Site icon NTV Telugu

Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?

Kavitha

Kavitha

అనవసరంగా ఎక్కువ భయపడ్డాం…. చాలా ఊహించేసుకున్నాం…. అందుకే అవసరమైనదానికంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తపడ్డాం. కానీ… అంత సీన్‌ లేదని తేలిపోయింది. లైట్‌ తీస్కో బాసూ…. డోంట్‌వర్రీ. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సర్కిల్స్‌లో ఏ ఇద్దరు ముఖ్యులు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఇన్నాళ్ళు ఏ విషయంలో భయపడ్డారు వాళ్ళంతా? ఇప్పుడా భయం ఎందుకు పోయింది? ఎవర్ని లైట్‌ తీసుకోవాలనుకుంటున్నారు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన లోకల్‌ పోరులో ఎవరి బలమేంటో తేలిపోయింది. పైకి ఎవరెన్ని బింకాలు పలికినా….అంతర్గత విశ్లేషణల్లో మాత్రం వాస్తవాల గురించి మాట్లాడుకుంటూ జరిగిన లాభ నష్టాలు, ఇక మీదట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని పార్టీల్లో మాట్లాడుకుంటున్నారట. ఈ క్రమంలోనే… బీఆర్‌ఎస్‌లో ఒక ఇంట్రస్టింగ్‌ డిస్కషన్ నడుస్తోందట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వల్ల మనకు ఏదన్నా డ్యామేజ్‌ అయిందా? కారు గుర్తు మీద ఆమె ప్రభావం ఏమన్నా ఉందా అంటూ రకరకాల విశ్లేషణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాటి సారాంశమే భయపడాల్సిన పని లేదన్న కన్‌క్లూజన్‌ అంటున్నాయి పార్టీ వర్గాలు. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేశారు కొందరు కవిత అనుచరులు. ఎక్కడా వాళ్ళ ప్రభావం తమ మీద లేదన్న నిర్ధారణకు వచ్చారట బీఆర్ఎస్‌ పెద్దలు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక కవిత మాట తీరు, ఆమె దూకుడు చూసి… ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంతోకొంత ఉంటుందని, అక్కడక్కడా గెలుపు అవకాశాలు దెబ్బతింటాయేమోనని భయపడ్డారట బీఆర్‌ఎస్‌ లీడర్స్‌.

కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక పార్టీ గుర్తుతో జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో… సహజంగానే కంగారు పడ్డామని, అంత అవసరం లేదని ఫలితాలే చెప్పాయని మాట్లాడుకుంటున్నారు గులాబీ లీడర్స్‌. ఆమెవల్ల ఎన్నికల్లో తమకు ఎలాంటి లాస్‌ లేదన్నది వాళ్ళ అభిప్రాయం. పదేళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన కారు పార్టీ… గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. రెండేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తోంది. సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత, విపక్షానికి ఉండే పొలిటికల్‌ అడ్వాంటేజ్‌ అన్నీ కలిసి ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని అనుకుంటున్న టైంలో కవిత ఎపిసోడ్‌ పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. పార్టీ అధ్యక్షుడి కుమార్తె, మొన్నటిదాకా కీలకంగా వ్యవహరించిన నాయకురాలు కావడం, బయటికి వెళ్ళాక ఆమె బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే మాట్లాడ్డంవల్ల ఏం చేయాలో అర్ధంకాని డైలమాలో ఉండేవారట పార్టీ నేతలు. సొంత కుటుంబ సభ్యురాలు, గత ప్రభుత్వంలో అన్నిటినీ దగ్గరగా చూసిన వ్యక్తి చేసే ఆరోపణలు, విమర్శల్ని ప్రజలు నమ్మే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని కూడా ఒక దశలో ఆందోళన పడ్డారట గులాబీ పెద్దలు.ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినా అందులో కవిత ఎంటర్‌ అవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ… మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఎఫెక్ట్‌ పడుతుందని భయపడ్డా… ఆలాంటిదేం లేదని ఫలితాలే చెప్పాయంటూ రిలాక్స్‌డ్‌గా ఉన్నారట గులాబీ ముఖ్యులు.

కవిత వల్ల తమకు ఎక్కడా డ్యామేజ్ కాలేదన్న నిర్ణయానికి రావడంతో పాటు…ఆమె విషయంలో ఇప్పటివరకు తాము వ్యవహరించిన తీరు కరెక్ట్ అని కూడా భావిస్తున్నారట. ప్రభావం లేదని తేలిపోయింది కాబట్టి…. ఇక ఆమెను లైట్‌ తీసుకోవడమే బెటర్‌ అన్న చర్చలు జరుగుతున్నాయట పార్టీలో. బీఆర్ఎస్‌లో…. ముఖ్యంగా కేటీఆర్, హరీష్‌రావుని అంతకు ముందు టార్గెట్‌ చేసిన కవిత… మెల్లిగా తండ్రి కేసీఆర్‌ని కూడా ఆ పరిధిలోకి తీసుకు వస్తున్న టైంలో… ఆమె పొలిటికల్‌ స్టామినా ఏంటో ఈ ఫలితాలు చెప్పేశాయని, ఇక మీదట ఎంత రెచ్చగొడుతూ మాట్లాడినా… మనం మాత్రం స్పందించవద్దని అధిష్టానం నుంచి పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు అందాయట. ఈ ఇంటర్నల్ ఆదేశాల ప్రకారమే ఇక మీదట కిందిస్థాయి నేతలు కూడా నడుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే… ఈ సమయమనాలు, లైట్‌ తీసుకోవడాలు ఎన్నాళ్ళు? ఒకవేళ కవిత డోస్‌ పెంచి, ఆమెవల్ల డ్యామేజ్‌ మొదలయ్యాక కూడా ఇలాగే ఉంటారా లేక పునస్సమీక్షించుకుంటారా అన్నది కూడా ముఖ్యమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version