Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!

  • ఉమ్మడి అనంతపురం పొలిటికల్‌ సీన్‌ కాస్త తేడాగా ఉందా?
  • వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ గేమ్‌ మొదలు పెట్టిందా?
  • పవర్‌లో ఉన్న పార్టీ నేతలకు ప్రతిపక్షం ఎలా వల వేయగలుగుతోంది?
  • ఈసారి పదవులు వస్తాయని చాలామంది టీడీపీ నేతల ఆశలు
  • చిన్న పోస్ట్‌ కూడా రాక అసంతృప్తిగా ఉన్న వాళ్ళే వైసీపీ టార్గెట్‌
Ycp

Ycp

అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ప్రతిపక్షం వల వేస్తోందా? అక్కడ వైసీపీ ఏకంగా టీడీపీ నాయకుల మీదికే ఆకర్ష మంత్రాన్ని ప్రయోగిస్తోందా? ఆ మంత్రానికి ఒకరిద్దరు వశమవుతున్నారన్నది నిజమేనా? అధికార పార్టీగా, తిరుగులేని మెజార్టీతో, మంచి దూకుడు మీదున్న తెలుగుదేశం నుంచి వైసీపీలోకి ఎందుకు మారాలనుకుంటున్నారు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అసలు అధికార పార్టీ నేతల్ని ఆకట్టుకునేందుకు ప్రతిపక్షానికి కలిసి వస్తున్న అంశాలేంటి? 2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చాం….. నాడు తగిలిన దెబ్బకు వైసీపీ కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉంది…… ఇక మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టుగా ఉంది మెజార్టీ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్‌ వ్యవహారం. అందుకే ఇటీవల చాలా నియోజకవర్గాల్లో దూకుడుగా ఉంటున్నారు. మరోవైపు నిన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ లేని పరిస్థితి ఉండేది. కానీ… తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌కు సిద్ధం కమ్మని సీఎం చంద్రబాబు చెప్పడంతో…. ఇక త్వరలోనే ఆ ఎన్నికలు ఉంటాయన్న సంగతి తేలిపోయింది. అదే సమయంలో రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీని ప్రకటించిన.. తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్న ప్లానింగ్‌ ఉన్నట్టు కనిపిస్తోంది.

అయితే…. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం వాతావరణం కాస్త తేడాగా ఉందట. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా…అనంత వైసీపీ కొత్త గేమ్‌ స్టార్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర తీసి లోకల్‌ ఎలక్షన్స్‌లో జిల్లా మీద ఎంతోకొంత పట్టు బిగించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. మామూలుగా అయితే…అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షం నుంచి చేరికల్ని ప్రోత్సహించి వాళ్ళను బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తాయి. ఆ దెబ్బకు విపక్షాలు విలవిల్లాడిని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ…పవర్‌లో ఉన్న పార్టీ నుంచి, అదీకూడా ఇంకా మూడేళ్ళ అధికారం ఉన్నటైంలో నేతల్ని ఆకట్టుకోవడానికి ప్రతిపక్షం ప్లాన్‌ చేయడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలంటున్నారు పరిశీలకులు. అయితే… ఈ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ అంత ఆషామాషీగా ఏం చేయడం లేదట. సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి టీడీపీ నేతల్ని ఫ్యాన్‌ కిందికి లాక్కునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అసంతృప్తిగా ఉండి, పార్టీ వ్యవహారాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతల మీదికి వల విసురుతున్నట్టు తెలిసింది.

పార్టీ ఈసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చినందున ఏదో ఒక పదవి వస్తుందని ఆశించి, కనీసం చిన్నపాటి నామినేటెడ్‌ పోస్ట్‌ కూడా రాక భంగపడి, అసహనంతో ఉన్నవాళ్ళనే వైసీపీ టార్గెట్‌ చేస్తోందట. అలాగే…. ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపకాల విషయమై రాజీపడ్డ కొంతమంది మాజీలకు కూడా టీడీపీ అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చిందని, ఇప్పటికీ వాటి గురించిన ప్రస్తావన లేదు, తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న భావనలో ఉన్న వారి వైపు వైసీపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా టీడీపీలో అసంతృప్తులు ఏ రూపంలో ఉన్నా…. వాళ్ళని టచ్‌ చేసి తమవైపు లాక్కునే పనిని చాపకింద నీరులా మొదలు పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో అలాంటి అసంతృప్తులు ఎవరెవరు ఉన్నారన్న లెక్కలు తీసి వారికి గురిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం…. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేని వైసీపీలోకి తీసుకునేందుకు దాదాపుగా లైన్‌ క్లియరైనట్టు తెలిసింది.

గత ఎన్నికల్లో సదరు నేతకు తీవ్ర అన్యాయం జరిగిందన్న చర్చ టీడీపీ వర్గాల్లో కూడా ఉందట. అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక పార్టీలో ఉండటం అనవసరమన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఆ పాయింట్‌ మీదనే కొట్టి ఆయన్ని తమవైపు తిప్పుకునేందుకు జిల్లా వైసీపీ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. ఇలాంటి వ్యవహారాలు…ఉమ్మడి అనంతపురం జిల్లాలో పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఆ నేతలను పార్టీలోకి తీసుకుంటే… గట్టి ప్రభావం చూపించవచ్చన్న అభిప్రాయంలో ఫ్యాన్‌ నేతలు ఉన్నారట. ఈ లెక్కన చూస్తుంటే…. ఉమ్మడి జిల్లాలో రాబోయే రెండు మూడు నెలల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉదని, అవి ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.