ఆ ఉమ్మడి జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేపై మంత్రి ఫిర్యాదు చేయడంతో… హైకమాండ్ కూడా దృష్టి పెట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందట. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చేసిన కామెంట్స్… ప్రతిపక్షానికి ఆయుధం చేతికి అందించినట్టుగా తయారైందట. అయితే… ఆమె… వ్యూహాత్మకంగానే అలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆ మంత్రి వ్యూహం ఏంటి..? అమీ తుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారా..? తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఏదో ఒక విషయంలో ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. వివాదాలు సురేఖని వెంటాడుతున్నాయా..? లేదంటే ఆమే వివాదాల్లోకి వెళ్తున్నారా..? అర్థంకాని పరిస్థితి. తాజాగా కడియం శ్రీహరితో కయ్యం పెట్టుకున్నారామె. మొదట్నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో సఖ్యత లేదు. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకవర్గం. మిగతా నాయకులంతా ఇంకో వర్గం అనేలా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు నడిచేవి. ఆమధ్య అందరూ ఒక్కటై ఐక్యతా రాగం ఆలపించినా… అది ఎంతోకాలం నిలవలేదు. ఇప్పుడు కడియం శ్రీహరితో కయ్యానికి కాలు దువ్వుతున్నారు సురేఖ. ప్రస్తుతం కడియం శ్రీహరి ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కొండా సురేఖ ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కడియం భుజం మీద తుపాకీ పెట్టి వరంగల్ కాంగ్రెస్లో వర్గాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారా..? లేదంటే తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరిపై ఎన్ని ఆరోపణలు చేసినా… అది ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఘర్షణ అని భావించవచ్చు. కానీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ద్వారా ఇద్దరి మధ్య గొడవను కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టారనే మాట వినిపిస్తోంది.
ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆ నేపథ్యంలో కొండా సురేఖ కూడా ఇప్పుడు అదే డిమాండ్ చేయడం మూలంగా రాజీనామాల తేనె తుట్టెను మరోసారి కదిలించినట్టు అయ్యిందనే భావన కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. కడియం శ్రీహరి, కొండా సురేఖల మధ్య రాజకీయ వైరాన్ని మొత్తం పార్టీకి అంటించేలా మాట్లాడటాన్ని కాంగ్రెస్లోని సీనియర్ నేతలు కూడా వాటిని తప్పు పడుతున్నారట. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించాల్సి వచ్చింది. రాజీనామా డిమాండ్ కొండా సురేఖ వ్యక్తిగతమే తప్పితే పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే… కొండా సురేఖ ఒక్కరే కాదు… ఇతర మంత్రులు కూడా వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ప్రభుత్వం వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతు భరోసా పథకం కింద డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే… కేబినెట్లోని మంత్రులు రోజుకో తలనొప్పి తెచ్చిపెడుతున్నారనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోందట. ఈ మధ్య మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్తో చాలా రచ్చ జరిగింది. ఆ ఎపిసోడ్ మరువకముందే… కొండా సురేఖ, కడియం శ్రీహరిల గొడవ మొదలైంది. ఇలా కాంగ్రెస్లో వివాదాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అధినాయకత్వం ఇప్పటికైనా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు చెప్పడం మానేసి కఠినంగా వ్యవహరించడం మొదలుపెడితేనే… పార్టీకి, ప్రభుత్వానికి మంచిదని కొందరు నేతలు సలహాలు ఇస్తున్నారట.

