ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్ ఏదంటే అందరికీ తుంగతుర్తి నియోజకవర్గ పంచాయితీనే గుర్తుకొస్తోంది. అది ఒక్క నియోజకవర్గమే కానీ… సమస్యలు మాత్రం సవాలక్ష ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించే బాధ్యత సీనియర్ నేత జగ్గారెడ్డికి అప్పగించింది కాంగ్రెస్. ఏరికోరి జగ్గారెడ్డినే బరిలోకి దింపడానికి కారణమేంటి..? తుంగతుర్తి తలనొప్పిని తగ్గించడానికి జగ్గాబామ్ పనిచేస్తుందా..? లెట్స్ వాచ్. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయితీ తెలంగాణ కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఐదు గ్రూపులున్నాయి. ఆ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ వివాదాస్పదమే. కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గంలో గ్రూపులు, ఆధిపత్య పోరు లాంటి సమస్యలు కేడర్ను డిస్టర్బ్ చేస్తున్నాయట. గల్లీలో రాళ్ళు విసురుకోవడం నుంచి… గాంధీ భవన్లో ధర్నా చేసే వరకు వచ్చింది వ్యవహారం. తుంగతుర్తిలో గొడవలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్గానే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిపై ఇంటలిజెన్స్తో నివేదిక తెప్పించుకున్నారట ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే మందుల సామ్యూల్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి… ఆఖరి నిమిషంలో బీఫామ్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు కానీ… గ్రూపులను సమన్వయం చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంతో రోజుకో సమస్యతో పార్టీ సతమతం అవుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అధిపత్యం ఎక్కువగా ఉండేది. అదే నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం కూడా ఉంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ కేడర్ కూడా ఉంటుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గానికే చెందినవారు. ఇలా పార్టీలో అగ్రనేతలుగా చెలామణి అవుతున్న నేతలందరికీ తుంగతుర్తిలో అనుచరగణం ఉండటంతో నియోజకవర్గ రాజకీయం సంక్లిష్టంగా మారింది.
దీనికి తోడు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కాకుండా… బీఆర్ఎస్ నుంచి వచ్చినవారినే ఎమ్మెల్యే సామ్యూల్ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలోనే కాంగ్రెస్ కేడర్ అసహనానికి గురవుతోందట. అందుకే గొడవలు తీవ్రమయ్యాయనేది స్థానిక నేతల మాట. పార్టీకి మంచి బలం ఉన్న నియోజకవర్గంలో ఇలా జరగడం మంచిదికాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది. అందుకే తుంగతుర్తి తలనొప్పికి జగ్గా జండూబామ్ రాస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీనియర్ నేత జగ్గారెడ్డిని తుంగతుర్తికి పరిశీలకుడిగా పంపారు పీసీసీ చీఫ్. క్షణం ఆలస్యం లేకుండా జగ్గారెడ్డి పని కూడా మొదలుపెట్టేశారట. గాంధీ భవన్కు రండి అంటూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా స్థానిక నేతల అందరికీ కబురు పెట్టారట. అయితే, జగ్గారెడ్డిని తుంగతుర్తి పరిశీలకుడిగా పంపించడం వెనక పీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే మాట కాంగ్రెస్లో వినబడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నాయకులందరితోనూ జగ్గారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో జగ్గారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. రాంరెడ్డి దామోదర రెడ్డి వర్గం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మూడు గ్రూపులను జగ్గారెడ్డి హ్యాండిల్ చేయగలుగుతారనే భావించారట పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇక ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి ఈ పంచాయితీతో నేరుగా సంబంధం ఉన్నా.. లేకపోయినా… కార్యకర్తలకు బెనిఫిట్ జరగాలి అనేది ఆయన మాటగా ఉందట. అందుకే… తుంగతుర్తి పంచాయితీకి… జగ్గారెడ్డిని జండూబామ్లా ఉపయోగిస్తున్నారనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీల ఇష్యూలో కూడా అందరిని కూర్చోబెట్టి… గందరగోళం లేకుండా సెట్ చేశారు జగ్గారెడ్డి. తుంగతుర్తి లాంటి జటిలమైన సమస్యను జగ్గారెడ్డి సమర్థవంతంగా పరిష్కరించగలరనే నమ్మకంతోనే ఆయనకు అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ.

