అధికారం ఉన్నప్పుడు ఆహా… ఓహో… అన్నారు. మా అంత మొనగాళ్ళు లేరంటూ బిల్డప్లు ఇచ్చారు. తీరా పవర్ పోయాక మొత్తం గాయబ్. చివరికి పార్టీ ఆఫీస్ బాగు చేసుకుందామయ్యా…. చందాలు ప్లీజ్ అంటున్నా… అబ్బే, మాకేం వినిపించడం లేదన్నట్టుగా ఉన్నారు. ఏ జిల్లా వైసీపీలో ఉందా పరిస్థితి? పార్టీ ఆఫీస్ రిపేర్కు కూడా డబ్బుల్లేనంత దయనీయంగా ఎందుకు మారింది? ఎక్కడైనా సరే.. ఎవరైనా సరే.. అధికారం ఉందంటే.. ఒకలా, లేదంటే మరోలా అన్నది కామన్. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అధికారంలో ఉన్నప్పుడు మా అంతటోళ్లు లేరు.. పార్టీ కోసం ఏమైనా చేస్తాం.. ఎంత ఖర్చైనా భరిస్తామంటూ ప్రగల్భాలు పలికారు జిల్లా నాయకులు. కానీ ఇప్పుడు కనీసం ఆఫీస్ ప్రారంభించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. వైసీపీకి ఇంతవరకు అనంతపురంలో సొంత కార్యాలయం లేదు. అందుకే… అధికారంలో ఉన్నప్పుడు…. శాశ్వత భవన నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జలవనరుల శాఖకు చెందిన ఒకటిన్నర ఎకరాల భూమిలో అత్యాధునిక హంగులతో జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం దాదాపు పూర్తి అయి కొంత వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంతలో ఎన్నికలు రావడంతో నేతల దృష్టి అటువైపు మళ్ళింది. ఎలాగూ మళ్లీ అధికారంలోకి వస్తాం కదా..అప్పుడు చూసుకుందామని అనుకున్నారో ఏమో కానీ.. బిల్డింగ్ని కంప్లీట్ చేయకుండా అలాగే వదిలేశారు. కానీ… ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు తప్పాయి. మొత్తం తల్లకిందులైంది. కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాల్లో నిర్మిస్తున్న కార్యాలయాల పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక. అంటే…. 2024 జూన్ లోనే ఈ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ టౌన్ ప్లానింగ్ అధికారి నోటీసులు ఇచ్చారు. ఇది అక్రమ నిర్మాణమని అందులో పేర్కొన్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం తక్షణమే భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.
ఏడు రోజుల్లోగా ఉల్లంఘనలను సరిచేయడం, లేదా కట్టడాన్ని తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మండిడ్డారు. ఇది కూల్చివేతల ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. అప్పట్లో ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉండటంతో వైసీపీ అధిష్టానం హైకోర్టుకు వెళ్లింది. దాంతో… కూల్చివేత సరైంది కాదని.. అన్ని ఆధారాలు చూపేందుకు నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని.. అప్పటి వరకు స్టేటస్ కో ఇస్తున్నట్టు చెప్పింది కోర్ట్. అప్పటికి ఆ కూల్చివేతలకు బ్రేక్ పడి, ఆ తర్వాత తర్వాత వైసీపీ అధిష్టానం అన్ని నిబంధనలు పాటిస్తున్నామని ఆధారాలు చూపడంతో కార్యాలయాల ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అంత వరకు బాగానే ఉన్నా… అసలు సమస్య సరిగ్గా అక్కడే మొదలైంది. ఇప్పుడు కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. అడుగు ముందుకేస్తే… ఎక్కడ ఆర్థిక భారం తమ నెత్తిన పడుతుందోనని భయపడుతున్నారట వాళ్ళంతా. వాస్తవానికి బిల్డింగ్ అక్రమమంటూ మున్సిపల్ అధికారుల నోటీసులు ఇచ్చాక దాని భద్రతే మర్చిపోయి గాలికి వదిలేశారు జిల్లా లీడర్స్. దాంతో కార్యాలయంలో దాదాపు విధ్వంసం జరిగినంత పని అయింది.
కొత్త నిర్మాణం కావడంతో…. గోడలకు పెట్టిన కిటికీలు, తలుపులు, ఇతరత్రా ఖరీదైన సామగ్రిని ఎవరికి దొరికినవి వాళ్ళు పెకిలించి మరీ తీసుకెళ్లిపోయారు. దాంతో అడపాదడపా తప్ప గోడలు మినహా ఇంకేమీ మిగలని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలంటే తక్కువలో తక్కువ 30 నుంచి 35 లక్షల దాకా ఖర్చు వచ్చేలా ఉందట. ఈ డబ్బు ఎవరి జేబుల్లోనుంచి తీసి ఇవ్వాలన్న దగ్గరే మేటర్ మొత్తం ఆగిపోయింది. మామూలుగా అయితే… పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఇతరత్రా పదవులు అనుభవించిన వాళ్ళంతా తలో చెయ్యి వేస్తే… అదేం పెద్ద సమస్య కాదు. కానీ… ఆ చెయ్యి వేయడానికే ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదట. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలకు గాను 12అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. ఇక నామినెటెడ్ పోస్టుల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు పది మంది దాకా ఉంటారు. మరి వీళ్ళంతా అధికారం ఉంటేనే పార్టీ నాయకులా? లేదంటే గాలికి వదిలేస్తారా? అప్పుడు సంపాదించుకున్న దాంట్లో అంతో ఇంతో ఇస్తే ఇప్పుడు పార్టీ ఆఫీస్ పూర్తి అవుతుంది కదా అంటోంది జిల్లా వైసీపీ కేడర్.
