కొత్తగూడెం కారుకు రిపేర్లు మొదలు పెట్టారా? కాస్త సౌండ్ తేడాగా ఉన్న పార్ట్లు అన్నిటినీ సెట్ చేసే పని మొదలైందా? కుర్చీలు గాల్లోకి లేపితే కేర్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? ప్రస్తుతానికి సస్పెండ్ చేసింది చిన్న నాయకుడినే అయినా… ఆ రూపంలో ఓవరాల్గా సందేశం పంపారా? కొత్తగూడెంలో ఏం జరిగింది? అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు వివాదాలకు కేంద్రంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వనమా రాఘవేంద్రరావు, ఎమ్మెల్సీ రవీందర్రావు మధ్య మాటలు పేలాయి. గతంలో ఓ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి, సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవను సస్పెండ్ చేసింది పార్టీ. అయినాసరే…. వెనక్కి తగ్గకుండా కొత్తగూడెంలో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారాయన. తండ్రి వనమా వెంకటేశ్వరరావు అనారోగ్యంగా ఉండడంతో పార్టీ కేడర్కు రాఘవనే వెన్నంటి ఉంటున్నారు. అయితే కొంత కాలంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర కూడా యాక్టివ్గా ఉంటున్నారు. గ్రామ పంచాయతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలన్నీ వద్దిరాజు ఆధ్వర్యంలోనే జరిగాయి. లోక్సభ ఎన్నికల టైంలో సైతం ఆయనే కీలకంగా వ్యవహరించారు. అయితే సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీంద్రరావు నేతృత్వంలో జరిగింది. ఇందులో ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్లోనే వనమా రాఘవను ఉద్దేశించి తక్కెళ్లపల్లి మాట్లాడారు. దీంతో రాఘవ వర్గం, తక్కెళ్ల పల్లికి మధ్య వివాదం రేగింది.
దీంతో రాఘవ వర్గానికి చెందినవారు, ముఖ్యంగా పాల్వంచ ఏరియా కార్పొరేటర్స్, పలువురు అనుచరులు సీరియస్ అయ్యారు. కుర్చీలు ఎత్తేసి విరగ్గొట్టారు. తన మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వనమా రాఘవ సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లిపోగా…. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆయనతో…మాట్లాడి సభలోకి తీసుకుని వచ్చారు. కొత్తగూడెంలో పార్టీని ప్రతిష్టం చేసే విషయంలో అధిష్టానానికి ఒక లక్ష్యం ఉందని, అనవసరమైన వివాదాల జోలికి పోవద్దని క్లారిటీ ఇచ్చేశారు ముఖ్య నేతలు. ఘర్షణ సృష్టించే ఇటువంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని అంటూ…. రాఘవ వర్గానికి మద్దతు ఇచ్చిన అక్బర్ అనే బూత్ నాయకుడిని పార్టీ నాయకత్వం సస్పెన్షన్ చేసింది. నియమావళిని పట్టించుకోక పోతే… ఎవరికైనా ఇలాగే ఉంటుందని, అంతా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేందుకే ఈ సస్పెండ్ అస్త్రాన్ని వాడినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కొత్తగూడెం బీఆర్ఎస్కు ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియ మొదలైనట్టే కనిపిస్తోందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

