దేశమంతా ఎలా ఉందో, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గంలో మాత్రం SIRను అమలు చేసి తీరాల్సిందేనని ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటున్నారా? బోగస్ ఓట్ల కారణంగానే దశాబ్దాలుగా తాను ఓడిపోతున్నట్టు ఆయన ఫీలవుతున్నారా? SIR పేరుతో ఒక్కసారి ఊడ్చిపడేస్తేగానీ… మేటర్ తేలదని అంటున్న ఆ కాంగ్రెస్ నేత ఎవరు? బీజేపీకి మేలు జరుగుతోందని కాంగ్రెస్ పెద్దలు మొత్తుకుంటున్నా ఆయన మాత్రం ఎందుకు కావాలని అంటున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… SIR. ఈ పేరు వింటేనే భగ్గుమంటోంది కాంగ్రెస్ పార్టీ. సర్ పేరుతో ఎక్కడ ఓటర్స్ లిస్ట్ తనిఖీ జరిగినా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న కార్యక్రమం అని, SIRతోనే కాషాయ పార్టీ అనేక రాష్ట్రాల్లో గెలుస్తోందని కూడా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో తెలంగాణలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతోంది. ఇక్కడ రాష్ట్రం మొత్తం సంగతి ఎలా ఉన్నా… నా నియోజకవర్గం నాంపల్లిలో మాత్రం ఏరివేత కార్యక్రమం జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారట నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ఖాన్. అసలు SIRను పెట్టక ముందు నుంచే నాంపల్లిలో బోగస్ ఓట్లపై పోరాడుతున్నారాయన. ఇంకా చెప్పాలంటే… దాని మీద పెద్ద యుద్దమే చేస్తున్నారు.
నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఓటర్ల వివరాలు…నకిలీ ఓట్లకు సంబంధించిన డిటెయిల్స్తో గతంలోనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలో నకిలీ ఓట్లకు సంబంధించి చివరికి హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు ఫిరోజ్ఖాన్. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ వచ్చారు. నాంపల్లి నియోజకవర్గంలో తనని ఓడించడానికి ఎంఐఎం తప్పుడు ఓటర్లను నమోదు చేయించిందని, ఇక్కడ ఆ పార్టీ వరుస గెలుపులకు అదే ప్రధాన కారణం అన్నది ఫిరోజ్ఖాన్ ఆరోపణ. నియోజకవర్గంలో నకిలీ ఓటర్లకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారాయన. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ SIRను వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో…. నాంపల్లిలో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సర్ పేరుతో బీజేపీ తనకు అనుకూలమైన ఓటర్లను మాత్రమే చేర్చుకుంటూ… వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తోందని ఆరోపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఫిరోజ్ఖాన్ను ఎలా కన్విన్స్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన మాత్రం నాంపల్లి నియోజకవర్గంలో sirను కొనసాగించాల్సిందేనని, ఓట్ల ఏరివేత పకడ్బందీగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. Sir పై అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో మాత్రం నకిలీ ఓటర్లను వేరివేయాలన్న డిమాండ్కు
కట్టుబడి ఉన్నానని అంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఇలాంటి ఓట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పుడు sirతో ఏరివేత మొదలు పెడితే… నాంపల్లిలో తనకు అనుకూలంగా ఉంటుందన్నది ఖాన్ ఫీలింగ్.
మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి ఎత్తుగడలు ఉంటాయి, ఏం చేస్తారన్న దాంతో నాకు సంబంధం లేదు, నాంపల్లిలో మాత్రం ఏరివేత జరిగి తీరాల్సిందేనంటున్న ఫిరోజ్ఖాన్ వాదనను కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు సమర్ధిస్తుందో చూడాలి. దేశం మొత్తం ఒక లెక్క… నాంపల్లిలో మాత్రం మరో లెక్క అన్నట్టుగా కాంగ్రెస్ పెద్దలు ఉంటారా? లేక ఒక నియోజకవర్గం కోసం పార్టీ పాలసీని మార్చుకోబోమని అంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
