ఓటుకు కోట్లు…. ఒక్క ఓటుకు ఏకంగా మూడు కోట్ల రూపాయల ఆఫర్. అలా మూడిటికి 9 కోట్లు. ఎస్ మీరు విన్నది నిజమే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చెప్పిన మొత్తమే కాదు, కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్కేసులు పట్టుకుని తిరుగుతున్నారట. ఎక్కడుందా పరిస్థితి? ఏ ఎన్నికలో అంత డిమాండ్ పెరిగింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. ఈ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు ఆసక్తి రేపుతున్నాయి. గొడవలు, దాడులకు కారణం అవుతున్నాయి. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడిందని అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్,ఆయన అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. సుమన్తోపాటు చెన్నూర్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నలుగురు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. కేవలం 22 వార్డులున్న మున్సిపాలిటీ క్యాతనపల్లి. ఇక్కడ సీపీఐ, బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయగా…. బీఆర్ఎస్కు 10, సీపీఐకి నాలుగు దక్కాయి. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా ఒకచోట ఇండిపెండెంట్ విజయకేతనం ఎగరేశారు. ఇక తమకు 14 సీట్లు ఉన్నాయన్న ధీమాతో ఛైర్మన్ బీఆర్ఎస్కు, వైస్ చైర్మన్ సీపీఐకి అని డిసైడ్ చేసేసుకున్నారు. తీరా చూస్తే…ఎన్నిక రచ్చ రచ్చ అవుతోంది. 7 సీట్లున్న కాంగ్రెస్ ఛైర్మన్ పదవి కోసం పావులు కదపడమే ఇందుకు కారణం అంటున్నారు పరిశీలకులు. ఎక్స్ అఫిషియోగా చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్, ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్కు అదనంగా రెండు ఓట్లు యాడ్ అయ్యాయి. ఇండిపెండెంట్ను తమ వైపు తిప్పుకున్నారు. అలా… మొత్తంగా కాగ్రెస్ బలం 10కి చేరింది.
కానీ… ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. బీఆర్ఎస్, సీపీఐ భాగస్వామ్యానికి ఆ బలం ఉన్నా, కాంగ్రెస్ చేస్తున్న గట్టి ప్రయత్నాలతో పీటముడి బిగుసుకుంటోంది. మంత్రి వివేక్ ఇలాకాలో చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటిలున్నాయి..ఇప్పటికే చెన్నూర్ కాంగ్రెస్ వశం కాగా క్యాతనపల్లి సైతం తమ ఖాతాలోనే వేసుకోవాలన్నది అధికార పార్టీ ప్లాన్. మంత్రిగా ఉండి మున్సిపాలిటిలో బీఆర్ఎస్ పీఠంపై కూర్చుంటే పరువుపోతుందనే భావనలో ఉన్నారట వివేక్. అందుకే ఎంత ఖర్చైనా ఫర్వాలేదు పీఠం హస్తగతం చేసుకోవాలని టీంలను రంగంలోకి దింపినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరాలంటే మరో ముగ్గురు అవసరం. దీంతో ఓటుకు రేటు విపరీతంగా పెరిగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఓటు కోసం మూడు కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. మూడు ఓట్లకు కలిపి 9 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా కాకుంటే…. రెండు కోట్లు, ఓ ఖరీదైన కారు,విల్లా సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్స్కు వల వేస్తున్నారట అధికార పార్టీ నాయకులు.
బీఆర్ఎస్ ,సీపీఐ కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంప్స్లో ఉండటం వల్ల నేరుగా కలిసి డీల్ కుదుర్చుకునే అవకాశం లేకపోవడంతో ,కుటుంబ సభ్యులు, బంధువు ఇళ్ళకు వెళ్ళి ఆఫర్స్ ఇచ్చేసి వస్తున్నారట.డీసీసీ అధ్యక్షుడి సొంత ఊరు సైతం క్యాతనపల్లే కావడంతో మంత్రితో పాటు ఆయన కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారట. అలాగే… కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఎంత ఖర్చయినా ఫర్లేదు మున్సిపల్ ఛైర్మన్ పీఠం మాత్రం నాకు కావాలి సార్ అంటూ మంత్రికే చెప్పినట్టు తెలిసింది. ఈ వాయిదాల పర్వం కూడా బేరసారాల కోసమేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఓటుకు కోట్ల ఆఫర్ తెలిసిన బాల్క సుమన్ అండ్ టీం క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్లు లాక్కోవడంతో పాటు బంధువులతో కూడా మాట్లాడనీయకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. తమవైపు వచ్చేవాళ్ళకు అడ్వాన్స్ రెండు, చెయ్యి లేపాక మరొకటి అంటూ ఎర వేస్తున్నారట అధికార పార్టీకి చెందిన కొందరు. మరో వైపు సీపీఐ అధిష్టానం మీద మంత్రి, కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.. ఇటీవల జరిగిన సమావేశంలో ఓనాయకుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టగా… మేం పొత్తులో పోటీ చేశాం…పీఠం దక్కించుకోవడం కోసం సయోధ్యతోనే ముందుకు వెళ్తామని చెప్పారట లోకల్ లీడర్స్. ఈ పరిస్థితుల్లో క్యాతన్పల్లి కోట్ల కథకు క్లైమాక్స్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
