ఒట్టి మాటలు కట్టిపెట్టి పార్టీ కోసం గట్టిగా పని చేయాలని ఆ ఎమ్మెల్యేకి ఏపీ సీఎం చంద్రబాబు సూచించారా? రాజకీయాల్లో రాణించాలంటే… అద్భుతమైన ప్రసంగాలు మాత్రమే చేస్తే సరిపోదని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారా? తమ ఫిర్యాదులతో… సీఎం, ఎమ్మెల్యేని దబిడిదిబిడి వాయిస్తారనుకున్నా…. సింపుల్గా వదిలేశారని ఆయన వ్యతిరేకవర్గం ఫీలవుతోందా? ఎవరా శాసనసభ్యుడు? ఆయన మీదున్న అభియోగాలేంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024లో జిల్లా నుంచి పార్టీ తరపున ఎక్కువ మంది శాసనసభ్యులు గెలవడంతో… ఇక పట్టు సడలకుండా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారట. జిల్లా టూర్కు వచ్చినప్పుడల్లా…. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ గురించి కేడర్ ముందే కుండబద్దలు కొట్టేసి వాళ్ళని అలర్ట్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఈ క్రమంలోనే… ఇటీవల కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో…స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరును ప్రస్తావించారు. ప్రసంగాలు అదరగొట్టే… ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలంటూ సున్నితంగా హెచ్చరించడం గురించి ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కావలి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి…. 30 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.
తర్వాత బీదా వర్గం, మొన్నటిదాకా దగదర్తికి చెందిన సుబ్బానాయుడు వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ఆయన కొత్తవారిని ప్రోత్సహించడంతో… నియోజకవర్గంలోని పాతతరం టీడీపీ నేతలు కొందరు దూరమయ్యారు. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారట. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కావలిలో అందర్నీ సమన్వయం చేసుకోవడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. అలాగే ఆయన మీద ఫిర్యాదులు పెరిగిపోవడంతో…ఈసారి టూర్లో చంద్రబాబు ఓ రేంజ్లో ఫైర్ అవుతారని ఆయన వ్యతిరేక వర్గం భావించిందట. కానీ…అలాంటిదేం జరగలేదుగానీ…. ప్రసంగాలు మాని పని తీరు మెరుగుపర్చుకోమంటూ సున్నితంగా హెచ్చరించారు సీఎం. అలా ఎందుకంటే…. ఎవరెన్ని చెప్పినా… జిల్లా నుంచి తెప్పించుకున్న ఫీడ్బ్యాక్తో ఎమ్మెల్యే పనితీరు మీద ముఖ్యమంత్రి ఒక అవగాహనకు వచ్చారన్నది పార్టీ టాక్.
ఇలా సెన్సిటివ్గా ఉంటే… రాజకీయాల్లో వర్కౌట్ అవదని కూడా…. కావ్య కృష్ణారెడ్డికి చెప్పారట చంద్రబాబు. అదేసమయంలో… యాక్టివ్గా ఉంటే సరిపోదు, పార్టీకి దూరంగా ఉండే నాయకుల్ని కూడా దగ్గర చేసుకోవాలని సూచించారట. కొత్త కమిటీలు సరిగ్గా పనిచేయడం లేదని.. అలాంటి వారితో సున్నితంగా వ్యవహరించవద్దని సూచించినట్టు తెలిసింది. మహిళలకు పార్టీలో, కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తున్నా.. క్యాడర్ మీటింగ్స్కు మాత్రం వాళ్ళ భర్తలు వస్తున్నారని, ఇక నుంచి పదవుల్లో ఉన్న వారే మీటింగ్కి వచ్చేలా చూడాలని కూడా చెప్పారు. అదంతా ఒక ఎత్తయితే….ర్యాంకింగ్లో వెనుకబడిన పలువురు ఎమ్మెల్యేలకి చంద్రబాబు ఘాటుగా వార్నింగ్స్ ఇస్తున్న క్రమంలో….. కావలి ఎమ్మెల్యేకి కూడా అదే స్థాయి హెచ్చరికలు ఉంటాయని ఆయన వ్యతిరేక వర్గం భావించిందట. కానీ… భారీ ఎత్తున ఫిర్యాదు చేసినా…తాము ఊహించినట్టు జరక్కపోవడంతో ఆ వర్గం బాగా డిజప్పాయింట్ అయినట్టు తెలిసింది.
పైగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో కలిసి కావలి అభివృద్ధికోసం పని చేయాలని సూచించారు సీఎం. సీఎం ర్యాంకింగ్స్లో 59 శాతం మార్కులతో 107 స్థానంలో ఉన్నారు కావలి శాసనసభ్యుడు. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకుని పోకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని, ఆ లోపాన్ని సరిదిద్దుకుని పనితీరు మెరుగుపర్చుకుంటే…. ర్యాంక్ కూడా బెటర్ అవుతుందని చెప్పినట్టు తెలిసింది. కావలి నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గం కూడా ఉండడంతో.. వారికి ఎమ్మెల్యే మనుషులకు పడటం లేదట. పాతతరం నేతల్లో కొందరు రవిచంద్రతో సన్నిహితంగా ఉంటూ ఎమ్మెల్యేతో టచ్ మీ నాట్ అంటున్నారు. కానీ… దాని గురించి చంద్రబాబు మాట మాత్రం ప్రస్తావించలేదని, అలా ఉంటే… ఎమ్మెల్యే ఫ్రీ గా ఎలా పనిచేస్తారంటూ ఆయన అనుచరులు కొత్త రాగం అందుకున్నారు. మొత్తంగా సీఎం సీరియస్ వార్నింగ్ నుంచి ప్రస్తుతానికి ఎమ్మెల్యే తప్పించుకున్నా… ఇన్ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటోంది ఆయన వ్యతిరేకవర్గం.
