తెలంగాణ సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పటి దాకా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారా? కేంద్ర మంత్రి భుజాన తుపాకీ పెట్టి రాష్ట్రంలో కాషాయ దళాన్ని లక్ష్యంగా చేసుకున్నారా? బీజేపీ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కల్పించాలనుకుంటున్నారా? రేవంత్రెడ్డి కొత్త టార్గెట్ ఏంటి? అజెండా ఎలా ఫిక్స్ చేశారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఆ దిశగా ఆల్రెడీ ఆయన టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. పొలిటికల్ స్టేట్మెంట్స్తో తనను ఇరుకున పెట్టాలని చూస్తున్న బీజేపీ నేతలకు రివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే…… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టాలని డిసైడైనట్టు చెప్పుకుంటున్నారు. రెండు అంశాల ఆధారంగా ఆయన మీద వత్తిడి పెంచాలని భావిస్తున్నారట ముఖ్యమంత్రి. ఆ మేటర్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రిక్గానే ప్రత్యర్థులను ఇరుకున పెట్టే స్కెచ్ రెడీ అయిందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ… రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించే… గతంలో భారీ స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్రెడ్డి. కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ…. రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్మానం చేసి పంపండి….24 గంటల్లో నిందితుల్ని జైల్లో పెడతామంటూ గతంలో ప్రకటించారు కేంద్ర మంత్రి. అదే సమయంలో కారణం ఏదైనాగానీ… సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్రం నుంచి ప్రతిపాదన వెళ్లింది. కానీ…ఇంతవరకు కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని టేకప్ చేయలేదు.
సరిగ్గా… ఈ పాయింట్ మీదే రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారట సీఎం. సీబీఐ ఇంత వరకు ఈ కేసును తీసుకోకపోవడాన్ని ఇక సీరియస్గా పరిగణించాలని సీఎం డిసైడైనట్టు తెలిసింది. దానికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఒత్తిడి పెంచడంతో పాటు…..రాష్ట్రంలో బీజేపీని ఇరకాటంలోకి నెట్టాలనుకుంటున్నారట. దీని గురించే ప్రజల్లో చర్చ పెట్టి బీజేపీ వ్యవహారాన్ని బయటపెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలోకి కూడా బీజేపీని లాగే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కట్టాలంటే…. మహారాష్ట్రలో కూడా ముంపు ప్రాంతం ఉంటుంది. దానికి కూడా పరిహారం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం.
అదే సమయంలో బీజేపీకి ఓ మెలిక కూడా పెట్టేశారు. మహారాష్ట్రలో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి… భూ సేకరణకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించే పనిని కిషన్ రెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారట. దానికి సంబంధించిన వ్యవహారాలను చూసే బాధ్యతను ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ముందు కిషన్ రెడ్డికి లేఖ రాయడం తో పాటు.. కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చూడాలన్నది ఆ బాధ్యత. ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాళేశ్వరం, తుమ్మిడిహెట్టిలోకి కేంద్ర మంత్రిని ఇన్వాల్వ్ చేసి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీని టార్గెట్ చేయాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. దీంతో…. కేంద్ర మంత్రి ఈ సిచ్యుయేషన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.
