Site icon NTV Telugu

Off The Record : లొంగిపోయారా..? లేక అరెస్ట్ అయ్యారా..? మావోయిస్టు నేతల కేసులో కొత్త ట్విస్ట్..!

మావోయిస్ట్‌ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లారెడ్డి లొంగిపోలేదా? వాళ్ళని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారా? అదే నిజమైతే… ఎందుకు లొంగుబాటు చూపించారు. సీఎం సమక్షంలో లొంగిపోవడం అంతా పోలీసుల సృష్టేనా? హఠాత్తుగా దేవ్‌, రాజీరెడ్డి తాము లొంగిపోలేదు, అరెస్ట్‌ అయ్యామని ఎందుకు చెబుతున్నారు? ఇందులో మతలబు ఏంటి? మావోయిస్ట్‌ అగ్ర నేతలైన దేవ్‌జీ , రాజిరెడ్డి అరెస్ట్‌ అయ్యారా? లేక పోలీసులకు లొంగిపోయారా అన్న సందేహాలు కొత్తగా తలెత్తుతున్నాయి తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. నిజంగానే వాళ్ళని అరెస్ట్‌ చేస్తే… లొంగుబాటుగా ఎందుకు చిత్రించారన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ ఇద్దరు నేతలతో పాటు పలువురు మావోయిస్ట్‌లు లొంగిపోయినట్టు భారీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మీడియాకు వివరించారు. దాంతో… నిజంగానే లొంగిపోయారని అంతా అనుకున్నారు.

అయితే… అసలు ట్విస్ట్‌ ఆ తర్వాతే వెలుగు చూసింది. రెండు రోజులుగా పోలీసుల సమక్షంలోనే మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్న దేవ్‌జీ, రాజీరెడ్డి మాత్రం తమది లొంగుబాటు కాదు, అరెస్ట్‌ అని చెబుతున్నారు. ఆపరేషన్‌ కగార్‌ కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న క్రమంలో అరెస్ట్‌ చేసినట్టు చెబుతున్నారు. రాజిరెడ్డిని హన్మకొండలో, దేవ్‌జీని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారని ప్రచారం చేసుకుంటున్నారు. ముందు తామే లొంగుబాటును చూపించిన పోలీసులు, అదే.. తిరిగి తమ సమక్షంలోనే తాము లొంగిపోలేదు, అరెస్ట్‌ చేశారని నక్సలైట్‌ నాయకులు చెబుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. దీంతో పోలీసులు ఎందుకు ఈ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.

దేవ్‌జీ, రాజిరెడ్డి పార్టీని విభేదించి ముందుగానే బయటకు వచ్చి పోలీసుల ఆదేశాలతో పనిచేస్తున్నారని అంతకుముందు మావోయిస్ట్‌ పార్టీ నుండి ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతున్న కమ్రంలో మావోయిస్ట్‌ పార్టీలో లుకలుకలు, విరుద్ద ప్రకటనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలతో కూడిన ప్రకటనలు వచ్చిపడ్డాయి. కగార్ మొదలైనప్పటి నుంచి మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరైన మల్లోజులకు ప్రాణభయం పట్టుకుందని, అందుకే తమకు తెలియకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో టచ్లోకి వెళ్లిపోయి ఆయన లొంగిపోయారని కూడా ఒక వర్గం చెప్పింది. అలాగే ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తామని మల్లోజులు ఇచ్చిన స్టేట్మెంట్ పార్టీకి తీరని నష్టం చేసిందని. ఆ ప్రకటనతోనే చాలామంది ఆయుధాలతో వచ్చి లొంగిపోయారంటూ ఎదురుదాడి సైతం జరిగింది.

మొత్తం మీద ఈ ఇద్దరు నేతల వ్యవహర శైలిపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తున్నందున నష్టనివారణ చర్యల్లో భాగంగా లొంగిపోలేదు , అరెస్ట్‌ అయ్యామనే భావన ప్రజల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకు పోలీసులను ఒప్పించి ఈ అరెస్ట్‌ ప్రచారానికి రెండు రోజులుగా మీడియాను ఉపయోగించుకుంటున్నారని లెఫ్టిస్ట్‌లు కొంతమంది చెబుతున్నారు. మావోయిస్ట్‌ల గొడవ ఎలా ఉన్నా..ఇద్దరు అగ్రనేతలు, ఇతర మావోయిస్ట్‌లు లొంగిపోయినట్లు ప్రకటించిన పోలీసులు, ఇప్పడు అదే నక్సలైట్లు లొంగిపోలేదు అరెస్ట్‌ చేశారని చెబుతున్నా ఎందుకు కామ్‌గా ఉంటున్నారన్నది బిగ్‌ క్వశ్చన్‌. దీనికి తెలంగాణ పోలీసులే సమాధానం చెప్పాలి.

Exit mobile version