OTR : కాంగ్రెస్‌లో రెన్యూవల్ టెన్షన్..! 37 కార్పొరేషన్ చైర్మన్ల భవిష్యత్ ఏంటి?

Congress

Congress

ఒక్కొక్కటి రెన్యువల్ అవుతున్నాయి..! మరి మా సంగతి ఏంటి..? వాళ్ళకే అవుతాయా మాక్కూడా రెన్యువల్ చేయండి ప్లీజ్..అంటూ నేతల ముందు అప్పీల్ చేస్తున్నారు. ఇంతకి అయ్యేది ఎందరికి…హ్యాండ్ ఇచ్చేది ఎవరికి..!? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. 2023 ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వాళ్లు కొందరు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఇంకొందరు ఆ లిస్ట్‌లో ఉన్నారు. వాళ్ళ పదవీకాలం జులైతో ముగుస్తుంది. అదే సమయంలో కొత్తగా పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జూన్ వచ్చేసింది…ఇక జులై వచ్చేస్తుంది…అంటూ రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే తేడా కొడుతోందట. పదవుల కోసం కొత్తగా ఎదురుచూస్తున్న వాళ్ళు ఎంత ఆశతో ఉన్నారో… ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్న నాయకులు కూడా అంతే ఆశతో రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు 37 మంది కార్పొరేషన్ చైర్మన్స్‌ పని తీరుపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలా మంది పని తీరు మెరుగు పరుచుకోలేదన్న అభిప్రాయం ఉంది. పైగా వాళ్ళు ఎవరూ పార్టీ కోసం సరిగా సమయం ఇవ్వడం లేదన్న నివేదికలు సైతం సీఎం దగ్గర ఉన్నాయట.

ఆ లెక్కన చూస్తే… రెన్యువల్‌ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనే భావన కూడా ఉంది. ఐతే ఇటీవల T sat, స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ ఛైర్మన్‌ పదవుల్ని రెన్యువల్ చేసింది ప్రభుత్వం. దీంతో… మిగతా వాళ్ళలో కొందరు …మా పదవులు మాత్రం ఎందుకు రెన్యువల్ కావన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరైతే… టెన్షన్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏ లెక్కన చూసుకున్నా… ఇప్పుడున్న 37మందిలో మెజార్టీ నాయకులకైతే రెన్యువల్‌ ఉండకపోవచ్చనే తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డిని tgiic చైర్మన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. అలాగే….స్పోర్ట్స్ అథారిటీ,ఎస్సీ కార్పొరేషన్‌, ఫిషరీస్ చైర్మన్‌ లాంటి కొన్ని పదవులకు మాత్రం రెన్యువల్స్‌ ఉండవచ్చన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వాళ్ళలో 16 మందికి ఇంటెలిజెన్స్ అధికారుల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని, సదరు ఛైర్మన్స్‌ రెజుమేస్‌ను తిరిగి అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. రేవంత్ సీఎం అయినప్పటి నుండి.. పదవులు ఇచ్చే ప్రతిఒక్కరి విషయంలో పోలీసు విచారణ చేయిస్తున్నారు. ప్రస్తుతం రెన్యువల్‌కు కూడా అదే పంథా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కొందరు కార్పొరేషన్ చైర్మన్ ల మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో ఫ్రెష్ గా నివేదిక కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెన్యువల్ కి సమయం దగ్గర పడుతుండటంతో చాలా మందిలో ఐతే టెన్షన్ మొదలైందని అంటున్నారు. మళ్ళీ ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ.. నేతల వద్దకు క్యూ కడుతున్నారు. వీరికి తోడు.. కొత్తగా పదవులు ఆశిస్తున్న వారు కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు.

×
×
Ad