తెలంగాణ కాంగ్రెస్లోని ఆగ్ర నేతలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుతోందా? ఒకే ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉండే నాయకులు ఇద్దరి మధ్య ఓ నామినేటెడ్ పోస్ట్… మంటను ఇంకాస్త ఎగదోసిందా? ఎవరా ఇద్దరు లీడర్స్? ఏదా రాష్ట్ర స్థాయి పదవి? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెసస్లో కీలక నేతలు. ఇటు నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీకి వాళ్లే పెద్దదిక్కు. కానీ… ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంత కాలంగా గ్యాప్ పెరుగుతోందని జిల్లా పార్టీ వర్గాలే అంటున్నాయి. లోకల్గా పట్టు, పెత్తనం కోసం ఇద్దరి మధ్య నువ్వా-నేనా అనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తోందని చెబుతున్నారు. అసలే ఉన్న పోరు అగ్గికి ఆజ్యం పోసినట్లు.. ఓ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి వ్యవహారం ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ను మరింత పెంచిందని చెప్పుకుంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ డాక్టర్ కవితా రెడ్డిని….. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు కూడా. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి మరీ కవితారెడ్డికి పదవి ఇప్పించారన్నది పార్టీ టాక్. కానీ… ఆమెకు ఆ పోస్ట్ ఇవ్వడం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఏ మాత్రం ఇష్టంలేదని పార్టీలో సైతం ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే…. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ దూరంగా ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు డాక్టర్ కవితా రెడ్డి నియామకం జరిగింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది.
బాధ్యతల స్వీకరణకు ఆహ్వాన పత్రికలు సైతం రెడీ చేసుకున్న కవితారెడ్డి…. కార్యక్రమానికి రావాలని మహేష్ గౌడ్ను ఆహ్వానించారట. ఐతే… మున్సిపల్ ఎన్నికలయ్యాక చూద్దామంటూ అప్పట్లో ఆయన సున్నితంగా కార్యక్రమాన్ని వాయిదా వేయించారట. ఇలా రెండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించాల్సిన కవితారెడ్డి… కాస్త ఆలస్యంగా ఇటీవలే ఆ పని పూర్తి చేశారు. ఈ క్రమంలో అసలు ఆమెకు పదవి ఇవ్వడం ఇష్టంలేకే పీసీసీ చీఫ్ వాయిదా వేయించారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. ఆయన వద్దంటుంటే…. పెద్దాయన మాత్రం పట్టుబట్టి ఇప్పించారన్నది ఇంటర్నల్ టాక్. ఈ విషయంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు.. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. వేం జోక్యంతో మహేష్ గౌడ్ వెనక్కి తగ్గి ఓకే అయితే చెప్పారుగానీ….. ప్రమాణ స్వీకారానికి మాత్రం దూరంగా ఉండిపోయారట.
దాని గురించి హస్తం పార్టీలో పెద్ద చర్చే జరిగింది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని డాక్టర్కు ఏకంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఎలా ఇస్తారంటూ మహేష్ అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. కానీ…. జిల్లాలో సీనియర్ వైద్యురాలిగా తన సామాజిక వర్గానికి చెందిన కవితా రెడ్డి ఆ పోస్టుకు కరెక్ట్ అని సుదర్శన్రెడ్డి వాదించారట. అలా ఆ పోస్ట్ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉన్న అంతో ఇంతో గ్యాప్ని మరింత పెంచిందని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ బయటపడింది. దాంతో….మహేష్గౌడ్ కార్పొరేషన్ ఎన్నికలను అంతా తానై చూసుకున్నారు. ఇల్లా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు అగ్ర నేతలు ఎవరికి వారే అనేలా వ్యవహరిస్తుండటంతో కేడర్ కూడా గందరగోళంలో పడుతోంది. ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందోనన్న భయం కూడా ఉందట కొందరిలో. విభేదాలు మాని ఇద్దరూ చేతులు కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు.
