెండు జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లొచ్చని, అది నా ఆప్షన్ అని గట్టిగానే అంటున్నారట. మొత్తానికి రాజశేఖరం ట్రెండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి సొంత వర్గాన్ని మెయిటైన్ చేస్తున్నారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇంటితో పాటు క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టేసి కొత్త కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారట. ఈ వ్యవహారం పార్టీ దృష్టికి వెళ్ళినా….అట్నుంచి రియాక్షన్ అంతంత మాత్రంగానే ఉండటంతో… ఇద్దరు ఎమ్మెల్యేల్లో గందరగోళం ఇంకా పెరిగిపోతోందట.