మళ్ళీ పుడతామా ఏంటి…! ఈ మధ్య వచ్చిన ఓ హిట్ మూవీలో పాపులర్ డైలాగ్ ఇది. అచ్చం అదే మాడ్యులేషన్లో కాస్త డిఫరెంట్గా…. మళ్ళీ పోటీ చేస్తామా ఏంటి…! కాస్త తేడాగా మాట్లాడుతున్నారట ఆ ఎమ్మెల్యే సార్. సినిమా డైలాగ్ పూర్తి పాడిటివ్ వేలో ఉంటే… ఇక్కడ మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న యాంగిల్ బయటపడుతోందంటున్నారు. ఎవరా శాసనసభ్యుడు? మరీ… ఆబగా పోగేసుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వ్యవహారశైలిపై లోకల్గా కాస్త డిఫరెంట్ టోన్లో మాట్లాడుకుంటున్నారట. సార్…. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టి సొంత వృద్ధి మీదే ఫోకస్ పెడుతున్నారన్నది ఆ చర్చ సారాంశం. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన జోగేశ్వరరావు… ఈ విడత గెలిచాక మాత్రం తేడాగా కనిపిస్తున్నారని, నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. నాలుగు సార్లు గెలిచాను, ఇక చాలు… రాజకీయాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఉద్దేశ్యంతోనే… ప్రజా సమస్యలను, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పుకుంటున్నారు. ఈసారి ఎమ్మెల్యే అయ్యాక పనితీరు అస్సలు బాగోలేదని అంటున్నారు.
డబ్బులు తీసుకుని ఓటేశారు. మీకు నేనెందుకు పని చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నది లోకల్ వాయిస్. ఈ విడత ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు దాటినా… ఒక్క హామీ కూడా నెరవేర్చలేదట. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోతోందంటున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నవాళ్ళు ఆ మధ్య ద్వారపూడిలో జోగేశ్వరరావు దిష్టిబొమ్మను కోడి గుడ్లతో కొట్టిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు కొందరు. అదే తరహా సీన్ను మరోసారి చూడాల్సి వస్తుందేమోనంటూ తాజా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. పెద్ద కాలువ గట్టు ప్రక్కన దశాబ్దాలుగా… ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. పుష్కరాలకు రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పుడు 40 ఇందిరమ్మ ఇళ్లను కూల్చేశారు. మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి వేళ వాటిని తొలగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పుష్కరాల కోసం వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తారుగానీ… కాలువలో చేయరు కదా…? అంటూ లాజిక్ తీస్తున్నారు బాధితులతో పాటు ప్రతిపక్ష నాయకులు. దీని వెనక వేరే మతలబు ఏదో ఉందని అనుమానపడ్డ కొందరు… అసలు సంగతి అదీ… అంటూ జోగేశ్వరరావు మీద కొత్త ఆరోపణలు చేస్తున్నారు. కూల్చేసిన ఈ ఇందిరమ్మ ఇళ్ళ వెనక ఎమ్మెల్యేకి 10 ఎకరాల భూమి ఉందట. అందులో రియలెస్టేట్ డెవలప్మెంట్ కోసమే పుష్కరాల పేరుతో అలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఇంకొందరు.
తొలగిస్తే అన్నిటినీ తీసేయాలి గానీ…. టీడీపీ నాయకుడి ఇంటిని మాత్రం ఎందుకు వదిలేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ టిడిపి నేతకు ఒక న్యాయం, మిగతా వాళ్ళందరికీ మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పనితీరు చర్చనీయాంశంగా మారింది. జోగేశ్వరరావు వరుసగా నాలుగుసార్లు మండపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచినా… తన మార్క్ ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేందటున్నారు రాజకీయ విశ్లేషకులు. టిడ్కో ఇళ్ళు కట్టించినా.. అసంపూర్తిగానే ఉన్నాయి. అక్కడ కనీస సౌకర్యాలు లేక నేటికీ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్వారపూడి నుండి తాపేశ్వరం మీదుగా మండపేట వరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. కానీ మధ్యలో పలుచోట్ల కల్వర్టుల నిర్మాణం మిగిలింది. రెండేళ్ళు గడిచినా… ఇప్పటివరకు ఆ నిర్మాణ పనులను ప్రారంభించలేదు. ఈ రోడ్డు నిర్మాణం కోసం వైసీపీ హయాంలో జోగేశ్వరరావు పలు ఉద్యమాలు చేశారు. దీని విషయమై…ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో ఛాలెంజ్ చేశారు కూడా. కానీ… గెలిచిన తర్వాత ఈ మాటే మర్చిపోయారనే విమర్శలున్నాయి. ద్వారపూడి, కేశవరం రైల్వే గేటు దగ్గర ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ… ఇంతవరకు కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదని అంటున్నారు.
ఇక మండపేట నియోజకవర్గంలోని ఇసుక, రేషన్ బియ్యం, మద్యం మాఫియాల్లో ఎమ్మెల్యే బంధువులు కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మండపేటలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే అనుచరులు, బంధువుల కనుసన్ననల్లోనే జరుగుతాయన్న ఆరోపణలు పెరుగుతుండగా… అధికార పార్టీ నాయకులు మాత్రం ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని కొట్టిపారేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోపణలకు జోగేశ్వరరావు ఎలా స్పందిస్తారు..? అభివృద్ధి హామీల అమలు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఆయన మళ్ళీ పోటీ చేయకపోతేపోయారుగానీ… అలా అనుకున్నప్పుడు నాలుగు మంచి పనులు చేసి రిటైర్మెంట్ తీసుకుంటే… కలకాలం గుర్తుండి పోతారుకదా…! ఆ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలాగంటూ సొంత వర్గంలో కూడా మాట్లాడుకుంటున్నారట.

