ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారా..? లేక అలాంటిదేం లేకున్నా వాళ్ళే అడుగు పెట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ళలో కేవలం ఒక్క మంత్రి, అదీ ఒకే ఒక్కసారి అటువైపు చూడ్డం వెనకున్న రీజన్ ఏంటి? చివరికి జిల్లా మంత్రులు కూడా అక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎమ్మెల్యే పిలవడం లేదా? లేక పిలిచినా వాళ్ళు వెళ్ళడం లేదా? ఏ సెగ్మెంట్లో ఉందా పరిస్థితి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య విబేధాలు, వివాదాలు కొత్తేంకాదు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పాటు సొంత టీడీపీలోనే నేతల మధ్య విబేధాలు తరచూ రచ్చకెక్కడం కామన్ అయిపోయింది ఇక్కడ. ఏవీ సుబ్బారెడ్డితో విభేదాల కారణంగా పరస్పరం కేసులు పెట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
అటు అఖిలప్రియకు, ఆమె సొంత మేనమామ, వైసీపీ నేత, విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డికి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డితో పొలిటికల్ ఛాలెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలే లేవు. ఎవరిదాకనోఎందుకు, ప్రత్యేకించి జిల్లా మంత్రులు సైతం ఈ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు సైతం అటెండ్ అవడంలేదని చెప్పుకుంటున్నారు. కేవలం నారాయణ ఒక్కరు అదీ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా… ఈ ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి కేబినెట్లో వున్నా… ఈ రెండేళ్ళలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అడుగు పెట్టలేదట. దీంతో… ఈ ఒక్క చోటికి మాత్రమే వాళ్ళు ఎందుకు రావడం లేదు? ఆళ్ళగడ్డలో మంత్రులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టారా అంటూ చర్చలు జరుగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనడం సహజం.
ఆయా ఎమ్మెల్యేలు, అధికారులు మంత్రులతో మాట్లాడి వారిని ఆహ్వానిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. కానీ…. ఆళ్ళగడ్డకు ఎవరూ రావడం లేదని అంటే…. ఇక్కడి ప్రోగ్రామ్స్కు జిల్లా మంత్రులను ఎమ్మెల్యే పిలవడం లేదా? ఒకవేళ ఆహ్వానించినా మంత్రులే వెళ్లడం లేదా ? అన్న డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. వాటికి సమాధానాలు వెదికే క్రమంలోనే కొత్త సంగతులు తెలుస్తున్నాయట. ఎమ్మెల్యే భూమా అఖిల, మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి మధ్య విభేదాలు రోడ్డెక్కే స్థాయిలో లేకున్నా… మంచి సంబంధాలు మాత్రం లేవట. అందుకే జిల్లాకు చెందిన వాళ్ళయినా మంత్రులు ఇద్దరిని అఖిలప్రియ నియోజకవర్గానికి ఆహ్వానించడం లేదని చెప్పుకుంటున్నారు. సిరువెళ్ళ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సందర్భంలో మాత్రమే మంత్రి ఫరూక్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రసాదరెడ్డి కూడా అప్పుడే నియోజవర్గానికి వచ్చారు. అవి తప్ప ఏ ఇతర సాధారణ సందర్భాల్లో మంత్రులు ఇటువైపు చూడకపోవడం కాస్త తేడా వ్యవహారమేనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆధిపత్యం కోసం భూమా అఖిల కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. నంద్యాల నాదే, ఆళ్లగడ్డ నాదేనంటూ ఒక సందర్భంలో సీరియస్ కామెంట్స్ చేశారామె.
ఈ వ్యవహారంపై మంత్రి ఫరూక్ అప్పట్లో టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ఈ పరిస్థితుల్లో…. మంత్రి, ఎమ్మెల్యే పైకి మాటలు కలిపినా… సమన్వయం లేదన్నది పార్టీ వర్గాల మాట. అసలు ఇద్దరూ కలిసి పనిచేసే వాతావరణమే లేదని అంటున్నారు. మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, భూమా అఖిల మధ్య కూడా సమన్వయం లేదట. దీంతో ఆళ్లగడ్డలో అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా మినిస్టర్స్ని పిలవడం లేదన్నది లోకల్ వాయిస్. ఈమె పిలిచేది లేదు, వాళ్ళు వచ్చేది లేదంటూ టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు అభివృద్ధి కోసం జోడెద్దుల్లా పనిచేయాల్సిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఇలా విభేదాలుంటే… ఆ ప్రభావం నియోజకవర్గంపై పడుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది ఆళ్ళగడ్డలో. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని టీడీపీ అధిష్టానం కూడా లైట్ తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి చాలామందికి. రాజకీయ, వ్యక్తిగత విబేధాలు ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలి, లేదా వాళ్లు వాళ్ళు అంతర్గతంగా తేల్చుకోవాలిగానీ…. ఇలా నియోజకవర్గ అభివృద్ధిని పణంగా పెడితే ఎలాగన్న వాదన పెరుగుతోంది ఆళ్ళగడ్డలో. అసలు ఇలాంటి వాతావరణం పార్టీకి కూడా నష్టమేనని, ఈ విషయంలో హైకమాండ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ కార్యకర్తలు.
