OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?

Janas

Janas

ఆంధ్రప్రదేశ్‌ మంత్రికి ఆ నియోజకవర్గంలో నో ఎంట్రీనా…? ఒకవేళ వెళితే ఎందుకొచ్చావన్నట్టు లోకల్‌ ఎమ్మెల్యే చూస్తారా? అందుకు తగ్గట్టే మంత్రి సైతం ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తన డిపార్ట్‌మెంట్‌ పనుల్ని చక్కబెట్టేస్తున్నారా? ఇద్దరి మధ్య పిలుపుల పంచాయితీ సైతం నడుస్తోందా? ఎవరా ఇద్దరు నేతలు? ఇద్దరి మధ్య ఎందుకంత వైరం? రాజమండ్రి రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. కూటమి నేతలు బయటికి బాగానే కనిపిస్తున్నా, లోపల మాత్రం ఆధిపత్య యుద్ధం జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు చాలామంది. జనసేన మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే మధ్య పోరు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయట. ఇటీవల రాజమండ్రిలో జరుగుతున్న ప్రభుత్వ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి, ఎమ్మెల్యే ఒకరినొకరు ఆహ్వానించుకోవడం లేదని చెబుతున్నారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉండకపోవడం, ఎమ్మెల్యే నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో మంత్రి పేరు కనిపించకపోవడం రొటీన్‌గా మారిందని అంటున్నారు. రాజమండ్రి సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల సంగతి లోకల్‌ ఎమ్మెల్యేకి తెలియడం లేదట. ఆ విషయంలో మంత్రి ఒంటెత్తు పోకడలకు పోతున్నారన్నది ఆదిరెడ్డి వర్గం అభియోగం. మరోవైపు స్థానికంగా మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొనకపోవడం కూడా చర్చనీయాంశం అయింది.

ఎమ్మెల్యే, మంత్రి ఇద్దరూ అధికార కూటమిలో భాగస్వాములే అయినా… ఒకరి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మరొకర్ని ఆహ్వానించకపోవడంతో గ్యాప్‌తో పాటు కూటమిలో సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు కార్యకర్తలు. మీరు పిలవనప్పుడు మేం ఎందుకు పిలవాలన్నది ఇరు పక్షాల ప్రశ్న. అయితే కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి తప్ప మిగతా స్థానిక జనసేన నాయకులకు మాత్రం ఆహ్వానాలు అందుతున్నాయి. ఆ రకంగా తమ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వెంట వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం మంత్రి దుర్గేష్‌కు అస్సలు నచ్చడం లేదట. నగరంలో ఇటీవల ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ఎవరి ప్రోగ్రామ్‌లో వాళ్ళ ఫోటోలు ఉండటం, మిత్రపక్షం నేతలవి కనిపించకపోవడం గురించి కూడా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. మంత్రి దుర్గేష్ స్థానిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫోటో వేయడం లేదట. అలాగే ఎమ్మెల్యే కార్యక్రమాల్లో మంత్రి ఫోటోను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.

×
×
Ad

టీడీపీ శ్రేణులు మాత్రం “స్థానిక కార్యక్రమాల్లో ఇక్కడి ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వడం సహజం” అంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ఈ వివాదానికి పర్యాటక ప్రాజెక్టులే కేంద్రంగా మారాయని చెబుతున్నారు. రాజమండ్రిలో రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, అఖండ గోదావరి ప్రాజెక్టు పనులన్నీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వీటి విషయంలో ఎమ్మెల్యే వాసు అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.”నా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు నాకు చెప్పారా అన్నది ఆయన ప్రశ్న. మరోవైపు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటనకు స్థానిక ఎమ్మెల్యేను పిలవలేదట. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే మంత్రిపై గుర్రుగా ఉన్నారట. స్తానిక శాసనసభ్యుడికి తెలియకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని టిడిపి శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. అందుకే మంత్రి దుర్గేష్ పెత్తనానికి చెక్‌ పెట్టాలన్నది వాళ్ళ వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో… ఇటీవల మంత్రి దుర్గేష్ రాజమండ్రి సిటీ జనసేన నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు తెలిసింది.

నాకు ఆహ్వానం లేని కార్యక్రమాలకు మీరు ఎందుకు వెళ్తున్నారంటూ ఆ మీటింగ్‌లో మంత్రి తన పార్టీ నాయకుల్ని నిలదీసినట్టు తెలిసింది. ఒకరకంగా టిడిపి ఎమ్మెల్యే కార్యక్రమాలకు జనసేన నేతలను వెళ్ళవద్దని హెచ్చరించినట్టేనన్నది ఆ మీటింగ్‌లో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయం. గోదావరి మహా పుష్కరాలు జరగబోతున్నటైంలో రాజమండ్రిలో కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. అన్ని ప్రాజెక్ట్‌లు సమన్వయంతో పూర్తయి, పుష్కరాల ఏర్పాట్లు అద్భుతంగా జరగాల్సిన టైంలో… ఇలాంటి విభేదాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయని అంటున్నారు. ఇదే సమయంలో రాజమండ్రి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ సమీకృతమవుతుండగా, మంత్రి దుర్గేష్‌ ఒంటరి అవుతున్నారన్న వాదన బలపడుతోంది. ఇరు పార్టీల అధిష్ఠానాలు జోక్యం చేసుకుంటే తప్ప… ఈ విభేదాలకు తెరపడే అవకాశం లేదని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.