పార్టీలో పరపతి తగ్గిందని ఫీలవుతున్న ఆ ఎమ్మెల్యే డిఫరెంట్ గేమ్ ఆడబోయి మరింత చిక్కుల్లో పడుతున్నారా? దానికి తోడు వైసీపీ పుండు మీద కారం చల్లుతోందా? ఇంటా బయటా జరుగుతున్న పరిణామాలతో మంటెత్తిపోతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు…? గురువింద రాజకీయం మాముందు కాదు గురూ..!. అని ఫ్యాన్ పార్టీ ఎవరికి వార్నింగ్ ఇస్తోంది? నిజంగానే సుందరానికి తొందర ఎక్కువైందా….. అంటూ జనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సుందరపు విజయ్ కుమార్…జనసేన ఎమ్మెల్యే..!. కరణం ధర్మశ్రీ.,మాజీ శాసనసభ్యుడు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం పందెం కోళ్లను మించి ఫైటింగ్ చేసేసుకుంటున్నారు. తమ అధినేత పవన్ పై వైసిపి చేస్తున్న విమర్శలతో తోక తొక్కిన త్రాచులా విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. అటు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ కూడా…పిట్టకథలు, ప్రాసలతో ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేస్తున్నారు.
ఆ విధంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరి చిట్టాలు మరొకరు విప్పేసుకుని మరీ బహిరంగ వేదికలకు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ ఒక్క తన్ను తన్నితే చోడవరం నుంచి యలమంచిలిలో వచ్చి పడ్డావ్…నువ్వు కూడా మా అధినాయకుడిని విమర్శిస్తావా…? అంటూ ఎమ్మెల్యే సుందరపు సీరియస్ వ్యాఖ్యలు చేయడం కాక రేపింది. దానికి కౌంటర్గా ధర్మశ్రీ కూడా చెలరేగిపోవడమే కాదు, అక్రమ క్వారీలు, పంచదార్ల కొండ తవ్వకాలు, భూ కబ్జాలు అంటూ ఎమ్మేల్యేకి రేవు పెట్టేస్తున్నారు. పైగా నోటికి తాళం వేయకపోతే గుట్లన్నీ బయట పెడతానంటూ సిట్టింగ్కే వార్నింగ్ ఇవ్వడం సంచలనం అయింది. యలమంచిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కీలకమైనది కాగా… గవర, మత్స్యకార, ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. తొలి నుంచిు టీడీపీకి పట్టుండగా… 2024లో కూటమి తరపున జనసేన టికెట్పై సుందరపు విజయ్ కుమార్ గెలిచారు. ఎక్కువకాలం టీడీపీలోనూ… ఆవిర్భావం నుంచి జనసేనలోనూ ఉన్నారాయన. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వివిధ సమస్యలపై చేసిన రాజకీయ పోరాటం గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐతే, అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో యలమంచిలి ఎమ్మెల్యే చుట్టూ జరిగినంత బహిరంగ చర్చ మరొకరి మీద లేదు. ఆ స్థాయిలో అల్లరయ్యారని పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి. ఆయన మీద అటు, టీడీపీ…ఇటు జనసేన అధినాయకత్వాలకు ఎప్పటికప్పుడు ఏదో రూపంలో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయట.
పంచదార్ల పుణ్యక్షేత్రంలోని ఫణిగిరి మీద గ్రావెల్ తవ్వకాలు, వాటి వెనుక రాజకీయ ప్రమేయానికి సంబంధించి ఎక్కువగా కంప్లయింట్స్ వచ్చాయి. అలాగే… కొద్ది నెలల క్రితం అచ్యుతాపురం మండలం దుప్పితూరు దగ్గర కోట్లాది రూపాయల విలువైన భూముల విషయంలో వివాదం నెలకొనడం, బాధితులు నేరుగా డిప్యూటీ సీఎంను ఆశ్రయించడం స్థానికంగా కలకలం రేపింది. బాధ్యులపై చర్యలకు పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా ఇరుకునపెట్టింది. ఇక అప్పటి నుంచి అధినాయకత్వంతో సుందరపు విజయ్ కుమార్ సంబంధాలు బలహీనపడ్డాయనే చర్చ జరుగుతూ వచ్చింది. ఇక పార్టీ లైన్ గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు, డిప్యూటీ సీఎంపై వైసీపీ మాజీ మంత్రుల విమర్శలకు దీటుగా స్పందిస్తున్నారు ఎమ్మెల్యే. దీంతో అంతా సర్దుకున్నట్టేనని ఫీలయ్యారు కూటమి నాయకులు. ఈ క్రమంలో జనసేన అధినాయకత్వం ఎమ్మెల్యేకి ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25 లోక్సభ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీలను నియమించారు అధినేత పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో వివాదాస్పదులని ముద్రపడ్డవాళ్ళని పక్కన పెట్టేశారు పవన్. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి నలుగురు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంది. వీళ్లలో కొణతాల రామకృష్ణకు విశాఖ, పంచకర్ల రమేష్ బాబుకి కోనసీమ, వంశీకృష్ణ యాదవ్కు శ్రీకాకుళం ఏరియాలను అప్పగించారు. ఇక మిగిలిన విజయ్ కుమార్కు అవకాశం రాకపోవడంపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, వివాదాస్పద వ్యవహారాల కారణంగానే పార్టీ పెద్దలు ఎమ్మెల్యే విజయ్కుమార్ని పక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్ష నేతల మీద వాయిస్ రెయిజ్ చేయడానికి, ఈ పక్కన పెట్టడానికి కూడా లింక్ ఉందన్నది చాలా మంది అభిప్రాయం. అధిష్టానం తనను సైడ్ చేస్తోందని గ్రహించిన సుందరపు… దాన్ని కవర్ చేసుకునేందుకే నియోజకవర్గ వైసీపీ ముఖ్యనాయకత్వాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా అన్నది కొందరి అనుమానం. అలాగే… ప్రతిపక్షం కూడా ఎమ్మెల్యేను న్యూట్రల్ చేయాలని చాలా కాలంగా చూస్తోంది. కరణం ధర్మశ్రీ వంటి సీనియర్ని ఇక్కడికి పంపడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటున్నారు. ఆ క్రమంలో… నువ్వు ఒకటంటే నేను పది అంటానన్నట్టు వ్యవహారం మారిపోవడంలో ఎమ్మెల్యే మరింత రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.

