Site icon NTV Telugu

Off The Record : పటాన్‌చెరులో ఒక్కటైన నీలం మధు, కాటా శ్రీనివాస్

Neelam Madhu

Neelam Madhu

ఒకే పార్టీలో ఉన్నా… ఉప్పు నిప్పులా రాజకీయం నడిపిన ఆ నాయకులు ఇద్దరూ ఇప్పుడు సెట్‌ అయినట్టేనా? కలిసి ఉంటే కలదు సుఖం అంటూ స్నేహ గీతం ఆలపిస్తున్నారా? మధ్యలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నాయకుడొకరు పరోక్షంగా వీళ్ళ మధ్య ఐక్యత పెరగడానికి కారణం అయ్యారా? ఎవరా ఇద్దరు? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో అంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్టు జరిగాయి 2023 అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడీ అయ్యారు గూడెం మహిపాల్‌రెడ్డి. అప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్న నీలం మధు పోటీకి రెడీ అయినా… అధిష్టానం ఛాన్స్‌ ఇవ్వలేదు. దాంతో నీలం కారు దిగికాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ టిక్కెట్‌ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ… ఆయనకు షాకిస్తూ… నీలంకు ఫైనల్‌ చేసింది కాంగ్రెస్‌. దాంతో భగ్గుమన్న కాట వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఆ వత్తిడితో తిరిగి కాట శ్రీనివాస్‌కే టిక్కెట్‌ ఇస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్‌ పెద్దలు. ఈ వ్యవహారాలు జరక్క ముందు నీలం మధు, కాట శ్రీనివాస్‌కు ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. కానీ….టికెట్‌ లొల్లి తర్వాత సీన్ మారి నీలం, కాట శత్రువులుగా మారిపోయారు. ఇక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కరపున గూడెం మహిపాల్‌రెడ్డి గెలవగా… రెండో స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్, మూడో స్థానంలో నీలం మధు ముదిరాజ్ నిలిచారు. ఒకవేళ కాంగ్రెస్‌ తరపున వాళ్ళు ఇద్దరూ కలిసి పనిచేసి ఉంటే గనక కచ్చితంగా పటాన్‌చెరులో కాంగ్రెస్‌ జెండా ఎగిరి ఉండేదన్న విశ్లేషణలున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కారించి ఉంటే కథ వేరుగా ఉండేదని పార్టీ కేడర్‌ కూడా వాదించింది. ఇక లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి నీలం మధును మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌. దీంతో అప్పటివరకు శత్రువులుగా ఉన్న మధు, కాట శ్రీనివాస్ కలిసిపోయారు. మధు ఓడిపోగా… ఆ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. BRS నుంచి గెలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రత్యర్థులంతా అధికార పార్టీలోకే వచ్చినట్టయింది. నీలం మధు, కాట శ్రీనివాస్ మధ్య విభేదాలు ఉన్నా… వర్గాలుగా ఎక్కడా బయటపడలేదు. కానీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వచ్చాక పాత కాంగ్రెస్ వర్సెస్ మహిపాల్ రెడ్డి అన్నట్టు తయారయింది. మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో తమకి ప్రాధాన్యత ఇవ్వకుండా తనతో పాటు చేరిన BRS పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన రకరకాల పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి మెల్లగా దూరం అవ్వడం మొదలుపెట్టారు ఎమ్మెల్యే.

సర్పంచ్ ఎన్నికల సమయంలో అసలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉన్న మహిపాల్ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి BRS కే సపోర్ట్ చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. దీంతో మధు, శ్రీనివాస్ ఒక్కటయ్యారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని కార్యకర్తల సమావేశం పెట్టుకుని చేతులు కలిపారు. అయితే ఇస్నాపూర్ నీలం మధు సొంత మున్సిపాలిటీ కావడంతో దానిమీద ఎక్కువ ఫోకస్‌ పెట్టారాయన. అయినా… తృటిలో చైర్మన్ పీఠాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్. మిగతా మున్సిపాలిటీల్లో నామ మాత్రపు పోటీ ఇచ్చింది. దీంతో తాను BRS కే సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు నీలం మధు, కాట శ్రీనివాస్ కలిసి పని చేస్తున్నారు. ఈ స్నేహబంధం ఇలాగే ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాట, నీలం ఇద్దరు బీసీ నేతలే కావడంతో పార్టీలో వారికి సముచిత స్థానం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. GHMC ఎన్నికల్లో ఇద్దరు ఇప్పటి నుంచి కలిసి పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని క్యాడర్ ఆశిస్తోంది. ఈ సయోధ్య కంటిన్యూ అవుతుంతో మళ్లీ జర్క్‌లు వస్తాయో చూడాలి.

Exit mobile version