OTR : ధన్పాల్ vs బిగాల.. నిజామాబాద్ రాజకీయాలు హీట్ ఎక్కాయి

Niza

Niza

అక్కడ ఎండిపోయిన చెట్లు రాజకీయ మంటలు రేపుతున్నాయా? చెట్టే కదా అని చూస్తూ ఊరుకోబోమంటూ… పొలిటికల్‌ ప్రత్యర్థులు సవాళ్ళు విసురుకుంటున్నారా? ఎండిన చెట్లకు నీళ్ళు పోస్తున్న రాజకీయం ఎక్కడ జరుగుతోంది? గుప్తా వర్సెస్‌ గుప్తా అంటూ ఏ నియోజకవర్గంలోని పొలిటికల్‌ సిచ్యుయేషన్‌ గురించి మాట్లాడుకుంటున్నారు? ఎండిపోయిన చెట్లకు, రాజకీయాలకు ఏంటి సంబంధం? నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మధ్య రాజకీయ వైరం పీక్స్‌కు చేరిందట. ఇద్దరి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ శాసనసభ్యుడు ధన్‌పాల్‌కు మాస్ లీడర్‌గా ప్రజల్లో గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా, నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటారని కూడా చెప్పుకుంటారు. ఇటు మాజీ ఎమ్మెల్యే బిగాలను మిస్టర్ డెవలప్‌మెంట్ అని పిలుస్తుంటారు స్థానికంగా. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బిగాల గణేష్‌ గుప్తా… అర్బన్‌ అభివృద్ధికి బాగానే పని చేసినట్టు చెప్పుకుంటారు. అలా… ఇద్దరిలో ఎవరి క్రేజ్‌ వారికి ఉన్నా…. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం అయినా….చెరో పార్టీలో ఉండటం వల్ల ఏళ్ళుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. గతంలో బిగాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష నేతగా ఉన్న ధన్‌పాల్ తీవ్ర స్దాయిలో విమర్శలు చేసేవారు. అభివృద్ది పనుల్లో జాప్యంపై సమయం దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేల్చేవారు. అలా.. ఇద్దరు ఉప్పు-నిప్పులా మారారు. కానీ… తర్వాత ఓడలు బండ్లు- బండ్లు ఓడలు అయ్యాయి.

నిమాజామాద్‌ అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ధన్‌పాల్‌ ఎమ్మెల్యే అవగా… బిగాల మాజీగా మిగిలిపోయారు. తన హయాంలో మొదలుపెట్టిన అభివృద్ది పనులను ప్రస్తుత ఎమ్మెల్యే ధన్‌పాల్‌ కావాలనే నిర్వీర్యం చేస్తున్నారంటూ అవకాశం దొరికినప్పుడల్లా.. విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. అందుకు సిట్టింగ్‌ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఐతే ఇప్పుడు ఆ విమర్శల పరంపర పీక్స్‌కు చేరుకుంది. మున్సిపాలిటీలో ఎండిన మొక్కల సాక్షిగా పొలిటికల్‌ ప్రకంపనలు రేగుతున్నాయి. అసలే దశాబ్దకాలంగా సాగుతున్న వైరానికి ఇప్పుడీ ఎండు మొక్కల కారణంగా మంట గట్టిగానే అంటుకుంది. నిజామాబాద్‌లో డివైడర్స్‌ మధ్య తన హయాంలో నాటిన మొక్కలు ఇటీవల ఎండిపోవడం చూసి చలించిపోయారట మాజీ ఎమ్మెల్యే బిగాల. ఆ ఎండిన చెట్లకే బిందెలతో స్వయంగా నీళ్లు పోసి నిరసన తెలిపారాయన. ఇటు మినీ ట్యాంక్‌బండ్‌కు నెల రోజులుగా తాళం వేసి ఉండటాన్ని చూసి స్వయంగా పరిశీలించారాయన. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఎక్స్‌ ఎమ్మెల్యే. ఉద్దేశ్యపూర్వకంగానే తన హయంలో చేసిన అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శించారు బిగాల. ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా రాజీనామా కోసం డిమాండ్‌ చేశారు. అందుకు ధన్‌పాల్‌ కూడా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు.

×
×
Ad

గణేష్‌ గుప్తా హయాంలో అభివృద్ధి కంటే ఎక్కువగా అవినీతి జరిగిందని ఆరోపించారాయన. అవినీతిపై మున్సిపల్‌ ఆఫీస్‌ ముందున్న వినాయకుడి గుడి దగ్గర బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. డేట్‌, టైం నువ్వే ఫిక్స్ చేయమంటూ గణేష్ గుప్తాకు సవాలు విసిరారాయన. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ప్రధాన పార్టీల్లో కీలకంగా ఉంటూ సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం చర్చకు దారితీసింది. ఇద్దరు నేతల పోరు రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూస్తున్నవాళ్ళంతా… మొక్కే కదా అని పీకేస్తే… పీక కోస్తా అన్న చిరంజీవి డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు. పొలిటికల్‌ హీట్‌ పెంచడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, చివరికి ఎండిన చెట్లు అయినా చాలని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… తగ్గేదేలే అంటూ ధన్‌పాల్, బిగాల బహిరంగ చర్చకు సిద్దమైతే…. ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయ యుద్ధానికి కేవలం ఎండిన చెట్లే కారణమా.. లేక ఆ వంకపెట్టి వేరే కసి మొత్తం తీర్చుకుంటున్నారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి నిజామాబాద్‌లో.