Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?

  • దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి గ్రానైట్‌ క్వారీల్లో తనిఖీలు
  • రెండు రోజుల పాటు సర్వే, రికార్డుల పరిశీలన
  • తనిఖీలు సాధారణమే అయినా అధికారుల తీరుపై అనుమానాలు
  • చీమకుర్తి మండలంలో టీడీపీ, వైసీపీ సానుభూతిపరుల క్వారీలు
Kuwari

Kuwari

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌ క్వారీల్లో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయా? ఆ శక్తులే వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన క్వారీలను టార్గెట్‌ చేశారా? తెర వెనక కూటమికి చెందిన ఓ కీలక నాయకుడు ఉన్నాడన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్ళు అవుతున్నా… ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు సీన్‌ మారిపోయింది? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా క్వారీ కహానీ? ప్రకాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేప‌ల్లి శివ‌ప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్‌ క్వారీలపై రెండు రోజుల‌పాటు ఆకస్మిక దాడులు జరిగాయి. మైనింగ్ అధికారులు ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు, హద్దులకు సంబంధించిన కొలతలు తీశారు. రెండు బృందాలుగా వ‌చ్చిన అధికారులు చీమకుర్తి మండలం రామతీర్థంలో ఉన్న సూర్య గ్రానైట్స్‌ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించటం, హైటెక్‌ సర్వే కెమెరాలతో క్వారీల్లోని నలుమూలల కొలతలు తీయ‌టం చర్చనీయాంశమైంది. ఆఫీసుల్లోని రికార్డ్‌లను సైతం ఆసాంతం పరిశీలించారు. మామూలుగా అయితే… ఇదేం పెద్ద విషయం కాదు. పరిధిదాటి మైనింగ్‌ చేయడం, ఇచ్చిన పర్మిషన్‌కు మించి తవ్వేసుకోవడం లాంటి అక్రమాలను తేల్చేందుకు మైనింగ్‌ అధికారులు అప్పుడప్పుడూ ఇలా క్వారీల్లో తనిఖీలు చేస్తారు.

 

కానీ… ఈ కేసులో మాత్రం అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోందని, తెర వెనక ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. రామతీర్థం కేంద్రంగా చాలా గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో టీడీపీతో పాటు వైసీపీకి చెందిన, రెండు పార్టీల సానుభూతిపరులకు చెందినవి కూడా ఉన్నాయి. కానీ… ఇప్పుడు మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వేరే ఏ క్వారీ జోలికి పోకుండా… కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై మాత్రమే దాడులు నిర్వహించడం వెనక ఏదో జరిగిందన్నది ఎమ్మెల్యే వర్గం అనుమానం. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే త‌ర‌హాలో దాడులు జరిగాక బూచేపల్లికి చెందిన క్వారీలు రెండేళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో జరుగుతోందని, దీని వెనక అధికార కూట‌మి నేత ఒకరు ఉన్నారన్నది బూచేపల్లి వర్గం డౌట్‌. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకుండా.. ప్రభుత్వానికి రాయ‌ల్టీ చెల్లిస్తున్నామని వివరణ ఇస్తున్నారు. ఈనెల 7న ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మైనింగ్ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

సదరు వ్యక్తి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే… మైనింగ్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మూడు జిల్లాల స‌ర్వే అధికారుల‌ు సైతం క్వారీల్లో త‌నిఖీల‌ పేరుతో వాలిపోవడం ఏమీ సాధారణ విషయం కాదని అంటున్నారు. మామూలుగా ఏదైనా గ్రానైట్ క్వారీపై ఫిర్యాదు వస్తే…. అధికారులు పూర్తిగా ప‌రిశీలించి, వాస్తవ పరిస్దితుల‌కు సంబందించిన నివేదికను ప్రభుత్వానికి పంపి…. తదుపరి ఆదేశాల మేర‌కు దాడులు జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ మొత్తం జ‌ర‌గ‌టానికి త‌క్కువ‌లో త‌క్కువ‌ ఓ నెల రోజులు పడుతుందన్నది ఈ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు చెప్పేమాట. కానీ… ఇక్కడ మాత్రం కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల్లోనే ఫిర్యాదు రావడం, క్వారీల‌పై దాడులు జరగడాన్ని చూస్తుంటే…. తెర వెనక కూట‌మికి చెందిన ఓ బ‌ల‌మైన శ‌క్తి ఉండి న‌డిపించినట్టు కనిపిస్తోందంటున్నారు వైసీపీ లీడర్స్‌. దీంతో పాటు దాడులు జ‌రిగిన రోజున ఓవైపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు క్వారీలకు సిబ్బంది మొత్తం ఆ కార్యక్రమంలో ఉన్న సమయంలో ఆకస్మిక దాడులు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారట.

 

ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి పార్టీని బలోపేతం చేయటం, కార్యక్రమాల నిర్వహ‌ణ‌లో క్రియాశీల‌కంగా మారడంతోనే…. ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ఫ్యాన్‌ కార్యకర్తలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొండపి, కందుకూరు, కనిగిరి, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా….ప‌ట్టించుకోని మైనింగ్ అధికారులు.. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నఫ‌ళంగా దాడులు నిర్వహించారని, దీని వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. కూట‌మికి చెందిన కీల‌క నేత ఆదేశాల‌తోనే మైనింగ్ అధికారులు ఆఘ‌మేఘాల‌పై వ‌చ్చి దాడులు చేసి ఉండ‌వ‌చ్చన్నది వాళ్ళ అనుమానం. దీంతో ఆ అదృశ్య శక్తి ఏదన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్ళవుతున్నా…. ఇన్ని రోజుల్లో లేనిది ఇప్పుడే అక‌స్మాత్తుగా వైసీపీ ఎమ్మెల్యే క్వారీలు ఎందుకు టార్గెట్‌ అయ్యాయన్న డిస్కషన్‌ నడుస్తోంది.