రెడ్ బుక్, గుడ్ బుక్ లాగా బీఆర్ఎస్ కూడా ఓ పింక్ బుక్ని రెడీ చేసుకోవాలనుకుంటోందా? అందులో తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాయాలనుకుంటోందా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు ఏం చెబుతున్నాయి? ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సివిల్ సర్వీసెస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? అధికారులు నిజంగా రాజకీం చేస్తున్నారా? లేక పార్టీలే వాళ్ళకు అంటగడుతున్నాయా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రెండ్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆహా..ఓహో అంటూ అధికారులతో పని చేయించుకున్న పార్టీలే ప్రతిపక్షంలోకి వచ్చాక అదే ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తున్నాయి. మళ్లీ మేం వస్తాం… మీ అంటు చూస్తామని ఉన్నతాధికారులను బెదిరించడం కామనైపోయింది. ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాల నేతలే పరస్పరం దుమ్మెత్తి పోసుకోగా… ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఆ క్రమంలోనే… ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కమిషనర్, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన పాల్గొన్నారు. అయితే… వాళ్లు ప్రోగ్రామ్లో వాళ్ళు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం అయ్యాయి.
గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల్ని ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తాము అలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పారు అధికారులు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా దీని మీద రియాక్ట్ అయింది. సివిల్ సప్లయ్స్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటల్ని తప్పు పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో… రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎస్ లు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదని కేటీఆర్ అన్నారాయన. మరో రెండున్నరేళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు కూడా. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ.. బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగుతున్నారని, ఇది ఎంతో కాలం నడవదన్నారు కేటీఆర్. గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. అంతకు ముందు లగచర్లలో భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారుల్ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
అయితే… ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించిన అధికారుల్ని ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారు ఐఎఎస్ అధికారులు. అప్పుడూ వాళ్లే, ఇప్పుడూ వాళ్ళే… అలాగే పని చేస్తున్నారు. మరి మారింది ఎవరో ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదన్న డిస్కషన్ నడుస్తోందట ఆఫీసర్స్ సర్కిల్స్లో. అందుకు కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ దాసరి హరి చందననైతే కేటీఆర్ విమర్శించారో….అదే ఆఫీసర్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించారు. నారాయణపేట కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె చేసిన పనులకు గుడ్ మార్క్స్ ఇచ్చారు అప్పట్లో. అలాగే…డీఎస్ చౌహన్ రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన్ని కూడా మెచ్చుకున్నారు నాటి బీఆర్ఎస్ పాలకులు. మరి అప్పుడు బాగున్న అధికారులు రెండేళ్ళలో ఎలా చెడ్డవాళ్ళయ్యారు? మార్పు జరిగింది ఎటువైపో అర్ధం చేసుకోవాలంటున్నారు ఆఫీసర్స్. దీనిపై అధికార పార్టీ కూడా రియాక్ట్ అవుతోంది. అధికారం కోల్పోయే సరికి బీఆర్ఎస్ నేతలకు దిక్కుతోచక అధికారులను దూషిస్తున్నారని అంటోంది కాంగ్రెస్. తాము పవర్లో ఉన్నప్పుడు ప్రశంసించి, అధికారం కోల్పోయాక విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదని చర్చ సివిల్ సర్వీసెస్ వర్గాల్లో కూడా నడుస్తోందట.
