Off The Record : బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎదురుచూపులకు ఫలితం దక్కబోతుందా?

Balineni

Balineni

టైం బ్యాడ్‌ అనుకుంటూ…. ఇన్నాళ్లు పొలిటికల్‌గా అలా అలా… టైంపాస్‌ చేసిన ఆ సీనియర్‌కు ఇప్పుడు రాశి ఫలాలు కలిసి వస్తున్నాయా? ఓపిగ్గా ఎదురు చూసిన ఫలితం దక్కబోతోందా? కీలకమైన నియోజకవర్గం టిక్కెట్‌తో పాటు రాయలసీమ బాధ్యతలు అప్పగించేందుకు జనసేన అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేసిందా? పొలిటికల్‌గా రీ లోడ్‌ అవుతున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన పొలిటికల్‌ స్కెచ్‌ ఏంటి? రాజకీయాల్లో ఒక్కోసారి మౌనం కూడా చాలా పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దానితోనే… జనసేనలో తన రాజకీయ భవిష్యత్తును గాడిన పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. పార్టీ మారిన తొలి రోజుల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం, స్థానికంగా ఎదురైన వ్యతిరేకత, కొందరు నేతల సహాయ నిరాకరణతో బాలినేని రాజకీయ ప్రయాణం స్లో అయినట్టు కనిపించింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తన నాయకత్వాన్ని వ్యతిరేకించిన వర్గాలపై నేరుగా పోరాటానికి వెళ్లకుండా, వారిని రాజకీయంగా ఒంటరి చేసే ఎత్తుగడలను అమలు చేస్తున్నారట ఆయన. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండతో రాజకీయంగా తిరిగి నిలబడే ప్రయత్నం చేసిన ప్రతిసారి సొంత నియోజకవర్గం ఒంగోలులో టీడీపీ వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో….ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీనివాసరెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ అధినేత మద్దతుతో పాటు మిత్రపక్షం పెద్దల నుంచి కూడా సానుకూలత ఉంటే… ఇక తిరుగుండదన్న లెక్కల్లో భాగంగానే మాజీ మంత్రి సీఎంను కలిసినట్టు అంచనా వేస్తున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ… ఈ కలయిక మాత్రం మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమా..అనే చర్చకు తెరలేపింది. ముఖ్యంగా స్థానికంగా బాలినేనిని తక్కువ అంచనా వేసిన వర్గాలకు ఈ భేటీ ద్వారా బలమైన రాజకీయ సందేశం పంపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే… తన రాజకీయ భవిష్యత్‌పై కూడా ఆయనకు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీనివాసరెడ్డి. కానీ… 2029 ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్నది ఆయన బలమైన కోరిక.

ఈ పరిస్థితుల్లో సీటు మారవచ్చని, ప్రకాశం జిల్లాలోనే మరో నియోజకవర్గం దర్శి నుంచి ఆయన పోటీ చేయవచ్చన్న ప్రచారం తాజాగా జనసేన వర్గాల్లో జరుగుతోంది. వరుసగా మూడు ఎన్నికల నుంచి వైసీపీ చేతిలోనే ఉంది దర్శి. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. అందుకే… ఇక్కడ బాలినేనిని బరిలో దింపితే… అటు వైసీపీకి చెక్‌పెట్టడం, ఇటు ఒంగోలు వివాద పరిష్కారం ఏకకాలంలో జరిగిపోతాయని కూటమి నాయకత్వం లెక్కలేసినట్టు తెలుస్తోంది. రేపు పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయిస్తే… తాను గెలిచి వస్తానని బాలినేని ప్రతిపాదన పెట్టినట్లు చెబుతున్నారు. అందుకు టీడీపీ, జనసేన అధినాయకత్వాల నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలా… అడ్డంకులు తొలిగిపోయాక…మాజీ మంత్రి రాజకీయ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని భావిస్తున్నారట పవన్‌కళ్యాణ్‌. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు కీలక నేతలు ఉన్నప్పటికీ, రాయలసీమకు ఆ స్థాయి నాయకులు లేరు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి సీమ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో జనసేన అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యం అయినా… పరిణామాలన్నీ తాను అనుకున్న విధంగానే జరుగుతుండటంతో బాలినేని కూడా యాక్టివ్ రోల్‌లోకి వచ్చేశారనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్‌కు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉండిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడం వంటి పరిణామాలు శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేశాయని అంటారు. అయితే జనసేనలో చేరిన కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ చొరవతో ఆ మైనింగ్ ఫైళ్లు క్లియర్ కావడంతో అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా ఊరట లభించినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాత రాజకీయ విభేదాలను పక్కనపెట్టి బాలినేనికి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో… రాజకీయంగా స్పీడ్ పెంచారన్నది విశ్లేషకుల మాట. ముఖ్యంగా ఇటీవల వైసీపీ అధినేత జగన్‌పై వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనుక కూటమి పెద్దల వ్యూహం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మాజీ మంత్రి ఆల్‌ క్లియర్‌ అనుకున్నాకే… దూకుడుగా ముందుకు వెళ్తున్నారన్నది పొలిటికల్‌ టాక్‌.