గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేస్తారా? వదిలేస్తారా? ఆ విషయంలో కౌన్సిల్ ఛైర్మన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని నిర్ణయిస్తే… అందుకు టైం పడుతుందా? ఆ విషయంలో లీగల్ ఒపీనియన్ ఎలా ఉంది? ఇద్దరు శాసనమండలి సభ్యుల భవిష్యత్ ఎలా ఉంటుందని అంటున్నారు? వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఇద్దరిపై మంగళవారమే వేటేస్తారని భావించాయి తెలంగాణ రాజకీయవర్గాలు. ఆ ఎపిసోడ్ను ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవడంతో…ఎమ్మెల్సీలు ఇద్దరి మీద వేటు పడటం ఖాయమని అనుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన వెంటనే శాసనమండలిలో చర్యలు ఖాయమని అనుకున్నారు. కానీ… అక్కడ సభ్యుడిగా ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రతిపాదన మేరకు ప్రస్తుత సెషన్ వరకే… ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే ఇది కేవలం శాసనమండలికి సంబంధించినటువంటి అజెండా అమలు మాత్రమేనని అంటున్నారు. ఇక అసెంబ్లీ నుంచి వచ్చిన సిఫార్సు లేఖపై కూడా చర్యలు ప్రారంభించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇద్దరు గులాబీ ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా పని మొదలైందని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి… సభ్యత్వాల రద్దుకు సంబంధించి మండలి చైర్మన్ వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని, కానీ… అలా చేయకుండా…. ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన అని అంటున్నారు. అందులో భాగంగానే ఇద్దరు సభ్యుల వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారట మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిర్ణీత కాలపరిమితి విధించి నివేదిక కోరారాయన. న్యాయబద్ధంగా వ్యవహరించాలన్న ఆలోచనతోనే ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఏం చేసినా… లీగల్గా ఎక్కడా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వం ఆలోచనగా కనబడుతోందంటున్నారు పరిశీలకులు. అటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ శాసనమండలిలో ఎథిక్స్ కమిటీకి చైర్మన్. ఆయనతో పాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారు. వీలైనంత త్వరగా సమావేశం అవ్వాలని అనుకుంటోందట ఈ కమిటీ. అసెంబ్లీ నుంచి వచ్చిన తీర్మానాన్ని పరిశీలించి చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్స్టంట్ నిర్ణయాలు కాకుండా…. కాస్త సమయం తీసుకున్నా… చట్ట పరమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన అంటున్నారు. ఈ క్రమంలో… గీత దాటిన వాళ్ళ మీద వేటేయడం ఖాయమేగానీ… దానికి కాస్త సమయం పట్టవచ్చని, లీగల్ ఒపీనియన్ కూడా ఇదేనని అంటున్నారు.

