ఒకప్పుడు నియోజకవర్గంలో ఆయన పేరు చెబితే హై వోల్టేజ్ రచ్చ. కానీ… ఇప్పుడు హై కాదు, లో కాదు…. ఫుల్ వాల్యూమ్లో పెట్టినా సౌండ్ వినిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు బస్తీమై సవాల్ అంటూ తొడగొట్టిన నాయకులు పవర్ పోగానే గాలి తీసిన బెలూన్లా మారిపోయారా? ఇప్పుడు నోరు తెరిస్తే కేసులవుతాయన్న భయం వెంటాడుతోందా? నియోజకవర్గంలో సార్.. బియ్యం ఉడకడం లేదని సొంతోళ్ళే సెటైర్స్ వేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా కథ? పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి… పొలిటికల్ హాట్ సీట్ కూడా. గతంలో…. ఇక్కడ బొజ్జల, బియ్యపు పేర్లు వినపడితే చాలు… పచ్చగడ్డి కూడా భగ్గుమనేది. 2019లో ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్రెడ్డి గెలిచాక వివాదం తీవ్ర రూపం దాల్చింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, మధుసూదన్రెడ్డికి మధ్య వ్యక్తిగత దూషణలు, సెల్ఫీ చాలెంజ్లు, శ్వేత పత్రం డిమాండ్స్ లాంటి వాటితో… రాజకీయం యమా రంజుగా ఉండేది. కానీ.. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క.. పోయాక మరో లెక్క అన్నట్టుగా ఉందట మాజీ ఎమ్మెల్యే తీరు. బియ్యపు మధుసూదన్రెడ్డి పవర్లో ఉన్నప్పుడు స్థానిక ప్రత్యర్థులే కాదు, ఏకంగా చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళమీద కూడా మైకేసుకుని విరుచుకుపడేవారు. దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలవాలంటూ టీడీపీ పెద్దలకు సవాళ్లు విసిరిన సందర్భాలూ ఉన్నాయి. జగన్ పేరుతో నవరత్నాల ఆలయం నిర్మాణం, ఇసుక, మట్టి, భూ దందాల ఆరోపణలతో అప్పట్లో నిత్యం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచిన మధుసూదన్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం పూర్తిగా వాల్యూమ్ తగ్గించేశారు. దీంతో… ఆ దూకుడు ఏమైంది? సార్లో ఆ పాత ఫైర్ ఆరిపోయిందా? అధికారం ఉంటేనే ఆయనలో అగ్గి అంటుకుంటుందా అంటూ
సెటైర్లు పడుతున్నాయి. మధు ఒక జోకర్, రెండు వేల కోట్లు దోచుకున్న బడా చోర్ అని, అధికారంలోకి వచ్చాక బియ్యపు సంగతి తేలుస్తామని లోకేష్, చంద్రబాబు గత ఎన్నికల సమయంలో పలుమార్లు చెప్పారు. ఇక లోకల్ టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే… అంతకుమించిన వార్నింగులే మధుసూదన్ రెడ్డికి ఇచ్చారు. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే… మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మ్యూట్ మోడ్ ఆన్ చేశారా అంటూ పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యపు శైలిలో మార్పు కనిపిస్తోందని సొంత కేడర్ కూడా గుసగుసలాడుకుంటోంది. గతంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లక్ష్యంగా పర్సనల్ ఎటాక్స్ చేసిన బియ్యపు…. ఇప్పుడు ఆ తరహా విమర్శలకు పూర్తి దూరంగా ఉంటున్నారట. నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేయకపోయినా… పాత దూకుడు మాత్రం కనిపించడం లేదంటున్నారు. స్థానిక సమస్యలు, డీఎస్సీ లాంటి పార్టీ నిరసనల్లో పాల్గొంటున్నప్పటికీ బొజ్జల కుటుంబంపై మాత్రం గతంలోలాగా వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఆచితూచి మాట్లాడుతున్నారటా. ఈ మార్పును గమనిస్తున్న పార్టీ కేడర్, కూటమినేతలు ఎవరి స్టైల్లో వారు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలపై విచారణలు, కేసులు నడుస్తున్న వేళ.. అనవసరంగా గోక్కుంటే… కొత్త తలనొప్పులు తప్పవన్న నిర్ణయానికి వచ్చే మధుసూదన్ రెడ్డి సైలెంట్గా గొడవలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలే లోకేష్ టార్గెట్ లిస్ట్లో ఉన్నారని, ఇప్పుడు ఏం ఎక్స్ట్రా చేసినా తేలిగ్గా దొరికిపోతానన్న లెక్కతోనే కామ్ అయ్యారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి కాళహస్తిలో. ఎక్కువ మాట్లాడితే గతంలో ఆరోపించిన రెండు వేల కోట్ల లెక్కలు ఎక్కడ బయటికి వస్తాయోనని భయపడుతున్నారన్న వ్యంగ్యాస్త్రాలు సైతం సంధిస్తున్నారు లోకల్గా. అయితే… ఈ వైఖరి ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి స్పేస్ ఇచ్చినట్టు అవుతుందని, ప్రతిపక్షం గట్టిగా నిలదీయకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా వెలుగులోకి వస్తాయంటూ సొంత వైసీపీ కార్యకర్తలే కామెంట్ చేస్తున్నారు. కేసులు, అరెస్టుల భయంతో మౌనం వహిస్తే… అది స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మధు సన్నిహితులు మాత్రం… అబ్బే, అలాంటిదేం లేదు, కొత్త గేమ్ ప్లాన్లో ఉన్నారంటూ కవర్ చేసుకుంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా…. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా అంత మొనగాడు లేడన్నట్టు స్టేట్మెంట్స్ ఇచ్చిన నాయకుడు ఇప్పుడు మాత్రం సౌండ్ పెంచితే ఏమవుతుందోనన్నట్టు ఉండటాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు పరిశీలకులు.

