తెలంగాణ మంత్రుకు ఏమైంది? వాళ్ళు మరీ…. అంత బిజీ అయిపోయారా? కనీసం మూడు నెలలకోసారి కూడా… అదీ రోజులో ఒక గంటన్నర సమయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించలేకపోతున్నారా? అది తీరిక లేకనా..? కేడర్ సమస్యల్ని వినే ఓపిక లేకనా…? అలాంటప్పుడు పార్టీ ఆఫీస్లో ప్రోగ్రాం మొదలు పెట్టడం ఎందుకు..? మధ్యలో ఆపడం ఎందుకు..! అసలా కార్యక్రమం ఏంటి? మినిస్టర్స్ వైఖరి గురించి పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాస్త డిఫరెంట్గా ఆలోచించారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ప్రజావాణి పేరుతో మంచి ఆలోచనే చేశారు. దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే… ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేలని అనుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కింది స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ ఆలోచన కూడా మంచిదేనన్న ప్రశంసలు అప్పట్లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు వచ్చి కూడా నేరుగా సమస్యలను చెప్పుకుని వినతి పత్రాలు ఇచ్చేవారు. మొదట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ప్రజలు కూడా చెప్పిన సమస్యకు వెంటనే మంత్రులు స్పందించి అక్కడికక్కడే అధికారులకు ఫోన్లు చేయడం, తర్వాత గాంధీభవన్ నుంచి ఫిర్యాదుల మానిటరింగ్ చేయడం లాంటివి కొనసాగాయి. దీంతో ముఖాముఖి ప్రారంభించిన రెండు మూడు వారాల్లోనే గాంధీభవన్ కి వచ్చేవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. బారికేడ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కారణం తెలియదుగానీ… ప్రస్తుతం గాంధీభవన్ ముఖాముఖి ఆగింది. కనీసం ఆగిందన్న సంగతి ప్రజలకు తెలియజేస్తే బాగుండేది. అధికారికంగా ఆ విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సమస్యలు చెప్పుకోవడానికి కొన్నాళ్ళపాటు సాధారణ ప్రజలు గాంధీభవన్కు వచ్చారు. ముఖాముఖి లేదని తెలుసుకుని ఉసురుమంటూ వెళ్లిపోయారు. అద్భుతమైన స్పందన వచ్చిన, పార్టీకి కూడా మైలేజ్ తీసుకుని వచ్చే అంత మంచి ప్రోగ్రామ్ని అర్ధంతరంగా, కనీస సమాచారం లేకుండా ఎందుకు ఆపేశారో ఎవ్వరికీ తెలియదు. మరోవైపు…మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డీసీసీ కార్యాలయానికి వెళ్లాలని నిబంధన పెట్టింది పార్టీ. కానీ… గాంధీభవన్కు కచ్చితంగా వచ్చి తీరాలన్న రూల్ ఎందుకు పెట్టలేదన్నది పార్టీ వర్గాల ప్రశ్న. ఇక్కడ కూడా అదే రూల్ పెడితే బాగుండేది కదా..? పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు సెక్రటేరియట్కు వెళ్లి చెప్పుకోలేని సమస్యల్ని పార్టీ ఆఫీస్లో చెప్పుకోగలుగుతారు కదా అంటూ స్వరం గట్టిగానే వినిపిస్తోంది. చాలా రోజులుగా మంత్రులు గాంధీభవన్కి రావడం మానేశారు. దీంతో… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించినా.. మంత్రులు సహకరించడం లేదా..? వాళ్ళకు అస్సలు సమయమే దొరకడం లేదా..? అనే చర్చ కూడా మొదలైంది.
పార్టీ ఆఫీస్ కోసం గంటన్నర సమయం ఇవ్వడానికి మంత్రులు ఇబ్బంది పడితే… ఇక కార్యకర్తలు, నాయకులకు ఏం సాయం చేస్తారనేది అసలు ప్రశ్న. మంత్రులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అన్ని సమస్యలు తెలుస్తాయి, పరిష్కారాలు కనిపిస్తాయి. కానీ గాంధీభవన్లో ముఖాముఖి కోసం రావడానికి వాళ్లు ఎందుకు ఆలోచిస్తున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. మినిస్టర్స్ నిజంగానే వారంలో ఒకరోజు… అప్పుడు కూడా గంటన్నర సమయాన్ని గాంధీభవన్ కోసం కేటాయించలేకపోతున్నారా..? అంటూ నిట్టూరుస్తున్నారు పార్టీ నాయకులు. ఉన్న 16 మంది మంత్రుల్లో వారానికి ఒకరి చొప్పున గాంధీభవన్ కి వచ్చినా… నలుగురితో నెల గడిచిపోతుంది. ఒకసారి వచ్చిన మంత్రి టర్న్ మళ్ళీ రావాలంటే… కనీసం మూడు నెలలు పడుతుంది. ఈ లెక్కన మూడు నెలలకు ఒక రోజు, అదీకూడా కొద్ది సమయాన్ని గాంధీభవన్ కోసం కేటాయించడానికి మంత్రులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మంచి ఉద్దేశ్యంతో ముఖాముఖి ప్రారంభించిన మాట వాస్తవం. మరి కంటిన్యూ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? మంత్రులు పార్టీ కేడర్కు ముఖం చాటేస్తున్నారా..? లేక వాళ్ళ సమస్యల్ని వినే ఓపిక వీళ్ళకు లేదా..అన్న ప్రశ్నలకు అట్నుంచే సమాధానం రావాలి.
