నగర అధ్యక్ష పదవి అక్కడ కాంగ్రెస్ పార్టీలో రచ్చ పెడుతోందా? ఉన్న వర్గ పోరు చాలదన్నట్టు…. సిటీ ప్రెసిడెంట్ పోస్ట్ హస్తం శిబిరంలో హీట్ పెంచుతోందా? ఒక నగర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలోని పార్టీ హైకమాండ్దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంతలా సిగపట్లకు దారి తీస్తున్న ఆ నగర అధ్యక్ష పదవి ఏది? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? మహబూబ్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి హస్తం పార్టీలో కాక రేపుతోంది. పాలమూరు కాంగ్రెస్ శిబిరంలో కార్పొరేషన్ ఎన్నికల వేళ మొదలైన ముఖ్యనేతల మధ్య విభేదాలు పీక్స్కు చేరాయి. మహబూబ్నగర్ నియోజకవర్గ అధికార పార్టీలో డిసిసి ఆఫీస్ వర్సెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ వర్గాలుగా చీలిపోయింది కేడర్. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం విభేదాల స్థాయిని సూచిస్తోంది. తాజాగా నగర పార్టీ అధ్యక్ష పదవి తమ వారికే ఇప్పించుకునేందుకు రెండు వర్గాలు, గాంధీభవన్ దాటి ఏఐసీసీ లెవల్లో లాబీయింగ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన మహబూబ్ నగర్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, పట్టణ విస్తీర్ణం పెరగడం, నియోజకవర్గంలో సింహభాగం అర్బన్ ప్రాంతమే కావడంతో హస్తం పార్టీ సిటీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోటీ పెరుగుతోంది. ఈ పదవి కోసం ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పోటీలో ఉన్నట్టు తెలిసింది.
అయితే సిరాజ్, లేదంటే లక్ష్మణ్ అంటూ ఇద్దరి పేర్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రపోజ్ చేస్తుండగా… మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కోసం డీసీసీ శిబిరం డిల్లీ స్థాయిలో గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది . వీరికి సపోర్ట్ గా జిల్లాలోని ఓ ఎమ్మెల్యేతో పాటు , కొందరు ముఖ్య నేతలు మాట సాయం చేస్తున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ పట్టణంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉంటారు. డిసిసి పీఠంతో పాటు , మేయర్ , డిప్యూటి మేయర్ పదవులు ఆశించి ఆ సామాజిక వర్గం భంగపడిందని, అందుకే నగర అధ్యక్ష పదవి మైనార్టీకి కేటాయిస్తే బావుంటుందనే అభిప్రాయంతో సిరాజ్ ఖాద్రి పేరును ప్రతిపాదించారట ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇదే సమయంలో పట్టణంలో పట్టున్న నాయకుడిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్కు పేరుందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయడంతో పాటు .. మేయర్ ఎంపికలో ఆయనకు అన్యాయం జరిగిందని అందుకే ఛాన్స్ ఇవ్వాలన్నది డీసీసీ వాదన. మరో పక్క పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతోపాటు ముడా చైర్మన్ గా ఉన్న లక్ష్మణ్ యాదవ్ మరో మారు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక క్రమంలో కూడా… ఎమ్మెల్యే వర్సెస్ , డీసీసీ అధ్యక్షుడు అన్నట్లు పార్టీలో గ్రూప్వార్ నడిచింది. అధిష్టానానికి ఇరువర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్ టీం, డీసీసీ ఆఫీస్ టీంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు చీలినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక ముసలం పీక్స్కు చేరింది. ఎలాంటి వర్గాలు లేవు, మేమంతా అధిష్టాన వర్గమే అంటూ పైకి కబుర్లు చెబుతూనే…లోలోపల మాత్రం తమ వ్యక్తికి పదవి ఇప్పించుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. మా వాళ్ళకు పోస్ట్ ఇప్పించేందుకు మే ప్రయత్నించడం వర్గపోరు ఎలా అవుతుందని ఇక్కడి నాయకులు రివర్స్ క్వశ్చన్ వేయడం కొసమెరుపు.
