ఒక ఎమ్మెల్యేకి గవర్నమెంట్ ఆఫీసర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించే అధికారం లేదా? ఉంటే… ఆ శాసనసభ్యుడి తీరు ఎందుకు వివాదాస్పదమైంది? కింది స్థాయి అధికారుల మీద ఏకంగా జాయింట్ కలెక్టర్కి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఇక్కడ నావల్ల కాదు బాబోయ్….. అంటూ ఉన్నతాధికారులు వరుసబెట్టి సెలవు మీద ఎందుకు వెళ్లిపోతున్నారు? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రోటోకాల్ రగడ ముదిరి రచ్చ రంబోలా అవుతోందట. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి మధ్య వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నట్టు చెబుతున్నారు. ఛైర్పర్సన్కు సమాచారం లేకుండా.. ఎమ్మెల్యే రమణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం వివాదంగా మారింది. అది మెల్లిగా పెరుగుతూ…రాజకీయ రచ్చకు దారితీస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తాజాగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మీటింగ్కు మున్సిపల్ కమిషనర్తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఆ విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన ఛైర్ పర్సన్ ఉమారాణి… కౌన్సిల్ తీర్మానం లేకుండా, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా… ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమావేశానికి ఎలా హాజరవుతారంటూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అక్కడితో ఆగకుండా వివరణ అడగడంతోపాటు…. జాయింట్ కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ పరిణామాలతో మనస్తాపం చెందిన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పర్వతాలు ఆకస్మిక సెలవు పెట్టి వెళ్లిపోయారట. ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. పర్వతాలు కంటే ముందు కమిషనర్గా పనిచేసిన రాజేందర్ రెడ్డిని సైతం కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానంతో ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఇలా 100 రోజుల వ్యవధిలో ఇద్దరు అధికారులకు పొమ్మనకుండా పొగబెట్టినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దీని గురించే తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ ఉమారాణి, వైస్ ఛైర్ పర్సన్గా బీఆర్ఎస్కు చెందిన కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. కానీ… 16 మంది కౌన్సిలర్లు ఉన్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మిగిలిపోయింది. కౌన్సిలర్స్ సంఖ్యతో పాటు ఎమ్మెల్యేగా తమ నేతే ఉండటంతో…. మున్సిపాలిటీపై పట్టు కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వేదికగా.. పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులతో రివ్యూ చేశారట. కానీ… చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కు కనీస సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడాన్ని తప్పు బడుతున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. అయితే… 6 ఎకరాల వెంచర్ అనుమతుల కోసమే.. ఎమ్మెల్యే రూల్స్కు విరుద్ధంగా క్యాంప్ కార్యాలయంలో సమీక్ష పెట్టారంటూ విమర్శిస్తున్నారు ప్రత్యర్థులు. మరో మూడు వెంచర్ల అనుమతి కోసం ఫైల్స్ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేసుకునేందుకే క్యాంప్ ఆఫీస్లో సమీక్షలు జరుగుతున్నాయంటున్నారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు మాత్రం మౌనం దాల్చారు. వెంచర్కు పొరపాటుగా అనుమతులు ఇచ్చామని చెప్పిమరీ…. కమిషనర్ సెలవులో వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే…కామారెడ్డిలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉమారాణి భర్త షాడో ఛైర్మన్గా వ్యవహరిస్తూ.. కౌన్సిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్నే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ తప్పుబడుతున్నాయి. అటు వెంచర్ల అనుమతుల కోసం ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ , బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
