OTR : నరహరి కేసులో తెర వెనక కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు?

Narahari

Narahari

తవ్వేకొద్దీ దొరుకుతున్న నోట్ల కట్టలు… కదిలిస్తే వణుకుతున్న రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు….! హైదరాబాద్ ల్యాండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిది కేవలం అవినీతి కేసు కాదా…? లోతుల్లోకి వెళ్తే అంతకు మించిన చాలా పెద్ద నెట్‌వర్కే బయటపడుతోందా? రిటైర్డ్‌ ఉద్యోగులతో కలిసి చేస్తున్న వందల కోట్ల దందాలు వెలుగు చూస్తున్నాయా? నరహరి సెగ తమకు తగలకుండా సదరు రిటైర్డ్‌ ఉద్యోగులు డబ్బు మూటలతో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? అసలేం జరుగుతోంది? వెలుగు చూస్తున్న కొత్త కోణాలేంటి? హైదరాబాద్‌లో ల్యాండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు పెద్ద స్కామ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇంట్లో సోదాలు చేసి గుట్టలు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టలు బయటకు తీసిన ఏసీబీ అధికారులు… ముందు ఇది కేవలం ఒక అధికారి అవినీతి కథేనని అనుకున్నారు. కానీ, లోతుల్లోకి వెళ్ళేకొద్దీ కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయట. అసలు తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ… దీని వెనక ఇంతుందా అంటూ… ఏసీబీ ఆఫీసర్సే నోళ్ళు వెళ్ళబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నరహరి వెనక ఒక రిటైర్డ్ ఉద్యోగుల ముఠా, వందల కోట్ల రియలెస్టేట్‌ దందా ఉన్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ముఠా సభ్యులే ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కోట్ల మూటలతో కాంగ్రెస్‌ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న సమాచారం ఇంకా కలకలం రేపుతోంది. కానీ… సీన్ కట్ చేస్తే… ఆ భారీ ఆఫర్ మాంఛి టెంప్టింగ్‌గా ఉన్నా…. కేసు తీవ్రత చూసి మూటల్ని ముట్టుకోవడానికి అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారట. ఇక కేసు సంగతి చూస్తే….. ఈ అవినీతి సొమ్మంతా ఎక్కడికి పోయింది? ఏ ఏ అకౌంట్లలోకి మళ్ళింది? అని ఆరా తీస్తున్న ఏసీబీకి… రూట్ మ్యాప్ మొత్తం నారాయణగూడ రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు కనిపించిందట. నరహరి ఒక్కడే కాదు… గతంలో ల్యాండ్ సర్వే విభాగంలో చక్రం తిప్పి, ఇటీవల పదవీ విరమణ చేసిన కొంతమంది ఘనాపాటీలు కూడా ఈ దందాలో పార్టనర్స్ అని తెలుస్తోంది.

నరహరితో పాటు మొత్తం 10 మంది ఒక గ్యాంగ్‌గా ఏర్పడి, నారాయణగూడ ప్రాంతంలో ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న మరి కొందరు అధికారులు కూడా ఇందులో గుట్టుచప్పుడు కాకుండా పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే నరహరి ఇంట్లో ఏసీబీ బాంబ్ పేలిందో… అప్పటినుంచి ఈ 100 కోట్ల ప్రాజెక్టులో డబ్బులు పెట్టిన రిటైర్డ్, సర్వీస్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. పట్టుబడ్డ అధికారి డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో… ఏసీబీ నెక్స్ట్ ఎవరి తలుపు తడుతుందోనన్న టెన్షన్ పట్టుకుందంటున్నారు. “నరహరి వరకు కేసు ఎలాగైనా నడవనివ్వండి… కానీ, అది మా దాకా రాకుండా చూడండి బాబోయ్” అంటూ ఈ ఉద్యోగుల ముఠా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టినట్టు తెలిసింది. కేవలం మాటలతో కాకుండా… ఏకంగా నోట్ల మూటలనే ఆఫర్‌గా పెడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

×
×
Ad

 

“మాపై ఆరా తీయకుండా, మా రియల్ వ్యాపారం జోలికి రాకుండా చూస్తే… పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ముట్టజెబుతాం” అంటూ ప్రభుత్వంలో కాస్తో కూస్తో పట్టున్న కాంగ్రెస్ నేతల్ని సంప్రదిస్తున్నారట. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు వస్తే లీడర్లు ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆఫరేమో 15 కోట్లు… చాలా పెద్ద మొత్తమే. అలాగని కేసు చూస్తే ఏసీబీ స్కానర్‌లో ఉంది. అది కూడా చాలా పెద్ద వ్యవహారమే. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర సలపరంలో పడిపోయారట. లక్ష్మీదేవి తలుపు తడుతుంటే తీయకుండా ఉండలేక, అలాగని ఇందులో వేలు పెడితే ఎక్కడ చేతులే కాలిపోతాయోనన్న డౌట్స్‌తో అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నట్టు సమాచారం. అందుకే కొందరు కాంగ్రెస్‌ నేతలు ఈ వ్యవహారాన్ని టచ్ చేయడానికి కూడా భయపడుతూ… డీల్ కుదుర్చుకోలేక, వదులుకోలేక సగం సగం మాటలతో కాలక్షేపం చేస్తున్నారట. ఆఫర్ ఎంత పెద్దదైనా, ఏసీబీ స్పీడ్ చూస్తుంటే ఈ వంద కోట్ల రియల్ దందా వెనుక ఉన్న రిటైర్డ్ ముఠా వికెట్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ 15 కోట్ల ఆఫర్‌కు లొంగి ఏ కాంగ్రెస్ నేత అయినా రిస్క్ తీసుకుంటారా? లేక ఏసీబీ తన టార్గెట్‌ను రీచ్ అవుతుందా? అనేది చూడాలి.