బావమరిది కళ్ళలో ఆనందం కోసం బావ కూడా కండువా మార్చేస్తారా? ఏంటి బావా… సంగతి అంటే…ఏం లేదు బామ్మర్దీ…. వచ్చేస్తున్నా… నీ వెంటే నేను అంటూ సూట్కేస్ సర్దేస్తారా? కుటుంబ బంధం, రాజకీయ అనుబంధం అంతగా పెనవేసుకుని పోయిన ఆ వ్యవహారం ఎక్కడ జరుగుతోంది? ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా కండువాల మార్పిడి వ్యవహారం? విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం గురించి చర్చ మొదలైంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీకి రాజీనామా చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడం అనూహ్య పరిణామం. దానికి అనుబంధంగా ఏం జరగబోతోందంటూ జిల్లాలో మొదలైన డిస్కషన్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పుడు చిన్న శ్రీను బావ, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి పొలిటికల్ స్టెప్స్ ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. కుమార్తె సిరి సహస్రతో కలిసి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను టీడీపీ కండువా కప్పుకోవడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర లేచింది. ఈ క్రమంలోనే… ఇప్పటివరకు వైసీపీలో కొనసాగుతున్న బడ్డుకొండ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే… బడ్డుకొండ, చిన్న శ్రీను… సొంత బావ, బావమరుదులేగాక వియ్యంకులు కూడా. తన కుమారులు ఇద్దరితో కలిసి వైసీపీలోనే కొనసాగాలని అప్పలనాయుడు నిర్ణయించుకుంటే.. రాజకీయ విభేదాల ప్రభావం ఎలా ఉంటుందన్నదన్న ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణతో బడ్డుకొండ వర్గానికి ఉన్న రాజకీయ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీనే బ్యాలెన్స్ చేసేవారట. కానీ… ఇప్పుడు అదే వ్యక్తి వైసీపీని వీడి టీడీపీలో చేరడం పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసిందని అంటున్నారు. బావమరిది టీడీపీలో.. బడ్డుకొండ వైసీపీలో కొనసాగితే….పరిస్థితులు ఎలా మారతాయోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అలాగే… బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావుకు కూడా మాజీ ఎమ్మెల్యేతో విభేదాలున్నాయట. ఈ విషయమై గతంలో బొత్స స్వయంగా మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకుంటారు.
ఇలాంటి రకరకాల పొలిటికల్ కిచిడీ పరిస్థితుల్లో అప్పలనాయుడు వైసీపీలోనే కొనసాగుతారా? ఒకవేళ ఉంటే… ఆ కుటుంబం విషయంలో పార్టీ నాయకత్వం తీరు ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ బావమరిది వెంట అడుగులు వేసి బడ్డుకొండ అప్పలనాయుడు కూడా టీడీపీలో చేరాలని అనుకున్నా…అక్కడ సైతం సవాళ్లు తప్పకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే…కూటమి పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన కోటాలోకి వెళ్లింది . ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు తమ ఉనికి కోల్పోకుండా రాజకీయ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కర్రోతు బంగార్రాజు ఇప్పటికీ కీలకంగా ఉన్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి కూడా పర్మినెంట్గా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరితో బడ్డుకొండకు విభేదాలున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరితే.. ఆయనకు ఎంత వరకు ప్రాధాన్యం దక్కుతుందన్నది డౌటేనని అంటున్నాయి రాజకీయవర్గాలు.
ఇలాంటి వాతావరణంలో… ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతల మధ్యలోకి మరో నేతను తీసుకువచ్చి… ఇంకో రాజకీయ కేంద్రాన్ని సృష్టిస్తారా…. అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇక్కడ బడ్డుకొండ కుటుంబానికి మరో రాజకీయ ఇబ్బంది కూడా ఉందని అంటున్నారు. మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో, ఈ ఫ్యామిలీ వైసీపీలోనే కొనసాగితే… బంధుత్వం, రాజకీయం రెండూ వేర్వేరు దారుల్లో నడిచే పరిస్థితి. బావమరిది ఒక పార్టీలో.. బావ బడ్డుకొండ మరో పార్టీలో ఎందుకన్న విమర్శలు రావచ్చన్న భయాలు సైతం ఉన్నాయట. ఒకే కుటుంబానికి చెందిన కీలక నేతలు రెండు పార్టీల్లో ఉంటే.. ఆ ప్రభావం కేడర్పైనా, స్థానిక రాజకీయాలపైనా పడే అవకాశం ఉంటుందన్న చర్చలు నడుస్తున్నాయి. ఇలా… రకరకాల రాజకీయ లెక్కల్ని తిరగేసి మరగేసి చూస్తే… మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు పార్టీ మారి టీడీపీలోకి వెళ్లడం పెద్ద సమస్య కాదుగానీ…. అక్కడ ఎంత వరకు ఇమడగలరన్నదే మెయిన్ పాయింట్ అంటున్నారు పరిశీలకులు. బావమరిది తీసుకున్న రాజకీయ నిర్ణయం బావ పొలిటికల్ కెరీర్ మీద ప్రభావం చూపుతుందా? అప్పలనాయుడు కూడా పసుపు కండువా కప్పుకుంటారా? లేక వైసీపీలోనే ఉండి సవాళ్లను ఎదుర్కొంటారా అన్నది ప్రస్తుతం విజయనగరం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ.

