తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పొత్తులు వెలుగు చూస్తున్నాయి. చిత్ర విచిత్రాలు తెర మీదికి వస్తున్నాయి. రాష్ట్రమంతటా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న సీపీఐ అక్కడ మాత్రం గులాబీ జెండాకు జై కొట్టింది. ప్రస్తుతానికి ఒక మున్సిపాలిటీతో మొదలైన వ్యవహారం భవిష్యత్లో కొత్త సమీకరణలకు దారి తీస్తుందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడ మిత్ర పక్షాల మధ్య ఎందుకు చిచ్చు రగిలింది? మధ్యలో కారు పార్టీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంది? మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పొత్తు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ వేస్తున్న ఎత్తులకు పై ఎ్తతులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రాష్ట్రమంతటా రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది. కానీ… మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి మేటర్ మొత్తం తిరగబడిపోయి…. బీఆర్ఎస్తో రాజీ కుదుర్చుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి నడవాలని డిసైడ్ చేసుకోవడమేగాక… సీట్ల పంపకాలు సైతం పూర్తయ్యాయి. 22 వార్డులున్న క్యాతనపల్లిలో 8 వార్డులు సీపీఐకి, మిగతా 14 సీట్లతో పాటు ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కే ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీ ఫామ్స్ కూడా ఇచ్చేశారు. క్యాతనపల్లి, రామకృష్టాపూర్లో సీపీఐకి గతంలో మంచి పట్టుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అది కాస్త తగ్గినా…. ఇప్పుడు సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉండడం, కార్మికుల ఓట్లు కీలకం అయిన టైంలో…. తన మిత్రపక్షం కాంగ్రెస్తో కలిసి నడవకుండా రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్తో సీపీఐ చేతులు కలపడం చర్చనీయాంశం అవుతోంది. ఓవరాల్గా జిల్లా మొత్తం మీద సీట్ల పంపకాల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభనే మిత్రభేదానికి కారణమని తెలుస్తోంది. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే… ఇక్కడ మొత్తం 60 డివిజన్స్ ఉన్నాయి. అందులో ఒకే ఒక్క సీట్లో పోటీ చేసే అవకాశం దక్కింది లెఫ్ట్ పార్టీకి. సీపీఐ అభ్యర్థులు ముందు 6 చోట్ల నామినేషన్ వేసినా… చివరికి ఒక్క డివిజన్తో సర్దుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతుండగా… ఆరు నామినేషన్స్వేసి 4 డివిజన్స్ కావాలని అడిగారు, చివరికి రెండు సిట్టింగ్ స్థానాలైనా ఫర్వాలేదనుకున్నారుగానీ…. ఫైనల్గా ఒక్కదానితో సర్దుకుపోవాల్సి వచ్చింది. చెన్నూర్లో మాత్రం ఎలాంటి పొత్తులేకుండా ఒంటరిగానే బరిలో దిగింది సీపీఐ. ఇక్కడ ఆ పార్టీ తరపున 4 బీఫామ్స్ ఇచ్చారు. అటు బెల్లంపల్లి మున్సిపాలిటిలో కూడా ఒంటరిగానే 7 స్థానాలకు నామినేషన్ వేసింది సీపీఐ. ఇక్కడ పొత్తులో కనీసం నాలుగు సీట్లలో పోటీకి ఛాన్స్ ఇవ్వమని అడుగినా… కాంగ్రెస్ నుంచి స్పందన లేదట. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోగా.., లోకల్ నేతలతో మేటర్ కొలిక్కి రాలేదు. దాంతో బెల్లంపల్లిలో సోలో ఫైట్కే సిద్ధమైంది సీపీఐ. అటు పొత్తు చెడ్డ క్యాతన్ పల్లిలో మాత్రం సీపీఐకి మంచిపట్టే ఉంది. గతంలో మూడు సార్లు సర్పంచ్ , ఎంపిటీసీలు గెలిచిన చరిత్ర ఉంది. మూడు సార్లు మండల అధ్యక్షులుగా సీపీఐ నాయకులే పనిచేశారు. ఇప్పుడు ప్రాభవం కాస్త తగ్గినా… మా మాట నడుస్తుందన్నది లెఫ్ట్ నేతల మాట. అందుకే… కాంగ్రెస్ పార్టీని 10 వార్డులు అడిగితే…. ఐదు ఇచ్చేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే ,కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకున్నారట. కానీ… సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ తన వార్డును ఇవ్వనని పేచీ పెట్టడంతో పొత్తు తెగదెంపులైందని చెబుతున్నారు కామ్రేడ్స్.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ,ఏఐటీయూసి నేత వాసిరెడ్డి సీతారామయ్య, ఇతర నేతలంతా కలిసి ఇటీవల సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి రెండు పార్టీల పొత్తుపై ప్రకటన చేశారు. ఆ విధంగా క్యాతనపల్లిలో పొత్తు పూర్తిగా చెడిపోతే…. మంచిర్యాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కసీటుతో సర్దుకుపోయారు కామ్రేడ్స్. చెన్నూరు, బెల్లంపల్లిలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. సీట్ల కోసం కాంగ్రెస్ బేరాలాడటం, పట్టింపులేనితనంతో ఉండటంలాంటి కారణాలతో కమ్యూనిస్ట్ నాయకులు ఫీలైనట్టు తెలుస్తోంది. పై స్థాయిలో ఎలా ఉన్నా… మున్సిపాలిటీల లెవల్లో కొందరు అధికార పార్టీ నాయకులు కాస్త తేడాగా మాట్లాడుతున్నారట. అందుకే అందుకే కామ్రేడ్స్ వేరేదారి చూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు క్యాతనపల్లినే తీసుకుంటే…. ఇక్కడ సీపీఐ కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్తో జట్టు కట్టడం చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ బేరాలాడ్డం, ప్రతిపక్షం మీ ఇష్టం అన్నట్టుగా ఉండటంతో అటువైపే లెఫ్ట్ కంఫర్ట్గా ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అయితే… ఈ కంఫర్ట్నెస్ మున్సిపల్ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా లేక ముందు ముందు సరికొత్త రాజకీయ సమీకరణలను చూడబోతామా అని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
